ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం
5 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం
జిల్లాలో పర్యటించనున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు
ఆందోళనతో పాటు పార్టీని పటిష్టం చేసుకునే వ్యూహం
స్థానిక సంస్థల ఎన్నికలలే లక్ష్యంగా ఆందోళనలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా భారీ నిరసనలకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, కూలీల హక్కులను కాలరాస్తోందన్న ఆరోపణలతో జనవరి 5వ తేదీ నుంచి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు డిసిసి అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ ప్రకటించారు. ఈ కార్యక్రమాలు కేవలం రాజకీయ నిరసనగా కాకుండా, గ్రామీణ కార్మికుల జీవన హక్కుల కోసం సాగించే ఉద్యమంగా ఉంటాయని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఆదేశాల మేరకు ఈ జిల్లావ్యాప్త కార్యాచరణను రూపొందించినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ వెల్లడించారు. మహాత్మా గాంధీ పేరుతో అమలవుతున్న ఉపాధి హామీ పథకం పేరు మార్పు అనేది కేవలం నామమాత్రమైన అంశం కాదని, అది గాంధీజీ సిద్ధాంతాలు, గ్రామీణ పేదల హక్కులపై కేంద్రం చేస్తున్న దాడిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ఆయన తెలిపారు. కూలీలకు ఉపాధి, గౌరవం, భద్రత కల్పించిన ఈ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న నిరసనల్లో భాగంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించి, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. కూలీల గౌరవానికి ప్రతీకగా గంప, కుదలి, పార వంటి పనిముట్లతో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శనలు చేయనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లభిస్తున్న లాభాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రతిపాదిత కొత్త చట్టం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ స్థాయిలో ఉద్యమాన్ని బలపరిచేందుకు జిల్లా, మండల అధ్యక్షులు గ్రామాలను సందర్శించి కూలీలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీల్లో కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయించేందుకు ప్రయత్నాలు జరుగనున్నాయి. అలాగే ఇంటింటా ప్రచారం నిర్వహించి, ప్రస్తుత ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, కొత్త ప్రతిపాదన వల్ల ఎదురయ్యే ప్రమాదాలను కరపత్రాల ద్వారా వివరించనున్నారు. ఈ ఉద్యమం గ్రామాల నుంచే మొదలై రాష్ట్రవ్యాప్త స్థాయికి చేరేలా వ్యూహం రూపొందించారు.
నిరసనల్లో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహాలను శుభ్రపరచి పూలమాలలు వేయడం, గాంధీజీ ఆదర్శాలను గుర్తు చేసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. నిరసన సూచనగా కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి, శాంతియుతంగా ఒకరోజు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనం నిర్వహించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోని లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీకి పోస్టుకార్డులు పంపే ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టి, కూలీల ఆవేదనను నేరుగా కేంద్రానికి చేరవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పోరాటంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా, ఇండియా కూటమి భాగస్వాములు, వివిధ సామాజిక సంస్థలను కూడా భాగస్వాములుగా చేసేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గ్రామీణ కార్మికుల సమస్యలు రాజకీయాలకు అతీతమైనవని, అందుకే సమాన ఆలోచన కలిగిన శక్తులన్నింటినీ కలుపుకొని పోరాటాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా పై విధంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులు, అన్ని మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఈ ఉద్యమాన్ని బాధ్యతగా తీసుకొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాల పూర్తి వివరాలు, తేదీలను త్వరలో తెలియజేస్తామని తెలిపారు. మహాత్మా గాంధీ పేరుతో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఈ జిల్లావ్యాప్త నిరసనలు, గ్రామీణ కార్మికుల హక్కుల కోసం సాగించే ఒక కీలక ఉద్యమంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఉద్యమం కారణంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు గుర్తించి వారికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పించాలని కూడా భావిస్తోంది. పార్టీని పటిష్టం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడంతో పాటు, రాష్ట్రస్థాయి నాయకులు కూడా జిల్లాలో పర్యటించి ఆందోళన కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

