4, డిసెంబర్ 2023, సోమవారం

సత్యవేడులో మహిళలకే ఛాన్స్ !

టిడిపికి కంచుకోట అయిన ఎస్సీ రిజర్వు నియోజక వర్గం సత్యవేడులో పట్టు సాధించడానికి  ఆచితూచి అభ్యర్దిని ఎంపిక చేయడానికి చంద్రబాబు అన్వేషణ ప్రారంభించారు. ఇంచార్జి గా ఉన్న జేడీ రాజశేఖర్ ను రెండేళ్ల క్రితం తొలగించి మాజీ ఎమ్మెల్యే హేమలతకు బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజులకే  ఆమె బదులు ఆమె కుమార్తె హెలెన్ ను ఇంచార్జి గా నియమించారు. అయితే చెన్నైలో ఉన్న ఆమె అనుకున్న రీతిలో పనిచేయడం లేదని, ఆమె సామాజిక వర్గం ఓట్లు తక్కువగా ఉన్నాయని, ఆమెను నమ్ముకుంటే నష్ట పోతామని కొందరు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పైగా జేడీ రాజశేఖర్ సమాంతరంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. దీనితో అభ్యర్ధి ఎంపిక విషయంలో చంద్రబాబు మరింత లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా జేడీ రాజశేఖర్ కుమార్తె  మౌనిక, మాజీ జెడ్పీ చైర్మన్ రాజశేఖర్ కూతురు డాక్టర్ చందన పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.


టిడిపి ఏర్పాటు చేసినప్పటి నుంచి జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తే ఇక్కడ టిడిపికి బలం ఉందని తెలుస్తుంది. 1983లో తలారి మనోహర్, 1985, 1994లో సురాజ్ ,1999లో ఎన్ శివప్రసాద్, 2009లో హేమలత, 2014లో తలారి ఆదిత్య టిడిపి గుర్తుపై గెలిచారు. 1989లో సి దాసు, 2004లో కె నారాయణ స్వామి కాంగ్రెస్ టిక్కెట్టుపై పోటీ చేసి గెలిచారు. 2019 లో వైసిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయం సాధించారు. అంటే ఆరు సార్లు టిడిపి, రెండు సార్లు కాంగ్రెస్, ఒక సారి వైసిపి గెలుపు సాధించారు. కులాల వారిగా చూస్తే ఎనిమిది సార్లు మాల సామాజిక వర్గీయులు, ఒక సారి మాదిగ సామాజిక వర్గం వ్యక్తి గెలిచారు.


పునర్వ్యవస్థీకరణ తరువాత సత్యవేడు, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, బి ఎన్ కండ్రిగ, కేవిబి పురం మండలాలతో నియోజక వర్గం ఏర్పడింది. 2009 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి హేమలత కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ స్వామిపై 9,631 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 లో తలారి ఆదిత్య వైసిపి అభ్యర్థి కోనేటి అదిమూలంపై 4,227 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 లో వైసిపి అభ్యర్ధి ఆదిమూలం టిడిపి అభ్యర్థి జేడీ రాజశేఖర్ మీద 44,744 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత ఇంచార్జి హెలెన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె తల్లి హేమలత గతంలో టిడిపి టిక్కెట్టుపై ఎమ్మెల్యే అయ్యారు. తాను ఇంచార్జి అయినప్పటి నుంచి నియోజక వర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక స్థానమైన మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తు ఉన్నందున ఆమెకు తప్పకుండా టిక్కెట్టు వస్తుందని అంటున్నారు.

జేడీ రాజశేఖర్ తో పాటు ఆయన కుమార్తె, రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి మౌనిక పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఆర్కిటెక్చర్ ఇంజనీరు అయిన ఆమె తండ్రితో పాటు నియోజక వర్గంలో చురుగ్గా తిరుగుతున్నారు. చక్కగా మాట్లాడగల యువతి అయిన ఆమెను అభ్యర్థిగా పోటీ పెడితే ప్రయోజనం ఉంటుంది అంటున్నారు.

కొత్తగా తిరుపతిలో డెంటిస్ట్ గా ఉన్న డాక్టర్ పి చందన స్రవంతి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆమె ఇటీవల చంద్రబాబు, లోకేష్ లను కలసి అభ్యర్థిత్వం కోరింది. ఆమె తండ్రి రాజశేఖర్ గతంలో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఆమె తల్లి డాక్టర్ నాగభూషమ్మ  చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె భర్త పుష్యమిత్ర న్యాయవాదిగా ఉన్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *