23, డిసెంబర్ 2023, శనివారం

జెడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ !




రాజకీయాల్లో మార్పు తీసుకురావటమే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభం అయ్యింది. ఈ పార్టీని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్  లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావటమే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ పని చేస్తుందని పార్టీ ప్రారంభం సందర్భంగా లక్ష్మీనారాయణ  స్పష్టం చేశారు. అవినీతికి ఏమాత్రం తావులేకుండా.. విలువలతో కూడినా రాజకీయాన్ని పరిచయం చేసేందుకు తాను పార్టీ పెడుతున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయం మరో మలుపు తీసుకున్నట్లు అయ్యింది. రాజకీయ నిరుద్యోగులకు మరో పార్టీ ఆశాకిరణం అయ్యింది. ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలవటంతో.. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలుపెట్టాయి. కాగా.. ఇప్పుడు కొత్త పార్టీలు కూడా పురుడు పోసుకుంటున్నాయి. గతంలో పుంగనూరుకు చెందిన అన్నా రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని అట్టహాసంగా ప్రారంభించారు.  ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి  తెలుగు సేన పార్టీ పేరుతో ఓ కొత్త పార్టీని ప్రకటించారు. వెంటనే  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా కొత్త పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ పేరుతో కొత్త పార్టీని ప్రకటించి.. ఏపీ రాజకీయాలను మరింత రసవత్తరంగా మార్చారు. ఇప్పటికే ప్రధాన పార్టీలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉండగా.. ఇప్పుడు లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

తన పార్టీ గురించి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాజకీయాల అంటే మోసం కాదు. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశా. అన్ని వర్గాల్ని కలిసి.. అందరి అభిప్రాయాలు తీసుకున్నా. ప్రత్యేక హోదా రానందువల్లే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా సాదనలో విఫలం అయ్యాయి. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. శాంతి భద్రతలు, మానవ హక్కులు కల్పించేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. వీళ్లు తిన్నారని వాళ్లు, వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారు. ఎవరూ అవినీతికి పాల్పడేందుకు వీల్లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమార్పేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ. యువతరానికి అద్భుత ఉపాధి కల్పించడానికి.. ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.

ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ పలు వేదికలపై బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే.. ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం చెప్పలేదు. మళ్లీ జనసేన పార్టీలో చేరి పోటీ చేస్తారని అంతా భావించినా.. చివరికి ఆయనే సొంతంగా పార్టీ పెట్టి పోటీ చేయబోతుండటం రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీసింది. గతేడాదే పార్టీ పేరును లక్ష్మీనారాయణ ఎన్నికల సంఘం వద్ద జై భారత్ నేషనల్ పార్టీని లక్ష్మీనారాయణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *