ప్రకృతికి మేలు చేసే బోగి మంటలు
నేడే భోగభాగ్యాల బోగి పండుగ
(అందప్రభ బ్యూరో, చిత్తూరు.)
భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభం అవుతాయి. సంక్రాంతి పండగ రాగానే తెలుగు ఇళ్ళకు కొత్త శోభ వస్తుంది. దూరప్రాంతాలలో ఉద్యోగాలు చేసే వాళ్ళు, చదువుల కోసం పట్నాలకు వెళ్ళిన వాళ్ళు సొంత ఊర్లకు చేరుకుంటారు. కొత్త అల్లుళ్ళను, ఆడపడుచులను ఆహ్వానిస్తారు. బంధుమిత్రులు అందరు సంక్రాంతికి కలుస్తారు. కొత్త దుస్తులు, రంగు రంగుల ముగ్గులు.. భోగి మంటలు.. కోడి పందేలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, జంగమయ్యల శంఖానాధం, గంటారావాలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. సంక్రాంతి సమయంలో సూర్యడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు. ఆధ్యాత్మిక విషయానికొస్తే దక్షిణయానంలో పడిన కష్టాలను తొలగించి, సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారని కూడా చెబుతుంటారు. భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. వామన అవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చారని చెబుతారు. దీని ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని.. సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పారట. అందుకే సంక్రాంతి ముందు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెబుతుంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. భోగి రోజు వేసే మంటలు కూడా వెచ్చదనం కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ అవి కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇంటి ముందు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మజీవులు నశిస్తాయి. భోగి మంటలు పెద్దగా రావడానికి రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తుంటారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే. వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72వేల నాడులు ఉత్తేజితం అవుతాయి. అందుకే భోగి రోజున భోగి మంటల్లో అందరూ పాల్గొనే సంప్రదాయం వచ్చిందని అంటారు. భోగి మంటలు వేయడం వల్ల సామాజిక బంధాలు బలపడడమే కాకుండా వ్యక్తి మానసిక ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. భోగిమంటలు వేయడం ద్వారా చుట్టుపక్కల ప్రజలంతా ఒక దగ్గర చేరుతారు. ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలుకరించుకొనికబుర్లు చెప్పుకుంటారు. దీంతో మానసిక వత్తిడి తగ్గి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసికంగా, ఆధ్యాత్మికంగా మానవ సంబంధాలు బలపడతాయి. మంటను కాసేపు వరకు అలాగే చూస్తూ ఉండటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యంగా భోగి వ్యవసాయ భూముల్లో ఏర్పడిన పంటవృధాను, వస్తువులను కాల్చేందుకు వేస్తారు. కాగా భూములలో పాతుకుపోయిన వ్యర్థాలను బోగి మంటలు తొలగిస్థాయి. భవిష్యత్తులో నేల సారవంతమవుతుంది. కాల్చిన చెత్త నుంచి వచ్చే బూడిద, ఖనిజాలు, క్యాల్షియం, పొటాషియం భూమిలో చేరి సహజ సిద్ధమైన ఎరువులుగా మారిపోతాయి. ఈ విధంగా చేయడం ద్వారా పంట పొలాల్లో గడ్డి తినే జంతువులకు కూడా హాని కలగకుండా ఉంటుంది. భోగి నాడు చెత్తను కాల్చడం వల్ల పొలాల్లో పేరుకుపోయిన చెత్త నాశనమై కార్బన్ రూపంలో పోషకాలు తిరిగి వస్తాయి. భోగిమంట పాత సంప్రదాయాలు ద్వారా ప్రకృతిని ఆరాధించే ఒక భావన కలుగజేస్తుంది. మంటలు పెద్దగా ఎక్కువసేపు కొనసాగినట్లయితే స్థానికంగా ఉష్ణోగ్రతపెరుతుంది. కావున ఈ భోగిమంటలను శీతాకాలంలో వేస్తారు. చలికాలంలో ఈ బోగి మంటలు వెచ్చదనాన్ని కలుగచేస్తాయి. భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చాలని చెబుతుంటారు. దీంతో చాలామంది ఇంట్లో ఉన్న వస్తువులు అన్నింటినీ వేస్తుంటారు. మంటలు ఎక్కువగా రావాలని కొంతమంది టైర్లు, రబ్బర్, ప్లాస్టిక్ కవర్లు కాలుస్తుంటారు. ఔషధ మొక్కలకు బదులు ఇలాంటి వస్తువులను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతుంది. ఈ మంటల నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల అనేక శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భోగి మంటల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులను కాల్చొద్దని వైద్యులు సూచిస్తున్నారు.