చంద్రబాబు బెయిలుపై తీర్పు మళ్ళి వాయిదా !
చంద్రబాబు బెయిలుపై తీర్పులో వాయిదాల పర్వం కొనిసగుతోంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ గురువారం విచారణకు రాగా తిరిగి ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని నిర్దేశించింది. ఇక విచారణ పూర్తయిన క్వాష్ పిటీషన్ పైన తీర్పును దీపావళి సెలవుల తరువాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన గురువారం సుప్రీంలో విచారణ జరిగింది. గత నెలలో ఈ పిటీషన్ విచారణ వేళ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు పై స్కిల్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెలువరించిన తరువాతనే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిలల్ పిటీషన్ పై విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. దీంతో, సుప్రీం ధర్మాసనం ఫైబర్ కేసులో విచారణ వాయిదా వేస్తూ, ఈ నెల 30వ తేదీ వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
స్కిల్ కేసులో తీర్పు రిజర్వ్ కావటంతో జడ్జిమెంట్ గురించి ధర్మాసనం క్లారిటీ ఇఛ్చింది. గత నెల 17న స్కిల్ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్ చేయగా, తీర్పును దీపావళి సెలవుల తరువాత వెల్లడిస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు గురించి ప్రస్తావన ఉంటుందని భావించారు. అదే విధంగా సుప్రీం కోర్టు క్వాష్ పిటీషన్ పైన వాదనలు ముగిసాయని, దీపావళి సెలవుల తరువాత వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు పూర్తయిన తరువాత సుప్రీం ద్విసభ్య ధర్మాసనం క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడించనుంది.