1, జులై 2026, బుధవారం

20వ తేదీకి ముందు తోలిన మామిడికీ మద్దతు ధర వర్తిస్తుందా?



20వ తేదీకి ముందు తోలిన మామిడికీ మద్దతు ధర వర్తిస్తుందా?

ప్రభుత్వ విధివిధానాల కోసం వేలాది మంది రైతుల ఎదురుచూపులు

రూ.4 సబ్సిడీపై స్పష్టత లేక అయోమయం.. 

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

తోతాపురి మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 ప్రభుత్వ మద్దతు (సబ్సిడీ) ధర ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీకి ముందు గుజ్జు పరిశ్రమలు, ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన ర్యాంపులకు మామిడి సరఫరా చేసిన రైతులకు కూడా ఈ సబ్సిడీ వర్తిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై విధివిధానాలు ప్రకటించకపోవడంతో వేలాది మంది రైతులు సందిగ్ధంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తోతాపురి మామిడికి మార్కెట్ ధరతో పాటు కిలోకు రూ.4 ప్రభుత్వ మద్దతు అందించాలని ప్రకటించింది. అయితే ఈ సబ్సిడీ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది, ఎవరికి వర్తిస్తుంది, ఇప్పటికే సరఫరా చేసిన పంటకు కూడా వర్తిస్తుందా లేదా అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలో కొంతమంది అధికారులు, వ్యాపార వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీ తర్వాత సరఫరా చేసిన మామిడికాయలకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే అంతకు ముందు తమ పంటను విక్రయించిన రైతులు నష్టపోతారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 20వ తేదీకి ముందే తమ పంటను గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులకు సరఫరా చేసిన రైతులకు కూడా ప్రభుత్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధరను వర్తింపజేయాలని జిల్లా రైతు సంఘం నాయకులు ఇటీవల జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రైతుల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచే తోతాపురి మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలుత ఐదు, ఆరు గుజ్జు పరిశ్రమలు మాత్రమే కొనుగోళ్లు చేపట్టగా, అనంతరం జిల్లాలోని దాదాపు అన్ని పరిశ్రమలు, ర్యాంపులు కొనుగోళ్లను ప్రారంభించాయి. ఈ క్రమంలో 20వ తేదీ నాటికి సుమారు లక్ష టన్నుల వరకు తోతాపురి మామిడి గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులకు సరఫరా అయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆ మామిడిని విక్రయించిన రైతులంతా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు తమకూ వర్తిస్తుందా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై ఆంధ్రప్రభ జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సతీష్‌ను సంప్రదించగా, ఈ నెల 20వ తేదీ నుంచి సరఫరా చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ తప్పకుండా వర్తిస్తుందని తెలిపారు. అయితే 20వ తేదీకి ముందు సరఫరా చేసిన రైతుల విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో అధికారులు నిమగ్నమై ఉన్నారని, అది పూర్తయిన తర్వాత 20వ తేదీకి ముందు మామిడి సరఫరా చేసిన రైతుల వివరాలను సేకరించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుపై త్వరితగతిన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. 20వ తేదీ నుంచి ఉద్యానవన శాఖ అధికారులు మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద, రాంపుల వద్ద తమ సిబ్బందిని నియమించారు. వీరు మామిడికాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన అనంతరం ఎంత సరఫర చేసింది నమోదు చేసుకుంటున్నారు. అలాగే రైతుకు సంబంధించిన వన్ బి, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుబుక్కు జిరాక్స్ ను తీసుకుంటున్నారు. అన్ని ఫ్యాక్టరీలు రిజిస్టర్ చేసుకున్న రాంపుల వద్ద ఈ పద్ధతి పాటిస్తున్నారు. 20వ తేదీకి ముందు పంటను విక్రయించిన రైతులను కూడా సబ్సిడీ పరిధిలోకి తీసుకురాకపోతే తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులందరి దృష్టి నెలకొంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *