ఎర్రచందనం స్మగ్లింగ్ పై CBI విచారణకు వివరాలు కోరిన కేంద్ర ప్రభుత్వం
-ఎర్రచందనంపై తొలిసారిగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- రామచంద్రయాదవ్ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రంలోని తిరుమల శేషాచలం అడవులతో పాటు అనేక ప్రాంతాల్లో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై సీబీఐ విచారణ చేపట్టాలని 22-2-23న న్యూఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అందజేయాలని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ శివానంద్ ఎస్ తలావార్ ఆదేశించారు.
ఎర్రచందనం శేషాచలం అడవులతో పాటు కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవహారాలను నిర్వహించడానికి తిరుమల- తిరుపతి దేవస్థానం స్థాపించబడినది. టీటీడీ ముఖ్యమైన ఆస్తుల్లో శేషాచలం అడవులు ఒకటి. అంతర్జాతీయంగా ఎర్రచందనంకు విలువ అధికంగా ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరకి, స్మగ్లింగ్ కార్యకలాపాల ద్వారా పర్యావరణ వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ అక్రమ వ్యాపారంవల్ల నేరాలు పెరగడం, ఉగ్రవాదానికి నిధులు వెళ్తున్నట్లు ఉన్న అనుమానాలతో ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందని, వెంటనే స్మగ్లింగ్ అరికట్టి, స్మగ్లర్లను కఠినంగా శిక్షించేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
వెంకటేశ్వర స్వామికి చెందిన వేలకోట్ల ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టడానికి, అక్రమ కార్యకలాపాలను వెలికితీసి క్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని మంత్రిని కోరారు. మంత్రి భూపేంద్ర యాదవ్ స్పందించారు. ఈ ఫిర్యాదు మేరకు న్యూఢిల్లీ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ శివానంద ఎస్ తలావార్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వారికి వివరాలు కోరుతూ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడంలో ప్రస్తుతం ఉన్న చట్టాలు, నియమాలు, నిబంధనలు పరిశీలించి మీరు తీసుకున్న చర్యలను, ప్రాథమిక వివరాలను దరఖాస్తుదారుడైన రామచంద్ర యాదవ్ కు,కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై విచారణ కోరడం హర్షనీయం . రాష్ట్ర ప్రభుత్వ వివరాల మేరకు త్వరలోనే సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరుగుతుందని, ఎర్రచందనం స్మగ్లర్లను నిరోధించి, శేషాచలం అడవులను కాపాడేందుకు ఇది తొలిమెట్టు రామచంద్ర యాదవ్ అన్నారు. సి.బి.ఐ విచారణలతో బడా స్మగ్లర్లు, వారికి సహకరిస్తున్న ప్రభుత్వ పెద్దలు, తదితర వివరాలన్నీ బహిర్గతం కావడానికి సమయం దగ్గరలోనే ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.