9, నవంబర్ 2023, గురువారం

ఒంటరి పోరాటం చేస్తున్న డాక్టర్ థామస్

 


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాజకీయ చతురుడు నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతోంది. నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన డాక్టర్ వెయ్యం థామస్ నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయనకు మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు,  క్లస్టర్ ఇంచార్జిలు సహకరించడం లేదు. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు పట్టించుకోవడం లేదు. థామస్ ను పూర్తిగా వదిలేశారు. దీంతో చేసేది లేక పార్టీలో ఏటికి ఎదురీదునట్లు ప్రచార  కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో తనకు ఎవరు సహకరించకపోవడంతో తన సోదరుడు, భార్యతో కలిసి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఓటు వేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



రిజర్వుడు నియోజకవర్గం అయిన  గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన డాక్టర్ హరికృష్ణ ఇన్చార్జిగా కొనసాగారు. ఇన్చార్జి ఉండగానే చిట్టి బాబును నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో హరికృష్ణ పార్టీ మీద అలిగి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చిట్టిబాబు సమన్వయకర్తగా నియమితులైన నాటి నుండి నియోజకవర్గంలో వర్గ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అనంతరం చెన్నైలో ఆస్పత్రి నడుపుతున్న డాక్టర్ VM థామస్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియమించారు. దీంతో నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎస్సీ నాయకులలో అసంతృప్తి జ్వాలలు రహులుకున్నాయి. అధినేతను ఎదిరించడానికి ధైర్యం చాలక పార్టీ కార్యక్రమాలలో సహాయనిరాకరణ  ప్రారంభించారు. ముఖ్యంగా పాలసముద్రానికి చెందిన మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పిటిసి రాజేంద్ర, పుత్తూరుకు  చెందిన గ్యాస్ రవి నియోజకవర్గ ఇంచార్జ్ పదవిని ఆశించారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ లేక పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. వీరిని కాదని డబ్బు ఉందన్న ఒకే ఒక కారణంతో చెన్నైలో ఉంటున్న డాక్టర్ థామస్ ను ఇన్చార్జిగా నియమించడం నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షులకు జీర్ణం కాలేదు.



డాక్టర్ థామస్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన తర్వాత ఇదివరకు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేసిన చిట్టి బాబు ప్రచార కార్యక్రమాలను అన్నీ తానే ముందుండి నడిపారు. ఈలోపు రోజా దంపతులు చిట్టిబాబుకి చెందిన రిసార్టులో  రెండు రోజులపాటు బసజేయడంతో చిట్టి బాబు మీద విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రోజా భర్త సెల్వమణి పుట్టినరోజు వేడుకలను రేవా రిసార్టులో జరుపుకోవడం పట్ల తెలుగుదేశం శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి. భారీ ఎత్తున పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేశారు. రేవా రిసార్టులో రెండు రోజులపాటు రోజాకు చిట్టిబాబు ఆతిధ్యం ఇచ్చారని, ఆమెకు ఆమె భర్తకు ఖరీదైన బహుమతులు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. రానున్న ఎన్నికలలో నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్ అభ్యర్థిని పోటీ చేయించి తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చి రోజాను గెలిపించడానికి రిసార్టులో వ్యూహరచన జరిగిందని నగరి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  గాలి ప్రకాష్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూర్తి వ్యవహారం మీద నివేదిక కోరారు. రెండు రోజుల కిందట పార్లమెంటరీ పరిశీలకుడు రాంభూపాల్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు  మబ్బు దేవనారాయణ రెడ్డిలు చిత్తూరులో సమావేశమై మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్చార్జిల అభిప్రాయాలను తీసుకుని అధిష్టాన వర్గానికి నివేదించారు.

తదుపరి అధిష్టానం ఆదేశించేవరకు చిట్టిబాబును పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవద్దని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో నియిజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ థామస్ ఒంటరిగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.  ఆయనకు తోడుగా తమ్ముడు, సతీమణి ప్రచారం చేస్తున్నారు. అన్ని మండలాల్లో తిరిగి రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా దళితవాడలు, చర్చలపైన దృష్టిని  సాధించారు. ప్రతి చోట ఆర్థిక సహాయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. డాక్టర్ VM థామస్ ఇలా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు నాయకులు పూర్తిగా  సహకరించడం లేదు. 

 

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పార్టీ పనితీరును పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులలో సమన్వయం లేకపోవడంతో పార్టీ చతికిలబడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకొని నియోజకవర్గంలో నాయకుల, కార్యకర్తల సమన్వయానికి కృషి చేయాలని కోరుతున్నారు. మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిల్లా సలహాలు, సూచనలు తీసుకుని నియోజకవర్గ ఇన్చార్జి విషయంలో కూడా పునః పరిశీలన చేయాల్సి ఉందని అంటున్నారు. అందరికి ఆమోదయోగ్యమైన, పార్టీలో అనుభవం ఉన్న, స్థానిక అభ్యర్థిని ఇన్చార్జిగా నియమిస్తే తప్ప పార్టీ పరిస్థితి మెరుగుపడదని భావిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మనుగడకే  ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *