రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్ లో మౌనంగా ఉండలేక పోతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే తన వ్యాపార విధులను కూడా పూర్తి స్థాయిలో నిర్వహించ లేకపోతున్నానని తెలిపారు. 2024లో మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను, కానీ, రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. రెండేళ్ల క్రితం వ్యాపారాల నుంచి తన తండ్రి గల్లా రామచంద్ర నాయుడు రిటైర్ అయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు, వ్యాపారాన్ని సమన్వయం చేయడం కష్టంగా మారిందని వివరించారు. అందుకే రాజకీయాల నుంచి వైతొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వేదికగా ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు.
తాను ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని, స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకునే రాజకీయాల్లో ముందుకు సాగినట్లు వివరించారు. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం తను పార్లమెంట్లో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. వివిధ కేసుల్లో ఈడీ తనను రెండు సార్లు పిలిచి విచారించిందని, తన వ్యాపారాలపై నిఘా వేసినట్లు తెలిపారు. సీబీఐ, ఈడీలు తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో వ్యాపారాలపైనే దృష్టి సారించాలనుకుంటున్నట్లు గల్లా జయదేవ్ చెప్పారు. గుంటూరు ప్రజలు తనకు ఇంత కాలం రాజకీయంగా సహకరించినందుకు వారికి జయదేవ్ కృతజ్ఞతలు తెలిపారు.