సమస్యల పరిష్కారం కోసం 9 నుండి ఏపీ ఉద్యోగుల ఆందోళన బాట
సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉద్యోగులు యుద్ధం ప్రకటించారు. ఏదోఒకటి తేల్చుకునేవరకు తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఈసారి పోరాటం అల్లాటప్పాగా ఉండదంటున్నారు. తమ డిమాండ్లు, సమస్యలను పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తమ పోరాటానికి మార్చి 9ని ముహూర్తంగా ఎంప్లాయిస్ ఎంచుకున్నారు. అందుకు సంబంధించి సీఎస్ జవహర్రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చేశారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలకు ఏపీ ఉద్యోగుల అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది.
బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోరాటంలో భాగంగా ప్రతి ఉద్యోగి నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలపాలని కోరారు. గతంలో మాదిరిగా ఈసారి మధ్యలోనే ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం కొనసాగుతుందంటున్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏడాదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, రాయితీలు ఇవ్వడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 11వ పీఆర్సీ బెనిఫిట్స్ ఎక్కడ?, 2018 నుంచి రావాల్సిన 6 డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎప్పడిస్తారంటూ ప్రశ్నించారు. ఈసారి తమ పోరాటం సీరియస్గా ఉంటుందంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.