జీడి నెల్లూరు టిడిపి అభ్యర్థి మార్పు ఉంటుందా ?
టిడిపి అభ్యర్థిగా థామస్ ను ప్రకటించిన అధిష్టానం
థామస్ ఎస్.సి. కాదని ఫిర్యాదులు, కోర్టు కేసు
తాను మతం మారి, పేరు మార్చుకున్నట్లు థామస్ గెజిట్ నోటిఫికేషన్
దానితో అనర్హత వేటు వేయాలని వైసిపి నేతల వ్యూహం
ప్రత్యామ్యాయ అభ్యర్థి అన్వేషణలో టిడిపి
ఈ నేపధ్యంలో గాంధీ నామినేషన్ కు ప్రాధాన్యత
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి.ఎం. థామస్ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. గురువారం ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం ఇందుకు బలం చేకూర్చుతుంది. అలాగే సోమవారం వెదురుకుప్పం మండలం పచ్చకాపలానికి చెందిన మరో టిడిపి నాయకుడు గ్యాస్ రవి కుమార్ కూడా నామినేషన్ వేయనున్నారు. పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎం పి పి, మాజీ రాజేంద్ర మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటినుంచి థామస్ మతం విషయంలో వివాదం కొనసాగుతోంది. ఆయన ఎస్సీ దళితుడు కాదని, క్రిస్టియన్ అని పలువురు ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు కూడా వేశారు. వీటి మీద విచారణ జరుగుతుంది. దీంతో థామస్ టిడిపి అభ్యర్థిగా నామినేషన్ వేసి, తిరస్కరణకు గురవుతే ఎలా అని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ గురువారం టిడిపి అబ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ గాంధీ ఉపాధ్యాయుడిగా ఉంటూ, 1994 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా వేపంజేరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా నేటాలం శోభ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి కుతూహలమ్మ పోటీ చేశారు. త్రిముఖ పోటీలో గాంధీ విజయం సాధించారు. 2004 ఎన్నికలలో గాంధీకి కాకుండా ఆయన సతీమణి ఓ చంద్రమ్మకు టిడిపి అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికలలో ఆమె మాజీ మంత్రి కుతూహలమ్మ చేతులో ఓడిపోయారు. మరోసారి పుష్ప రాజ్ కు టిడిపి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ గాంధీ వైసీపీలో చేరారు. తిరిగి ఇటీవల గంగాధర నెల్లూరులో జరిగిన 'రా కదిలి రా' బహిరంగ సభలో ఆర్ గాంధీ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన గురువారం నామినేషన్ వేయడం చర్చకు దారి తీసింది. ఈ విషయమై ఆర్. గాంధీ 'ప్రభ న్యూస్ బ్యూరో' తో మాట్లాడుతూ.. తాను అధిష్టానం ఆదేశాల మేరకే టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశామన్నారు. ఇప్పటివరకు తాను టిడిపి అభ్యర్థిని కాదని, అధిష్టానం ఆదేశానుసారం నడుచుకుంటానని ఆర్ గాంధీ స్పష్టం చేశారు.
కార్వేటినగరం మండలం అల్లా గుంట గ్రామంలో 1974 జూన్ 28న వి ఎం థామస్ జన్మించారు. అప్పటికే ఆయన తల్లి తండ్రులు క్రైస్తవ మతం స్వీకరించారు. అయినా రిజర్వేషన్ కోసం ఆయన ఆది ద్రావిడ కులానికి (ఎస్ సి) చెందిన వ్యక్తిగా పాటశాల రికార్డులలో నమోదు చేశారు. వడింగాడు ప్రకాష్ కుమారుడు అయిన వడింగాడు మునస్వామి అను తాను క్రిస్టియన్ మతం స్వీకరించి, వి ఎం థామస్ గా పేరు మార్చుకున్నట్లు తమిళనాడు గెజిట్ నోటిఫికేషన్ లో ప్రకటించారు. 2011 జూన్ పదవ తేదీన మతము, పేరు మార్చుకున్నట్లు ఆయన 2012 అక్టోబర్ 17 న తమిళనాడు ప్రభుత్వ గెజిట్ లో ప్రకటించారు. తాను 1974 జూన్ 28 న చెన్నైలో జన్మించినట్లు పేర్కొన్నారు. ఆయన మతం మార్పిడిపై కొందరు విమర్శలు చేయటంతో జాగ్రత్త పడ్డారు. 2024 ఫిబ్రవరి 23 వ తేదీ వి ఎం థామస్ అయిన తన పేరును వడింగాడు మునస్వామి థామస్ గా కూడా పిలువ వచ్చని మళ్ళీ గెజిట్ లో ప్రకటించారు. దీని ఆధారంగా తాను గెజిట్ లో పేరు మాత్రమే మార్చుకున్నానని, మతం మార్చుకోలేదు అంటూ టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులకు చెప్పారు. క్రైస్తవ మతం స్వీకరించిన ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని జై హింద్ పార్టీ నాయకుడు అక్కిలిగుంట మధు హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతకు ముందే ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశం ప్రకారం కార్వేటినగరం తహశీల్దార్ విచారణ చేసి ఆయన ఇంటర్ టి. సి. లో వడంగాడు మునశ్వామి అని, అల్లాగుంటలో జన్మించినట్లు పేర్కొన్నారు. అయితే పాస్ పోర్టులో వి ఎం థామస్ అని, జన్మస్థలం చెన్నై అని ఉన్నట్టు తెలిపారు. కాగా ఆయన తల్లి రాణి తాము క్రైస్తవ మతానికి చెందిన వారమని, థామస్ 12 వ ఏటనే బాప్టిజం తీసుకున్నారని ఒక వీడియోలో తెలిపారు. గ్రామంలో నిర్మించిన చర్చికి ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పారు. ఆయన ఇంటి గోడలు, గేటు లోపల ఏసు ప్రభువు శిలువ గుర్తులు ఉన్న వీడియో సేకరించారు. అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించారు. కాగా థామస్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్ రెడ్డి కూడా కోరారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా, ఆధారాలతో ఫిర్యాదు చేశార్రు. క్రైస్తవ మతం స్వీకరించిన థామస్ డాక్టర్ అని చెప్పుకుంటున్నారని, అయన ఎం బి బి ఎస్ చేయలేదన్నారు. వైసిపి నాయకులు కూడా పకడ్బందిగా ఆధారాలు సేకరించారు. నామినేషన్ వేసిన తరువాత ఆధారాలు సమర్పించి, అనర్హుడిగా ప్రకటించాలని వ్యూహంగా తెలుస్తుంది. ఈ ఫిర్యాదులు, కోర్టు కేసు నేపధ్యంతో తెదేపా అధిష్టానం థామస్ కు జీడి నెల్లూరు టిక్కెట్టు విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది. ఒక వేళ థామస్ నామినేషన్ తిరస్కరణకు గురయితే, ముందు జాగర్తగా కొందరి చేత నామినేషన్లు వేపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మాజీ ఎం. ఎల్. ఏ. గాంధీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం వెదురుకుప్పం మండలం పచ్చికాఫలంకు చెందిన డాక్టర్ గ్యాస్ రవికుమార్ కూడా నామినేషన్ దాఖలు చేయకున్నారు. పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎం పి పి, మాజీ రాజేంద్ర మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరి కొంత మంది ఎస్ సి నాయకులు కూడా టిడిపి తరఫున నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం.