BJP గూటికి మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి ?
BJP గూటికి మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) బాజాపా (BJP)లో చేరడానికి రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. ఆయన రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్గా ఉండబోతున్నారని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. రాయలసీమలో బీజేపీ వ్యూహాల కోసం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ కీలక నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి రెండు దఫాలుగా జరిపారని, చర్చలు ఫలించడంతోనే ఆయన కాషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, కమలం గూటికి చేరుతారని తెలుస్తోంది. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. మాజీ సీఎం హోదాలో కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే మైలేజ్ వస్తుందని బీజేపీ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ లేదా కిరణ్ కుమార్ రెడ్డి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
కొద్దిరోజుల కిందట కిరణ్ కుమార్ బీజేపీలో చేరుతారన్న టాక్ వినిపించింది. అప్పట్లోకిరణ్ ఖండించారు. అయితే ఇటీవల బీజేపీ పెద్ద నేతలు కిరణ్ తో చర్చలు జరిపినట్టు సమాచారం. ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి కావడంతో రెండు రాష్ట్రాల్లో ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నది బీజేపీలో ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కిరణ్ కు జాతీయ స్థాయిలో పార్టీ పదవితో పాటు రాజ్యసభ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో పార్టీలో చేరుతున్నందున తన గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని కిరణ్ కోరినట్టు సమాచారం. అయితే అన్నీ కుదిరితే మాత్రం కొద్దిరోజుల్లో కిరణ్ బీజేపీ గూటికి చేరడం ఖాయంగా తెలుస్తోంది.
హస్తం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన పలు పదవులు కూడా చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో 2010 నవంబర్లో ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆ సమయంలో పాలనలోనూ తన మార్క్ ను చూపించారు. విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపును పీలేరు నుంచి పోటీచేసిన కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. 2024 ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నారు.
2010లో రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత కేబినెట్ లో సీనియర్ అయిన రోశయ్యకు సీఎం పదవి వరించింది. అయితే అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో రోశయ్య ఆశించినంతగా పనిచేయలేదు. దీంతో హైకమాండ్ అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం పీఠం ఎక్కించింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. కుటుంబ రాజకీయ నేపథ్యంతో సీఎం పదవి వరించింది. అందుకు తగ్గట్టుగానే కిరణ్ పాలనా పరంగా మంచి మార్కులే సాధించారు. అయితే ఇంతలో జగన్ వైసీపీ రూపంలో, రాష్ట్ర విభజన మరో రూపంలో కిరణ్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
చిత్తూరు జిల్లాలో నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాలతో పాటు చంద్రబాబు రాజకీయాలు చేశారు. ఈ మూడు కుటుంబాల మధ్య వైరం ఉంది. అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సైతం ఒకే పార్టీలో ఉన్న నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య అంతగా పొసిగేది కాదు. ఆ కారణం చేతనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ గూటికి చేరారు. అప్పటికే సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని అచేతనంగా చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి అధికారంలో ఉండడంతో చిత్తూరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు.