14, మార్చి 2025, శుక్రవారం

రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధం

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సేవలు 

కనుమరుగు కానున్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్

అదృశ్యం కానున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్

కాలగర్భంలో కలువనున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్

ఒకటి, రెండు నెలల్లో విలీనం పూర్తి 


ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.

కేంద్ర ప్రభుత్వం మరోసారి  బ్యాంకుల విలీనానికి తెర లేపింది. అయితే, ఈసారి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తోంది. ఒకే రాష్ట్రం, ఒకే గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో ఈ విలీన ప్రక్రియను  చేపడుతుతోంది. బ్యాంకుల విలీనంతో రాష్ట్రంలోని మూడు  బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉన్నాయి. వీటిల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో మిగితా 3 బ్యాంకులు విలీనమవుతాయి. అంటే ఇకపై ఆంధ్రప్రదేశ్‌‍లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కనిపించవు. అయితే బ్యాంకుల విలీనం ద్వారా ఖాతాదారులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. వారి ఖాతా విలీన బ్యాంక్ నుంచి ప్రధాన బ్యాంకుకు మారుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో అకౌంట్ కొనసాగుతుంది. ఈ విలీనానికి  కసరత్తు దాదాపు పూర్తి అయ్యింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం ఒక్కటే మిగిలింది. ఒకటి, రెండు నెలల్లో విలీన ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. బ్యాంక్ పేరు మాత్రమే మారుతుంది. మిగిలి సేవలన్నీ కొనసాగుతాయి.

 గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు, ఇతర సౌకర్యాలను అందించే లక్ష్యంతో అర్ ఆర్  బి చట్టం, 1976 కింద గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు.  చట్టం 2015లో సవరించారు. దీని ప్రకారం అటువంటి బ్యాంకులు కేంద్ర, రాష్ట్ర బ్యాంకుల నుండి కాకుండా ఇతర వనరుల నుండి మూలధనాన్ని సేకరించేందుకు అనుమతించింది. దేశంలో ప్రస్తుతమున్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ లను 28కి తగ్గించాలని ఆర్థికశాఖ యోచించింది. ఇందుకోసం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్‌ నినాదంతో కేంద్రం రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది.. ఈ సంప్రదింపుల బాధ్యతను నాబార్డుకు అప్పగించింది. గ్రామీణ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 50 శాతం వాటా ఉంది. మరో 35 శాతం స్పాన్సర్‌ బ్యాంక్‌కు, మిగతా 15 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది. 


భారత ప్రభుత్వ నోటిఫికేషన్ 2006 జూన్ 1  ప్రకారం రాయలసీమ గ్రామీణ బ్యాంకు, శ్రీ అనంత గ్రామీణ బ్యాంకు, పినాకిని గ్రామీణ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉనికిలోకి వచ్చింది. ఈ బ్యాంకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల చట్టం 1976 ప్రకారం ఏర్పడింది. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో ఉంది, అనంతపురం, వైయస్ఆర్ కడప, కర్నూలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు ప్రకాశం అనే 5 జిల్లాల అధికార పరిధితో ఉంది. ఈ బ్యాంకుకు 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి, అనంతపురం జిల్లాలోని కదిరి, వైయస్ఆర్ జిల్లా రాజంపేట మరియు కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. బ్యాంకు తన 552 శాఖలతో బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. గ్రామీణ పేదల అవసరాలను ప్రధానంగా మరియు అన్ని ఇతర రంగాలకు కూడా బ్యాంకు తీరుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలను చేరుకోవడం ద్వారా బ్యాంకు తన కార్యాచరణ ప్రాంత ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక రాష్ట్రం మొత్తం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు విస్తరించనుంది. 

