23, జనవరి 2024, మంగళవారం

జోష్ మీదున్న వైసీపీ - అయోమయంలో టీడీపీ



ఆధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ముందుంది. వరుస జాబితాలు విడుదల చేస్తూ కార్యకర్తలలో జోష్ నింపుతుంది. ఇందుకు విరుద్ధంగా టీడీపీ స్తబ్దతగా ఉంది. అభ్యర్థుల గురించి ఇంకా కసరత్తు ప్రారంభం కాలేదు. అసలు పొత్తు విషయం ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. ప్రస్తుతం జనసేన, టీడీపీ కలిసి ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ పొత్తు విషయం ఇంకా తేలలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అంటే బీజేపీ పోతును టీడీపీ కూడా ఆశిస్తోంది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ పొత్తు విషయం అధిష్టానం నుండి క్లారిటీ రాలేదు. పొత్తు ఉంటుందో, ఉండదో తెలియని అయోమయ పరిస్థితి. బీజేపీ పొత్తు విషయంలో క్లారిటీ వస్తే తప్ప టీడీపీ, జనసేన అభ్యర్థుల విషయంలో ముందుకు వెళ్లలేని నిస్సహాయ పరిస్థితి. 
ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి నేతల్లో టికెట్లు ఎవరికి అన్న గందర గోళం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు తన స్వంత జిల్లాలో సకాలంలో, సరైన అభ్యర్థులను ఎంపిక చేయక పోవడం పట్ల కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతున్నది. పుట్టి పెరిగిన ప్రాంతంలో చుట్టూ ఉన్న వారిలో సమర్థులు ఎవరో గుర్తించడానికి సర్వేల మీద ఆధారపడటం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంచార్జిలు అభ్యర్థులు కారని ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

 దీంతో జిల్లాలో కొద్ది మంది ఇంచార్జిలు తప్ప మిగిలిన వారు టికెట్టు వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్నారు. దీనితో చాలా నియోజక వర్గాలలో తూ తూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలు కూడా పెళ్ళిళ్ళు, చావులు, గృహప్రవేశాలు, గుడులకు హాజరై నియోజకవర్గంలో తిరుగుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. టికెట్టు నమ్మకం ఉన్న వారు మాత్రం గట్టి ప్రచారం చేసుకుంటున్నారు.  చంద్రబాబు బృందం కుప్పంలో లక్ష మెజారిటీ సాధన లక్ష్యంతో పనిచేస్తున్నది. పలమనేరు నియోజక వర్గంలో ఇంచార్జి ఎన్ అమరనాద రెడ్డి ఉదయం నుండి రాత్రి వరకు అలుపెరకకుండా గ్రామాలలో పర్యటిస్తున్నారు. పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ మధ్య నియోజకవర్గంలో తిరుగుతున్నారు. శ్రీకాళహస్తిలో  బొజ్జల సుధీర్ రెడ్డి, అయన సతీమణి పట్టుదలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. గంగాధర నెల్లూరు ఇంచార్జి థామస్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మిగిలిన నియోజక వర్గాలలో నాయకులు  అపనమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గంలో అప్పుడప్పుడు తలుక్కుమంటున్నారు.

చిత్తూరులో కనీసం ఇంచార్జి కూడా లేరు. ఇక్కడ రోజుకు ఒకరి పేరు వినిపిస్తోంది. డి కె ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసులు పోటీలో ఉంటారని ప్రచారం జరిగింది. తిరుపతి జిల్లాకు చెందిన సి ఆర్ రాజన్ కే టిక్కెట్టు అంటూ కొన్నాళ్ళు చెవులు కొరికారు. ప్రముఖ వ్యాపార వేత్త గురజాల జగన్ మోహన్ నాయుడుకే టిక్కెట్టు వస్తుందని ఒక వర్గం గట్టిగా అంటోంది. ఇంతలో మాజీ ఎమ్మెల్యే సి కె బాబు లేదా పార్లమెంటు అధ్యక్షుడు పులి వర్తి నాని పేర్లు తెరపైకి వచ్చాయి. 

తిరుపతిలో పరిస్తితి అగమ్య గోచరంగా ఉంది. ఆ స్థానం కోసం జనసేన పట్టుబడుతోంది. బలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నందున తమకే సీటు కేటాయించాలని అంటున్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, నియోజక వర్గం ఇంచార్జి కిరణ్ రాయల్ మీడియా సమావేశం పెట్టి సీటు కోసం డిమాండ్ చేశారు. టిడిపి ఇంచార్జి సుగుణమ్మ గట్టి ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆమె ఆమెతో పాటు అర డజన్ బలిజ నేతలు టికెట్టు ఆశిస్తున్నారు. రెడ్డిపై రెడ్డిని పోటీ పెట్టాలంటే తనకు ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి పట్టు పడుతున్నారు. 

సత్యవేడు నియోజకవర్గంలో ఇంచార్జి హెలన్ వెనక బడిందని అంటున్నారు. అక్కడ కొత్తగా జేడి మౌనిక, డాక్టర్ చందన స్రవంతి పేర్లు తెర పైకి వచ్చాయి. నగరిలో గాలి భానుప్రకాష్ కు వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందున జెసిఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ బి హర్ష వర్ధన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందంటున్నారు. జి డి నెల్లూరులో  థామస్ కు ఇప్పటికీ గ్యారంటీ లేదంటున్నారు. అక్కడ జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సైటును జనసేనకు కేటాయిస్తే, థామస్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. పూతలపట్టు ఇంచార్జి డాక్టర్ మురళి మోహన్ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. చంద్రగిరిలో పులివర్తి నానీ మార్పు తథ్యం అంటున్నారు. ఇక్కడ కె ఇందు శేఖర్ టికెట్టు రేసులో ఉన్నారు. కొత్తగా ల్యాంకో మునిశంకర్ రెడ్డి అరగ్రేటం చేశారు.

నగరి కాకుంటే హర్షవర్ధన్ రెడ్డికి చంద్రగిరి అయినా కేటాయించాలని రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పట్టు పడుతున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై చల్లా రామచంద్రా రెడ్డి ధీటైన అభ్యర్థి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అనీషా రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అలాగే సోమల సురేష్ కూడా రేసులో ఉన్నారు. మదనపల్లి టికెట్టు జనసేన ఖాతాలోకి వెలుతుందన్న ప్రచారం ఉంది. తంబళ్లపల్లె టికెట్టు వ్యవహారం ఇంకా శంకర్ యాయవ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఊగిసలాడుతోంది.

ఈ నేపథ్యంలో టిడిపి నేతల్లో అధిక శాతం నిరాశతో ఉన్నారు. వైసిపి దాదాపు అన్ని నియోజక వర్గాల అభ్యర్థులను ప్రకటించింది. వారు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తక్షణం సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసి రంగంలో దింపక పోతే ఈ పర్యాయం కూడా పార్టీకి నష్టం తప్పదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *