9, సెప్టెంబర్ 2023, శనివారం

బాబు అరెస్టుతో ఉలిక్కిపడ్డ చిత్తూరు జిల్లా

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో చిత్తూరు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నిబంధనలు పాటించకుండా చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తలు జిల్లా ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. చంద్రబాబు అరెస్టును వివిధ పార్టీల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించారు. నిరసనలు వ్యక్తం చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిరగలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు సంయమనం పాటించారు. అధినేత ఆదేశాల మేరకు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేశారు. రాజకీయాలలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండిన నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయగడాన్ని నిరసిస్తున్నారు. 73 సంవత్సరాల వయసు ఉన్న చంద్రబాబు నాయుడును ఉదయం ఆరు గంటలకే అరెస్టు చేయడం, 10 గంటల పాటు ఏకధాటిక ప్రయాణం చేసి విజయవాడ తీసుకెళ్లడం, మధ్యలో తిండి తిప్పలు కూడా ఇవ్వకపోవడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యము వలే తిరిగి వస్తారని, సింహ గర్జన చేస్తారని తెదేపా నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఇది నాంది వాచకమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టుకు  పాల్పడ్డారని పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనలకు భారీ సంఖ్యలో ప్రజలు తలలి రావడం, లోకేష్ పర్యటనలకు జనాలు పోటెత్తడంతో రానున్న ఎన్నికలలో గెలవలేమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. ధర్మం చంద్రబాబు వైపు ఉందనీ, అయనకు అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నారు.



చిత్తూరులో  దొరబాబు, కాజూర్ బాలాజీ,  మోహన్ రాజ్, జాఫర్ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వారు ఉదయం ముంచి ఎవ్వరు చెప్పిన మంచి నీరు కూడా తీసుకోకుండా నిరసన తెలియచేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్టుతో అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కలికిరి మురళీమోహన్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం కర్వేటినగరం పట్టణంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై ఇంచార్జి Dr VM థామస్  శాంతియుత నిరసనలు తెలియచేశారు. 



 అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రగిలిపోయారు. మదనపల్లెలో పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులోభాగంగా స్థానిక టమోటా మార్కెట్ యార్డ్ ఎదుట మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తనయులు చాణక్యతేజ, యశస్విరాజ్ లు కార్యకర్తలతో కలిసి నిరసన చేస్తుండగా వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇందులో 21 మందిపై ప్రివెంటివ్ కేసులు నమోదు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అరుణ్ తేజ్ కార్యకర్తలతో కలసి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా  పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.



 అలాగే మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనయుడు జునైద్ అక్బరీ కార్యకర్తలతో కలసి బెంగళూరు బస్టాండ్ లో నిరసన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అలాగే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దుకాణదారులు ఇతర వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్ పాటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. దీంతో మదనపల్లెలో నిర్వహించిన బంద్ ప్రశాంతం, పాక్షికంగా సాగింది. 


 

శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ MLA SCV నాయుడును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. CI అంజూయాదవ్ రాత్రి వరకు నాయుడు ఇంటి దగ్గరే ఉన్నారు. దీంతో నాయుడు ఇంటి వద్దనే నిరసన తెలియజేశారు. మరో మాజీ MLA మునిరామయ్యను కూడా హౌస్ అరెస్టు చేశారు. తెదేపా రాష్ట్ర నాయకుడు గురువా రెడ్డి రోడ్డు మీదికి రాగా పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తికి వస్తుండగా మార్గమధ్యంలో అరెస్ట్ చేసి, సత్యవేడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్ట్ నేపథ్యంలో  నిరసన తెలిపిన కారణంగా పులువురు తెలుగుదేశం పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు  అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ  నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ నిరసన చేపట్టారు. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా నగరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, పుత్తూరు జనసేన పార్టీ నాయకుడు పి గోపి రాయల్ తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది అన్నారు. ఇది చట్ట విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదనీ, రాష్ట్రంలో పోలీసు శాఖ అధికారులు ఈ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఈ ప్రభుత్వం త్వరలోనే ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టును నగరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పుత్తూరు జనసేన పార్టీ నాయకుడు పి గోపి రాయల్, పార్టీ నాయకులు జి కృష్ణయ్య, శ్రీరామ్ గోపి ఖండించారు.


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు దుర్మార్గపు చర్య అంటూ ఆ పార్టీ నిమ్మనపల్లె మాజీ జడ్పీటీసీ సభ్యుడు రెడ్డప్పరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యాలు అరాచకాలకు పాల్పడడం అన్యాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు రెడ్డిరమణ, జయచంద్రారెడ్డి, వెంకటరమణ, సత్యం, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రాబాబునాయుడును అర్థరాత్రి నంద్యాలలో ఆయన వసతిపై దాడిచేసి, జనాన్ని భయబ్రాంతులకు గురిచేసి, తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని సిపిఎం  జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తీవ్రంగా ఖండించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత జిల్లాల పర్యటనలో భాగంగా నంద్యాలలో ఉన్నప్పుడు అరెస్టు చేసిన తీరు తీవ్ర అభ్యంతరకరం అన్నారు. ఈ అరెస్టును సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. చంద్రబాబును తక్షణమే విడిచిపెట్టి  స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో జరిగిన అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *