చిత్తూరు జిల్లాలో రూ.100 కోట్ల జిఎస్టి స్కాం
బోగస్ షెల్ కంపెనీలు, బిల్లులు, కోర్టు పిటీషన్లు
చిత్తూరులో ప్రారంభమై మూడు రాష్ట్రాల్లో విస్తరించిన కార్యకలాపాలు
రాష్ట్రవ్యాప్తంగా రూ.1000 కోట్ల లావాదేవీలు
చిరు వ్యాపారుల, యువకుల ఆధార్ కార్డు, పాన్ నంబర్లతో కోట్లతో నకిలీ లావాదేవీలు
చిరు వ్యాపారికి రూ.12 కోట్ల జిఎస్టి నోటీసు రావడంతో వెలుగులోకి చీకటి బాగోతం
జిల్లా వ్యాప్తంగా 450 మంది వరకు బాధితులు
10 సంవత్సరాలుగా చిత్తూరులో నడుస్తున్న దందా
ఈ కేసులో పలు రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు
దర్యాప్తునకు రంగంలో నాలుగు సిజిఎస్టి బృందాలు రంగప్రవేశం
*చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.*
చిత్తూరు జిల్లా వీధుల్లో రోజూ కనిపించే తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునే సాధారణ పేదల పేర్లతో సంవత్సరాలుగా నడుస్తున్న భారీ జీఎస్టీ మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమవుతోంది. తమ రోజువారీ బతుకుతెరువు కోసం ఉదయం బండిపై కూరగాయలు, పండ్లు, చిన్నచిన్న వస్తువులు అమ్ముకునే అమాయకుల పేరు మీద నకిలీ కంపెనీలు తీసి, బోగస్ ఇన్వాయిసులు సృష్టించి, కోట్లలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్న ఈ దందాకు మొదటి బీజం చిత్తూరులో పది సంవత్సరాల క్రితమే పడింది. అయితే, దీని అసలు రూపం బయటకు రావడానికి ఒక చిన్న సంఘటన కారణమయ్యింది. రోజుకు వంద, రెండు వందలు కూడా సంపాదించలేని వ్యక్తికి ఏకంగా రూ. 12.17 కోట్లు జీఎస్టీ పెనాల్టీ నోటీసు రావడం, దీని ఆధారంగా కోపిర్లగడంతో మొత్తం చీకటి సామ్రాజ్యం డొంక కదిలింది.
తమ పేర్లు ఏ కంపెనీల్లో వాడారో, ఎక్కడ ఎలాంటి వ్యాపారాలు జరిగినాయో, ఎంత టర్నోవర్ చూపించారో, ఎన్ని కోట్ల లావాదేవీలు నడిపారో అసలు ఆ పేదలకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే, వీరి పేర్లతో కంపెనీలు ఓపెన్ చేసే మోసగాళ్లు ఒకే పద్ధతి పాటించేవారు. ఒక చిన్న పని ఉంది… మీ ఆధార్, పాన్ ఇస్తే పది వేల రూపాయలు ఇస్తామని చెప్పి వారి డాక్యుమెంట్లన్నీ తీసుకోవడం. వాళ్లు ఇచ్చిన ఆధార్, పాన్, ఫోటో, చిరునామా ఆధారంగా నకిలీ ఈమెయిల్లు, నకిలీ మొబైల్ నంబర్లు సృష్టించి, వాటి ద్వారా జీఎస్టీ రిజిస్ట్రేషన్లు జరిపి, రాత్రికి రాత్రే వేల కోట్ల టర్నోవర్ కంపెనీలను తయారు చేయడం గ్యాంగ్ సాధారణ పని.
