కొండెక్కిన కోడి గుడ్డు ధరలు
రోజు రోజుకూ పెరుతున్న గుడ్డు ధరలు
సామాన్యులకు దూరం అవుతున్న కోడి గుడ్డు
పట్టణాల్లో ఒకటి రూ. 7, పల్లెల్లో ఒకటి రూ. 7.50
వినియోగంతో పాటు పెరగని ఉత్పత్తి
దాణా రెట్లు పెరగడం కూడా కారణమే
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంటి కిచెన్ నుంచి చికెన్, మటన్, ఫిష్ కర్రీ వాసనలే వస్తుంటాయి. మరి అవి తెచ్చుకోలేని బీదలు 'గుడ్డు'లోనే వాటిని చూసుకుని కడుపు నింపుకుంటుంటారు. ఇప్పుడు ఆ గుడ్డు తెచ్చుకోవాలన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి. రోజురోజుకూ ధరలు కొండెక్కుతూ.. సామాన్యుడికి గుండె దడ వచ్చేలా చేస్తున్నాయి. కోడిగుడ్ల ధరలు పెరిగాయి. డజను గుడ్ల ధర రూ.80కి పెరగగా.. ఒకదాని ధర రూ.7 అయింది. ఏడాదిగా డజను గుడ్లు రూ.65 నుంచి రూ.70 ఉండగా.. ఒకటి రూ.6కి వచ్చేది. 10 రోజుల్లోనే ఏకంగా డజను గుడ్ల ధర రూ. 80కి పెరిగింది. దీంతో పట్టణాల్లో ఒక కోడి గుడ్డు ధర రూ. 7 కాగా, పల్లెల్లో ఒక గుడ్డు రూ. 7.50 పలుకుతోంది. మారుమూల గ్రామాల్లో అయితే, 8 రూపాయలకు కూడా అమ్ముతున్నారు.
కోడి గుడ్డు ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు సైతం ఏం కొనాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. ఓ పక్క మార్కెట్లో కూరగాయలు ధరలు మండిపోతుంటే, మరో పక్క కోడి గుడ్ల ధరలు సైతం సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి. కోడిగుడ్డులో చాలా పోషకాలుంటాయి. కాబట్టి చాలామంది కోడిగుడ్లు తినేందుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాంటిది ఇప్పడు కోడి గుడ్డు ధరలు పెరగడంతో సామాన్యులకు కొనాలంటేనే ఆలోచిస్తున్నారు. ఏప్రిల్ మాసంలో కోడి గుడ్డు ధరలు రూ.4 నుండి రూ.4.50 వరకు పలికాయి. అదే మే నెలలో అయితే వీటి ధరలు రూ.5, 5.50కు చేరాయి. జూన్, జూలై మాసాల్లో అయితే కోడిగుడ్డు ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కోడి గుడ్డు ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పడు వీటి ధర రూ.7.00లకు చేరుకోవడంతో వినియోగదారులు గగ్గొలు పెడుతున్నారు. మరోవైపు మారుమూల పల్లెల్లో అయితే కోడి గుడ్లు ధరలు రూ.7.50 వరకు ఉన్నట్లు పలువరు గ్రామస్తులు వాపోతున్నారు. ఎంతో కాలంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరగడంతో పలువురు నాన్వెజ్ ప్రియులు కోడి గుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కోడి గుడ్ల ధరలు కూడా ఒక్కసారిగా కొండెక్కి కూర్చొవడంతో సామాన్యులకు ఏం చేయాలో తెలీడం లేదు. బహిరంగ మార్కెట్లో కోడి గుడ్ల వాడకం విపరీతంగా పెరిగింది. సాయంత్రం అయితే చాలు మార్కెట్లలోని ఫాస్ట్ పుడ్ సెంటర్లలో ఆమ్లెట్లు, న్యూడిల్స్ వంటి కోడి గుడ్ల వినియోగం బాగా ఉంది. అయితే, వినియోగానికి తగినంత ఉత్పత్తి లేకపోవడంతోనే కోడి గుడ్ల ధరలు సామాన్యులకు చుక్కులు చూపిస్తున్నాయి వ్యాపార వర్గాలు అంటున్నాయి.
ఇక, రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ప్రతి రోజూ లక్షకు పైగా కోడి గుడ్ల ఉపయోగం జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వేసవిలో ఎండ తీవ్రతతో ధరలు తగ్గిన తర్వాత ఎండలు తగ్గి వర్షాలు పడటంతో రోజూవారీ ఉత్పత్తి క్రమేణా రేటు పెరుగుతోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు స్థానికంగా గుడ్డు వినియోగాలు పెరిగాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర ఒక్కొక్కటి రూ.7.00 పలుకుతోంది. అదే మార్కెట్లో వినియోగదారుడికి అయితే రూ.7లకు అమ్ముతున్నారు. ఈ రేట్లు గతంలో ఎప్పుడూ చూడలేదని పౌల్ట్రీ వినియోగదారులు అందోళన చెందుతున్నారు. గత వేసవిలో ఎండ కారణంగా 20 శాతం వరకు ఉత్పత్తి పడిపోగా రోజుకు సగటున లక్ష కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమకు సుమారు రూ.50 కోట్ల మేర నష్టం జరిగింది. కోళ్ల మేతకు మొక్కజొన్న టన్ను రూ.22 వేల నుంచి రూ.24 వేలు వరకు పలుకుతుంది. అలాగే నూకలు రూ.18 వేల నుంచి రూ.22 వేల చొప్పున పెరిగాయి. కోళ్ల మేతల ధర టన్ను రూ.26 వేల వరకు పెరగడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చుతో ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తి ఖర్చు రూ.5 ఉంటుందని కోళ్ల రైతులు తెలియజేశారు. చలికాలంలో ధర పెరగడం సాధారణమే అయినా ఇంతస్థాయిలో పెరగడం అరుదని వ్యాపారులు అంటున్నారు. గత నెలలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ ఉత్సవాలకు వాడే కేకుల తయారీలో వీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని తెలుపుతున్నారు. పెరిగిన ధరలు కొంత మేరకు తమకు ఉపశమనమేనని పౌల్ట్రీ రైతులు తెలుపుతున్నారు. గుడ్డు ప్రియులు మాత్రం చాలా ఎక్కువ రేటు పెరిగిందంటున్నారు. వినియోగంతో పాటు.. దానా ధరలు పెరగడమే అధిక ధరలకు కారణమని ఉత్పత్తిదారులు అంటున్నారు. 2020లో గుడ్లు పెట్టే కోళ్లకు వేసే దాణా ధర రూ.14 నుంచి 16 ఉండగా.. నేడు రూ.28 నుంచి 30కి పెరిగిందన్నారు. ప్రస్తుతం డిమాండ్కు తగ్గట్టు కోడి గుడ్ల ఉత్పత్తి లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నెక్ నిర్వాహకులు చెబుతున్నారు.