చిత్తూరు కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్..
కోర్టు ఖాళీ.. నాలుగు బృందాలతో తనిఖీలు
అదనపు పోలీస్ అధికారి దేవదాస్, ఉప విభాగ పోలీస్ అధికారి సాయినాథ్, బాంబు నిర్వీర్య బృందం, అగ్నిమాపక సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ముందుగా కోర్టులో ఉన్న న్యాయవాదులు, కేసుల నిమిత్తం వచ్చిన ప్రజలు, కోర్టు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం కోర్టు ప్రాంగణాన్ని నాలుగు బృందాలుగా విభజించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనంలోని ప్రతి గది, కారిడార్లు, న్యాయస్థాన హాళ్లు, రికార్డు గదులు, కార్యాలయ విభాగాలు, కంప్యూటర్ విభాగం, పార్కింగ్ ప్రాంతాలు, పరిసర ప్రాంతాలను అణువణువూ పరిశీలించారు. బాంబు నిర్వీర్య బృందం, శునక దళం సహకారంతో ప్రతి మూలను జల్లెడ పట్టారు. కోర్టు కాంప్లెక్స్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతించలేదు.
ఐదు గంటల తనిఖీ.. పేలుడు పదార్థాలు లేవు
ఈ భద్రతా తనిఖీలు సుమారు ఐదు గంటల పాటు కొనసాగాయి. ఈ సమయంలో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విస్తృతంగా నిర్వహించిన తనిఖీల అనంతరం కోర్టు ప్రాంగణంలో ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు నిర్ధారించారు. పరిస్థితి పూర్తిగా సురక్షితమని కోర్టు అధికారులకు తెలియజేశారు. ఈ ఘటన అనంతరం అదనపు పోలీస్ అధికారి (ఆపరేషన్స్) మరియు పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు స్వయంగా కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోర్టు పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, బాంబు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, ఈ-మెయిల్ చిరునామా, డిజిటల్ వివరాల ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ వార్తలను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని చిత్తూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