ఈ స్కామ్కు పునాది చిత్తూరులో పడినా, దీని మూలాలు ఒక్కచోటే లేవు. నకిలీ కంపెనీల నెట్వర్క్ మూడు రాష్ట్రాల్లో విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. చిత్తూరులో కంపెనీల రిజిస్ట్రేషన్లు, హైదరాబాదులో బోగస్ ఇన్వాయిసులు, బెంగళూరులో లావాదేవీలు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. నరసరావుపేటలో ఉన్న అబ్బు ఎంటర్ప్రైజెస్, హైదరాబాదులోని వెంకటేశ్వర ట్రేడర్స్, బెంగళూరులోని అల్ ఫత్ ట్రేడర్స్ వంటి ఫ్రంట్ కంపెనీలు ఈ మొత్తం దందాకు కేంద్ర బిందువులుగా మారాయి. కానీ వీటన్నింటి వెనక తలదాచుకున్న గ్యాంగ్ మాత్రం మంచి చదువున్న, సాఫ్ట్వేర్ పరిజ్ఞానమున్న యువకులు, మధ్యవర్తులు, బ్యాంకు ఖాతాలు తెరవడంలో నైపుణ్యం కలిగిన దళారులు, జీఎస్టీ లోటు పాట్లు తెలిసిన మోసగాళ్లు. వీళ్లంతా కలసి పని చేసిన విస్తృత నెట్వర్క్ వందల కోట్ల జిఎస్టి కుంభకోణం.
అసలు మొదటి తప్పు ఎక్కడ జరిగిందంటే డిజిలాకర్ లింక్లను మొబైల్ సిమ్ యాక్టివేషన్ల ద్వారా మోసగాళ్ల నియంత్రణలోకి వెళ్లనివ్వడం. ఆధార్ కార్డు ఉన్న వ్యక్తిని తీసుకుని ఫోటో తీయడం, అతని ఆధార్తో డిజిలాకర్లో లోగిన్ అవ్వడం, ఓటిపి మోసగాళ్లు తమ చేతిలో ఉన్న నంబర్పై రావడం, అన్నీ ప్లాన్ ప్రకారమే. ఇలాంటివిధంగా పొందిన డిజిలాకర్ డాక్యుమెంట్లను వారివే అని చూపిస్తూ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేసి, జీఎస్టీలో కంపెనీలు రిజిస్టర్ చేయడంతో నిజమైన వ్యక్తి చేతిలో అసలు ఏమీ ఉండేది కాదు. ఈ డిజిటల్ మలుపే ఈ స్కామ్కు ప్రధాన బలం.
ఇక బ్యాంకుల నిర్లక్ష్యం మరి ఒక మూలం. లక్షల్లో లావాదేవీలు జరిగే ఖాతాలు తెరుస్తూ ఖాతా ఓపెన్ చేసిన వ్యక్తి నిజంగానే వ్యాపారం చేస్తున్నాడా, లేదా డాక్యుమెంట్లు అసలు అతడివేనా అన్న ధృవీకరణ చేయడంలో విఫలమవడం స్కామ్కు రాకెట్ ఇంధనంలా పనిచేసింది. లక్షలు, కోట్లు తిరిగే ఖాతా చూస్తే కూడా కేవైసీ పూర్తయింది అని చేతులు దులుపుకోవడం, మోసగాళ్లకు ఓపెన్ గేట్లులా మారింది.
పన్ను శాఖలోని కొంతమంది ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్థాయి మోసం జరగడం అసాధ్యం. కంపెనీ రిజిస్ట్రేషన్లలో సిస్టమ్ లోపాలు, పర్యవేక్షణలో బలహీనత, అనుమానాస్పద టర్నోవర్కు వెంటనే విచారణ చేయకపోవడం అంతా కలిసి ఈ దందాకు కారణం అయ్యాయి. అలాగే రాజకీయ ఆశ్రయం ఉందనే అనుమానాలు కూడా బాధితులు వ్యక్తపరుస్తున్నారు.
