వాయిదా పడ్డ జీడి నెల్లూరు మండల పార్టీ అధ్యక్షుల ప్రకటన
ఎమ్మెల్యే వైఖరి మీద అధిష్టానంకు పలువురు ఫిర్యాదులు
ఆంధ్రప్రభలో ప్రచురితమైన వార్తను అధిష్టానంకు పంపిన నాయకులు
మండల పార్టీ అధ్యక్షుల ప్రకటన నిలుపుదల చేయాలని ఆదేశాలు
ఆంధ్రప్రభ వార్తతో ఆగిన మండల పార్టీ అధ్యక్షుల ప్రకటన
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గంగాధర నెల్లూరు నియోజక వర్గం టిడిపి మండల కమిటీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ఆదివారం మధ్యాహ్నం ఎస్ ఆర్ పురం టిడిపి కార్యాలయంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేసారు. నియోజక వర్గం పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. అన్ని మండలాల కార్యకర్తలు రావాలని కోరారు. ఎమ్మెల్యే ఏక పక్షంగా మండల కమిటీ అధ్యక్షుల జాబితా రూపొందించి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదింప చేస్తారని ఆంధ్రప్రభలో వార్త వచ్చింది. ఆరుగురు మండల అధ్యక్షుల పేర్లు ఖరారు చేశారని జాబితాను బహిర్గతం చేసింది. ఈ అంశాలతో ఆంధ్రప్రభ దినపత్రికలో ఆదివారం జీడి నెల్లూరు మండల పార్టీ అధ్యక్షుల నియామకపు ప్రకటన నేడే అనే శీర్షికన వార్త ప్రచురితం అయ్యింది. దీనితో ఒక వర్గం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అన్ని మండలాల నుంచి వ్యతిరేక వర్గాలు వాట్సాప్ గ్రూపుల్లో ఎమ్మెల్యే వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. అధిస్థాన వర్గానికి ఆంధ్రప్రభ వార్త ఆధారంగా ఫిర్యాదులు చేసారు. ఈ ప్రత్యేక కథనంను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్నికల నిర్వహణా కమిటీ చైర్మన్ వర్ల రామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పల్లా శ్రీనివాసరావుకు పలువురు పంపి, ఎం ఎల్ ఏ వైఖరి మీద ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర పార్టీ కార్యాలయం స్పందించింది. నియమావళికి విరుద్ధంగా ఎన్నికలు జరపడం తగదని హెచ్చరించినట్టు తెలిసింది. దీనితో పరిశీలకుడు రవిప్రకాష్ నాయుడు సమావేశానికి హాజరు కాలేదు. ఈ నేపధ్యంలో మూడు సార్లు అధ్యక్షునిగా ఉన్న కార్వేటినగరం అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, నాలుగు సార్లు ఉన్న ఎస్ ఆర్ పురం అధిక్షుడు జయశంకర్ నాయుడు, ఎనిమిది సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన రుద్రయ్య నాయుడు నియామకం చెల్లదని చెప్పారు. కాగా నియోజక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి, మాదిగ సామజిక వర్గానికి ఒక మండలం కూడా కేటాయించక పోవడం పట్ల ఆ వర్గాల కార్యకర్తలు రగిలి పోతున్నారు. తమ వర్గానికి అన్యాయం చేస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వెదురుకుప్పం మండల నేతలు చెప్పారు. అతి తక్కువ జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి మూడు మండలాలు కేటాయించి, పార్టీకి వెన్నెముక లాంటి బిసిలకు ఒక మండలం ఇవ్వడం అన్యాయం అని పలువురు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసిపి నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ అక్రమ నియామకాలకు మూలం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక మండల అధ్యక్షుడు తిరిగి కొనసాగడం కోసం ఎమ్మెల్యే కోటరీకి 15 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరొక మండల ఆశావహుడిని ఐదు లక్షలు అడిగారని తెలిసింది. ఆయన కాదనడంతో మరొక నేతకు అవకాశం కల్పించారని అంటున్నారు. ఒక మండల ఆశావహుడిని భారీ మొత్తంలో అడిగారని తెలిసింది. ఇద్దరు మండల నాయకులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా వారికి పదవులు కట్టి పెట్టే ప్రయత్నం జరిగింది. మార్చి ఒకటవ తేదీన జి డి నెల్లూరులో చంద్రబాబు ప్రశంసలు అందుకున్న రాజేంద్రను తొలగించారు. పక్కన పెట్టనున్న రుద్రయ్య నాయుడుకు తిరిగి పట్టం కట్టాలని నిర్యయిమ్చారు. ఈ నేపధ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుని మహానాడు తరువాత మండల పార్టీ ఎన్నికలకు ప్రజాస్వామ్య పద్దతిలో, నియోజకవర్గ పరిశీలకుని సమక్షంలో జరపాలని సూచించినట్లు సమాచారం. దీనితో చేసేది లేక ఎమ్మెల్యే మండల పార్టీ అధ్యక్షుల ప్రకటనను వాయిదా వేశారు. మహానాడు తరువాత మండలాల వారిగా సమావేశం పెట్టి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

