పొత్తుకు తెలంగాణాలో సై - ఆంద్రాలో నై
తెదేపాతో కలువడానికి భాజపా విముఖత
పొత్తుల మీద క్లారిటీ ఇచ్చిన అమిత్ షా
తెలంగాణాలో మిత్రపక్షంగా జనసేన
ఆంద్రాలో తెలుగుదేశం, జనసేన పొత్తు
తెలుగుదేశం పార్టీతో పొత్తుకు భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బుధవారం నాడు కేంద్ర హోం మంత్రిని కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతానికి భాజపా జనసేన పొత్తును తెలంగాణ వరకే పరిమితం చేసినట్లు సమాచారం. ఆంధ్రలో తెదేపాతో కలిసి జనసేన పోటిచేయడానికి అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు ఉన్నందున ఆంధ్ర రాజకీయాల గురించి ఎక్కువ చర్చ జరగలేదని తెలిసింది. తెలంగాణ ఎన్నికల తరువాత ఆంధ్ర రాజకీయాలు, పొత్తులు గురించి విపులంగా మాట్లాడుదామని అమిత్ షా అన్నట్లు సమాచారం.
చంద్రబాబు అరెస్టు, జనసేన మద్డదు ప్రకటించడం, తెలంగాణ ఎన్నికలలో పొత్తు గురించి బుధవారం రాత్రి అమిత్ షా ను పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, కిషన్ఎ రెడ్డి, లక్ష్మణ్ కలిశారు. బిజెపి భాగస్వామిగా ఉంటున్న జనసేనతో తెలంగాణాలో మాత్రమే ఎన్నికల పొత్తు గురించి ప్రస్తుతం బీజేపీ సుముఖంగా ఉందని, టిడిపితో పొత్తు పెట్టుకున్న జనసేనతో ఏపీలో పొత్తు విషయమై సుముఖంగా లేదని బుధవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ పాల్గొన్న ఈ భేటీలో తెలంగాణ ఎన్నికల గురించి మాత్రమే చర్చించినట్లు చెబుతున్నారు. బిజెపితో సంప్రదించకుండా టిడిపితో ఏకపక్షంగా పొత్తును పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని అమిత్ షా ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్లో జనసేన వైఖరి ఎలా ఉన్నా, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. జనసేన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల్లో కలిసే విషయంలో ఇరుపార్టీల మధ్య ఇప్పటికే ప్రాథమిక అవగాహన కుదిరినా ఎన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయాలనే విషయంలో స్పష్టత రాలేదు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్లతో కలిసి అమిత్ షాతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. 27వ తేదీన సూర్యాపేటలో బహిరంగ సభ తర్వాత అమిత్షా హైదరాబాద్లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. హైదరాబాద్ వచ్చేలోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్షా సూచించినట్లు తెలుస్తోంది. పార్టీల్లో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్నదీ చెబుతామని వారు అమిత్షాకు తెలిపారు.