మూడు పట్టభద్రుల MLC ఎన్నికల్లో టిడిపికే పట్టం !
- TDP ప్రతినిధి సుధాకర్ రెడ్డి ధీమా
వైకాపా నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకే ఓటర్లు పట్టం కట్టడం ఖాయమని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 13న రాష్ట్రంలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
టిడిపి అభ్యర్థులుగా తూర్పు రాయలసీమలో డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తర ఆంధ్రలో డాక్టర్ వేపాడ చిరంజీవి రావు పోటీ చేస్తున్నారని తెలిపారు. వైకాపా నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా పట్టభద్రులు టిడిపి అభ్యర్ధులకు అండగా నిలుస్తారని చెప్పారు. జగన్ పాలన వల్ల నష్ట పోయిన ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులు టిడిపికి అండగా ఉన్నారని చెప్పారు. అయితే వైకాపా నాయకులు దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు వేయించుకుని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అలాంటి వారిని పట్టుకుని కేసులు పెట్టడానికి టిడిపి కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఓటుకు ఐదు పది వేల రూపాయలు ఇవ్వడానికి వైకాపా నేతలు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్లు, ఇసుక మాఫియా రంగంలోకి దిగి ఓట్లను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల వైకాపా నేతలు టీచర్లు, ఉద్యోగులను బెదిరించి ఓట్లు వేయించు కోవడానికి చూస్తున్నారని చెప్పారు. అయితే పట్టభద్రులు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలను లొంగరని చెప్పారు.
తిరుపతిలో ఒక ఇంటిలో 38 దొంగ ఓట్లు, మరో ఇంటిలో 30 నకిలీ ఓట్లు బయట పడ్డాయని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు దాదాపు 3000 వేలకు పైగా నకిలీ ఓట్లను గుర్తించామని చెప్పారు. కొన్ని చోట్ల వైకాపా నాయకులు ఐదు, పదవ తరగతి చదివిన వారిని కూడా ఓటర్లుగా నమోదు చేయించారని తెలిపారు. బోగస్ ఓట్లను వెలికి తీసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వారి భరతం పడతామని చెప్పారు. వైకాపా అరాచకాలను అడుగడుగునా అడ్డుకోవాడానికి టిడిపి కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఓట్లు ఉన్న పట్టభద్రులు టిడిపి పట్ల ఆదరణ చూపుతున్నారని సుధాకర్ రెడ్డి చెప్పారు.