విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల భారం ఉపసంహరించుకోవాలి: CPM
విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల భారం ఉపసంహరించుకోవాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్
విద్యుత్ ఛార్జీలను పెంచలేదని ఒకవైపున నోటిఫికేషన్ జారీ చేస్తూ, మరోవైపు సర్ధుబాటుచార్జీల పేరుతో దొడ్డిదారిన భారాలు వేయడం మోసపూరితమని వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 ఏప్రిల్ నుండి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతినెల విద్యుత్ యూనిట్కు 40 పైసల చొప్పున అదనంగా సర్దుబాటు చార్జీలు (ట్రూఅప్) వసూలు చేయటాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రతి నెల వసూలు చేయడమే కాకుండా మళ్లీ సంవత్సరాంతంలో అవసరమైతే అదనంగా సర్దుబాటు భారం మోపే ప్రమాదం కూడా ఉంది.
గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలకు పెంచి భారం మోపింది. 2014-19 మధ్య వినియోగించుకున్న విద్యుత్కు ఇప్పుడు 36 నెలల పాటు యూనిట్కు 25 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. దీని వలన 2900 కోట్ల రూపాయల భారం పడింది. 2020- 21లో వినియోగించుకున్న విద్యుత్పై యూనిట్కు 65 పైసలు వరకు 2023 ఏప్రిల్ నుండి అదనంగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పేరుతో 3083 కోట్ల రూపాయల భారం వినియోగదారులపై పడనున్నది. మళ్లీ స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ వ్యయాన్ని నెలవారీగా ప్రజలపై వేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలురూపాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలు మోపుతున్నది. బడా కార్పొరేట్ కంపెనీల నుండి విద్యుత్ అధిక రేట్లకు కొనుగోలు చేస్తూ ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. అదాని తదితర కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే రీతిలో బొగ్గు అధిక రేట్లకు కొనుగోలు చేసి సర్దుబాటు చార్జీల పేరుతో దండుకుంటున్నారు.
విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాట తప్పి ఈ రీతిలో భారాలు మోపటం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతినెల విద్యుత్ సర్దుబాటు చార్జీలు విధించి భారాలు వేసే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. విద్యుత్ భారాలను ప్రతిఘటించాలని ప్రజలకు పిలుపునిస్తున్నది.