మద్యం కుంభకోణంలో చిత్తూరు జడ్పి చైర్మన్ సోదరుడు అరెస్టు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమైన నిందితులుగా ఉన్న చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు సోదరుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు మంగళవారం మైసూరులో అరెస్ట్ చేశారు. గోవిందప్ప బాలాజీ చిత్తూరు జిల్లా వి కోట మండలానికి చెందినవారు. ఆయనకు వి కోట మండలం నక్కనపల్లి, పట్రపల్లిలలో విలాసవంతమైన రెండు ప్యాలస్ లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాలస్ ను రెండు ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రస్తుతం ఒక ప్యాలస్ లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గోవిందప్ప శ్రీనివాసులు నివాసం ఉంటున్నారు. బాలాజీకి ఎర్రినాగేపల్లె ఏడు ఎకరాల భూమి కూడా ఉన్నట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పాదయాత్ర సందర్భంగా బాలాజీ ఇంటిలోనే ఒకరోజు బస చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలాజీ గోవిందప్ప మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మును షెల్ కంపెనీలకు మళ్ళిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పక్కా సమాచారంతో మైసూర్ లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి విజయవాడకు సిట్ అధికారులు తీసుకువస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ కు పూర్తికాలపు డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కాం కేసులో బాలాజీ గోవిందప్ప ఏ 33 గా ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ దశలో ఉంది. కాగా మూడు రోజుల క్రితం బాలాజీ గోవిందప్ప తో పాటు ఏపీ సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డికి , వైసిపి అధినేత వైయస్ జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కి సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కార్యాలయంలో గత ఆదివారం ఉదయం పదిగంటలకు విచారణకు రావాలని నోటీసుల లో పేర్కొన్నారు. వీరు నోటీసులను బేఖాతరు చేశారు. విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సైతం ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం కేసులో ఈ ముగ్గురి పాత్ర కీలకమని, ఈ ముగ్గురు తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశాలను నిర్వహించారని సిట్ గుర్తించింది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ 31గా ధనుంజయ రెడ్డి, ఏ 32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్టి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల వద్దకు చేరాయని విచారణలో నిందితులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వాళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో సెట్ అధికారులు పేర్కొన్నారు. కాగా వైఎస్ జగన్కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అత్యంత సన్నిహితులు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్రెడ్డి, గోవిందప్పలతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర కీలకం. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సిట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. దీనిపై కేసు నమోదు చేసింది. ఆ వెంటనే దీనిని విచారించేందుకు విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్బాబుతో కలిసి.. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే విచారణ ముమ్మరంగా సాగింది. మద్యం కుంభకోణంలో ఏకంగా 3200 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్టు సిట్ గుర్తించింది. కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతని నుంచి మరింత సమాచారం సేకరించారు. దీంతో సిట్ అధికారులు వదిలి పెట్ట కుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలాజీ గోవిందప్ప మైసూరులో ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మద్యం ద్వారా అందిన ముడుపులను తన ఆడిటింగ్ నైపుణ్యంతో గోవిందప్ప దేశాలు దాటించారని పోలీసులు భావిస్తున్నారు. బాలాజీ అరెస్టుతో మద్యం కుంభకోణం ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.
పో రై గంగ 3 జగన్ తో గోవిందప్ప బాలాజీ