 చిత్తూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు,  కృష్ణా జిల్లా గుడివాడ కనకదుర్గ గ్రామీణ బ్యాంకు విలీనంతో సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏర్పడింది, దీని ప్రధాన కార్యాలయం చిత్తూరులో ఉంది.  రాష్ట్రంలోని చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, కృష్ణా జిల్లాల్లో బ్యాంక్ కార్యనిర్వహణ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ బ్యాంకుకు 246 శాఖలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో 68 శాఖలు, ఎన్టీఆర్ జిల్లాలో 52 శాఖలు, తిరుపతి జిల్లాలో 47 శాఖలు, కృష్ణా జిల్లాలో 36, అన్నమయ్య జిల్లాలో 31 శాఖలు, ఏలూరు జిల్లాలో 12 శాఖలతో బ్యాంకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.. 246 శాఖలలో, 166 శాఖలు గ్రామీణ ప్రాంతంలో, 59 సెమీ-అర్బన్‌లో మరియు 21 శాఖలు పట్టణ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ బ్యాంకు యొక్క అధీకృత మూలధనం రూ. 2,000 కోట్లు, ఒక్కొక్కటి రూ. 10/- విలువ గల 200 కోట్ల షేర్లుగా విభజించబడింది. 2023 మర్చి 31 నాటికీ బ్యాంకు  చెల్లించిన మూలధనం రూ. 17.77 కోట్లు. భారత ప్రభుత్వం   రూ. 8.885 కోట్లు, ఇండియన్ బ్యాంక్  రూ. 6.220 కోట్లు, రాష్ట్ర  ప్రభుత్వం రూ. 2.665 కోట్లు పెట్టుబడి పెట్టారు. 

 శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకు, నాగార్జున గ్రామీణ బ్యాంకు,  సంగమేశ్వర గ్రామీణ బ్యాంకు, మంజీరా గ్రామీణ బ్యాంక్, కాకతీయ గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్  ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుగా , 2006లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వరంగల్ లో ఉంది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేయబడింది, ఇది ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో పనిచేస్తోంది. అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లె, ఏలూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో సేవలను అందిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్  278 శాఖలు , 1297 బ్యాంక్ మిత్ర పాయింట్లతో  గ్రామీణ ప్రజలకు సేవలందిస్తున్న ప్రముఖ బ్యాంకులలో ఒకటిగా ఉంది. . మొత్తం శాఖలలో, 187 శాఖలు అంటే 67 శాతం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి, 


చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్  2006 సెప్టెంబర్ 1న స్థాపించబడింది. ఇది చైతన్య గ్రామీణ బ్యాంక్ , గోదావరి గ్రామీణ బ్యాంక్‌లను విలీనం చేయడం ద్వారా ఏర్పడింది. ప్రధాన కార్యాలయం గుంటూరు.  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, గుంటూరు, తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 275శాఖల నెట్‌వర్క్‌తో పనిచేస్తోంది. బ్యాంకుకు 78 సొంత ఏటిఎం లు  249 బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయ గ్రూపులు,  సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. వసాయ రుణాలు, చిన్న, మధ్య తరహా వ్యాపార రుణాలు, స్వయం సహాయ గ్రూపులకు  రుణాలు, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు అందచేస్తుంది. ఈ బ్యాంకు  ప్రధాన కార్యాలయం గుంటూరులో ఉంది.  తూర్పు గోదావరి జిల్లాలో  కాకినాడ, పెద్దాపురం వంటి ప్రాంతాల్లో బ్రాంచీలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో  వివిధ పట్టణాలు, గ్రామాల్లో బ్రాంచీలతో సేవలు అందిస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రీజినల్ ఆఫీస్ ఉంది.  ప్రతి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఏటిఎం,  బ్రాంచీ లొకేటర్ ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయి. 

ఈ బ్యాంకుల విలీనం తర్వాత ప్రధాన కార్యాలయం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలో ఉంది దీనినే ప్రధాన కార్యాలయంగా కొనసాగించాలని ఆ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గుంటూరు కేంద్రంగా చైతన్య గోదావరి బ్యాంక్ పనిచేస్తుంది గుంటూరు ప్రధాన కార్యాలయం అయితే అందరికీ అందుబాటులో  ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ బ్యాంకులో విలీన ప్రక్రియతో పాటు ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *