తిరుపతిలో రూ.4,050 వేల కోట్ల టిడిఆర్ బాండ్ల కుంభకోణం
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి మునిసిపాలిటీలో టిడిఆర్ బాండ్ల కుంభకోణం చంచలనం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి ఈ కుంభకోణంను బయటపెట్టగానే జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒక్క తిరుపతిలోనే 4,050 వేల కోట్ల టిడిఆర్ బాండ్లను జారీ చేసినట్లు ఆయన సమాచారం చట్టం కింద ఆధారాలు సేకరించారు. ఈ బాండ్లలో స్థలం లేకపోయినా అసమ్మదీయులకు బాండ్లను కట్టబెట్టారు. మరికొందరికి భూముల విలువను రెండు, మూడు రెట్లు పెంచేశారు. ఈ బాండ్లను విశాఖలో బ్లాక్ చేసి విచారణకు ఆదేశించారు. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి విచారణకు కమీటీని ఏర్పాటు చేశారు.
తిరుపతిలో మాస్టర్ప్లాన్ రోడ్లకు 2,85,406 చదరపు గజాల భూమి తీసుకుంటున్నట్లు చూపించి గడిచిన రెండేళ్లలో 342 టీడీఆర్ బాండ్లను జారీ చేశారు. ఒక్కో చదరపు గజానికి సరాసరి విలువ రూ.35వేలు లెక్కించినా మొత్తం విలువ రూ.1013 కోట్లు వస్తుంది. వ్యవసాయ, నివాస భూములకు వాటి విలువ ఆధారంగానే టీడీఆర్ బాండ్లు జారీచేయాలి. కమర్షియల్ భూములకు మాత్రం దాని విలువకు నాలుగు రెట్లు అధికంగా ఇవ్వొచ్చు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లకు తీసుకుంటున్న మొత్తం భూమిని కమర్షియల్ కింద చూపించి సుమారు రూ.4050 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. ఇక్కడే అసలైన కుంభకోణానికి తెరలేపారు.
డి.మురళి, చెన్నూరు గోపి, అమర్ రామారావు అనే వ్యక్తులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే భూమన మాస్టర్ ప్లాన్ కమిటీని ఏర్పాటు చేశారు. మురళీ 14-10-2020న వేరొకరి నుంచి జీపీఏ తీసుకున్నట్లు చూపించారు. ఆ జీపీఏలో చదరపు గజం విలువ రూ.10వేలుగా పేర్కొన్నారు. 16 నెలలు తిరిగే సరికి ఆ విలువను రూ.1.60లక్షలకు పెంచి మురళీకి (టీడీఆర్ బాండ్ నంబర్ 00062) రూ.12.69కోట్ల విలువైన బాండ్లను ఇచ్చారు. అమర్నాథ్రెడ్డి కూడా 14-02-2020వ తేదీనే వేరొకరి దగ్గరి నుంచి జీపీఏ తీసుకున్నట్లు చూపించి ఆ భూమికిగానూ రూ.14కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు(నంబర్ 00063) జారీచేశారు. పై ఇద్దరికీ అసలు ఆ భూమితో సంబంధం లేకపోయినా దొంగ డాక్యుమెంట్ల ద్వారా రూ. కోట్లు దోచిపెట్టారు. ప్రతి మున్సిపాలిటీలోనూ దొంగ డాక్యుమెంట్లతో రూ. వేల కోట్ల విలువైన బాండ్లను జారీ చేశారు.
బాండ్ విలువ కన్నా 40ు ఎక్కువ ప్రీమియం ధరతో బిల్డర్లకు అమ్ముతున్నారు. ఈ విధంగా ఒక్క కరుణాకర్రెడ్డే 40ు ప్రీమియం రూపంలో సుమారు రూ.2వేల కోట్లు సంపాదించారు. తిరుపతిలో జారీచేసిన టీడీఆర్ బాండ్లను విశాఖపట్నంలో బ్లాక్చేసి విచారణకు సీనియర్ పోలీసు అధికారిని నియమించారు. అంతా అయిపోయాక మున్సిపల్ శాఖ హెడ్ శ్రీలక్ష్మి... టీడీఆర్ బాండ్ల జారీపై కమిటీ వేయాలంటూ ఉత్తర్వులిచ్చారు.
కంచి రాము అనే వ్యక్తి (టీడీఆర్ బాండ్ నం.00356) నుంచి 3103 చదరపు గజాలు (0.64 ఎకరాలు) తీసుకుని అందుకు రూ.61.02 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీచేశారు. నివాస భూమి అయినా కమర్షియల్ ధర ఇచ్చారు.
కే.వెంకటరమణారెడ్డి (టీడీఆర్ బాండ్ నెం.00320) నుంచి 4793 చదరపు గజాలు తీసుకున్నట్లు చూపించి రూ.53 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. ఇది వ్యవసాయ భూమి కాగా కమర్షియల్ కింద చూపించారు.
పులుగోరు మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి నుంచి 3415 చదరపు గజాలు(0.75 ఎకరాలు) తీసుకొని రూ.55 కోట్ల విలువైన బాండ్లు జారీ చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు బిడ్డ అశ్రితకు చెందిన 60 సెంట్లను తీసుకొని రూ.32.50 కోట్ల విలువైన బాండ్లు ఇచ్చారు.
ఇలా సమ్మదీయులకు ఆయాచిత లబ్ది చేకూర్చారు. అధికారులు, అనాధికారులు, ప్రజాప్రతినిధులు కొట్లాది రూపాయలను వెనకేసుకున్నారు. ఈ లావాదేవీలకు సంభవించింది వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడానికి కూడా మూడు చెరువుల నీళ్లు తాగించారు. సమాచారం బయట పెక్కకుండా జాగర్తలు కూడా తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిగితే ఎన్నో ఆశర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.