కండ్రిగకు కదిలి వచ్చిన జనసంద్రం
కండ్రిగకు కదిలి వచ్చిన జనసంద్రం
సీఎం సభకు మహిళల పోటెత్తిన మహిళలు
గొడ్డలి పార్టీపై చంద్రబాబు విమర్శలకు భారీ స్పందన
ముఖ్యమంత్రి యాదమరి బహిరంగ సభ విజయవంతం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలం కండ్రిగ గ్రామం శనివారం రాజకీయ, సామాజికంగా చరిత్రాత్మక వాతావరణాన్ని తలపించింది. జిల్లా వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకాగా, ఊహించని రీతిలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేశారు. మారుమూల గ్రామమైన కండ్రిగ ఒక్కసారిగా జనసంద్రంగా మారిపోయింది. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోవడంతో మహిళలు మిద్దెలపై, ఇళ్ల మేడలపై, చెట్ల నీడల్లో నిలబడి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. చేతులు ఊపుతూ, సెల్ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ మహిళలు ఉత్సాహంగా కనిపించారు. సీఎం ప్రసంగంలోని ప్రతి అంశానికి ప్రజల నుంచి ఘన స్పందన వ్యక్తమైంది.
శనివారం ఉదయం వరకూ మండే ఎండలతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం చిరుజల్లులు కురవడంతో కండ్రిగ ప్రాంతం చల్లగా, ఆహ్లాదకరంగా మారింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల 49 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, ఈ రోజు కండ్రిగలో చల్లని వాతావరణం కనిపించడం ఆనందంగా ఉందన్నారు. ప్రకృతి కూడా ప్రజల ఆశీర్వాదంగా మారిందని వ్యాఖ్యానించారు. భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి ముఖ్యమంత్రి మరింత ఉత్సాహంగా ప్రసంగించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజకీయ ప్రసంగంలో భాగంగా గొడ్డలి పార్టీ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తల్లి, చెల్లిని దూరం పెట్టిన వారు ప్రజలను ఆదరిస్తారా అంటూ చంద్రబాబు ప్రశ్నించగా సభలోని ప్రజలు ఒకేసారి లేదు అంటూ పెద్ద ఎత్తున స్పందించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం చేసిన ప్రతి రాజకీయ వ్యాఖ్యకు సభికుల నుంచి చప్పట్లు, నినాదాలు వినిపించాయి. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున స్పందిస్తూ చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సభలో ప్రజల స్పందన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డూడి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద జరిగిన ప్రోటోకాల్ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబులను హెలిప్యాడ్లోకి అనుమతించకపోవడంతో వారు అనంతరం ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈసారి సభలో ముఖ్యమంత్రి కొత్త తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో బాగా పనిచేసిన అధికారులను సభికుల చేత చప్పట్లు కొట్టించి అభినందించారు. పనితీరు బాగోలేని అధికారులకు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయిని 90 శాతానికి తీసుకెళ్లేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి ఓపిగ్గా పరిశీలించారు. ఒక్కో స్టాల్ వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఉత్సాహంగా మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రజలతో మమేకమై పలువురికి ఫోటోలు దిగేందుకు అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి ఉదయం 11 గంటలకు రావాల్సి ఉండగా దాదాపు గంట ఆలస్యంగా కార్యక్రమానికి చేరుకున్నారు. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో సభ ప్రాంగణంలోనే ఉండి ముఖ్యమంత్రి కోసం ఎదురుచూడడం గమనార్హంగా నిలిచింది. చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు ముఖ్యమంత్రిని కలిసి చిత్తూరు పట్టణ అభివృద్ధికి అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, ఆయన సతీమణి లావణ్య బాబు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. మారుమూల గ్రామంలో జరిగిన ఈ బహిరంగ సభకు ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మహిళల భారీ హాజరు, సీఎం ప్రసంగానికి వచ్చిన స్పందన, సభా ప్రాంగణంలో కనిపించిన ఉత్సాహం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. నాయకులు, కార్యకర్తలు ఈ సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