ఈ స్కామ్ బయటపడటానికి కారణమైన ముఖ్యమైన మలుపు హైకోర్టు కేసు. అమాయకుల పేర్లతో కూడా కోర్టులో పిటిషన్లు దాఖలై ఉండటం మోసగాళ్ల ధైర్యాన్ని చూపిస్తుంది. వీరికి కోర్టు ఎలా పనిచేస్తుంది అనే అవగాహన కూడా లేదు. కానీ రిట్ పిటిషన్ నంబర్ 63/2025 పేరుతో అసలు పేద వ్యక్తి తెలియకుండానే పిటిషన్ వేసి ఉండటం దర్యాప్తును మరింత చిక్కుగా మార్చింది. సంతకాలు నిజమా? ఎవరు వేశారు? ఈమెయిల్స్ ఎవరి ఎవరు పంపారు? అన్న అన్నీ విచారణకు చేరాయి. హైకోర్టు సీన్ లోకి రావడం ఈ దందాకు కొత్త మలుపు. చిత్తూరులోని ఒక జీఎస్టీ అధికారి పేరుతో కూడా ఒక బోగస్ కంపెనీని సృష్టించడం ఈ కుంభకోణానికి పరాకాష్ట.
దీని తర్వాతే 20-11-2025న తిరుపతి జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ పంపిన భారీ షోకాజ్ నోటీసులు మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 450 మందికి ఇలాంటి నోటీసులు పంపారని సమాచారం. ఇప్పటివరకు అమాయకుల పేర్లతో నకిలీ ఐటిసి క్లెయిమ్లు వేసి, ఏకంగా రూ.1000 కోట్లకు పైగా దేశాన్ని దోచుకున్న మోసగాళ్ల గుంపు ఇప్పుడు విచారణకు ముందు కనిపించకుండా పోవడం దర్యాప్తు అధికారులను మరింత అప్రమత్తం చేసింది. చిత్తూరులో ప్రత్యేకంగా ఏర్పాటైన నాలుగు సి జి ఎస్ టి విచారణ బృందాలు బ్యాంక్ స్టేట్మెంట్లు, కాల్ డేటా రికార్డులు, సి జి ఎస్ టి ఐ ఎన్ రిజిస్ట్రేషన్ ట్రేసింగ్, డిజిలాకర్ ట్రైల్, ఐ పి లాగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా కూపి లాగుతున్నారు. ఇప్పుడు దర్యాప్తు అధికారుల లెక్క ప్రకారం ఈ స్కామ్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నవారి సంఖ్య 50 మందికి మించే అవకాశం ఉంది. వీరిలో నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ బ్రోకర్లు, ఫైనాన్స్ ఏజెంట్లు, డిజిటల్ సర్వీస్ సెంటర్ ఉద్యోగులు, మధ్యవర్తులు, షెల్ కంపెనీ ఆపరేటర్లు ఉన్నట్లు సూచనలున్నాయి.
ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందంటే—తదుపరి దశలో బ్యాంకింగ్ నెట్వర్క్ను త్రవ్వడం, నకిలీ కంపెనీల లాజిస్టిక్ ఎంట్రీలను పరిశీలించడం, ఇంటర్-స్టేట్ లావాదేవీలను క్రాస్ చెక్ చేయడం, ఫ్రంట్ కంపెనీల అసలు యజమానులను గుర్తించడం జరుగుతుంది. అంతేకాదు, కొన్ని ఐటి కంపెనీల పేర్లను వాడి నకిలీ బిల్లులు సృష్టించారని అనుమానం రావడంతో దర్యాప్తు ఐటి శాఖ వైపు కూడా విస్తరించే అవకాశం ఉంది.
చిత్తూరు జిల్లా నుంచి మొదలైన ఈ చిన్న చిచ్చు ఇప్పుడు మూడు రాష్ట్రాలను దూసుకెళ్లి దేశవ్యాప్తంగా పరిపాలన వ్యవస్థకు బీటలు వార్చే స్థాయి సమస్యగా మారింది. పేద ప్రజల పేర్లను, ఆశలను ఆయుధాల్లా వాడుకుని కోట్లు సంపాదించిన ఈ దందా వెనక ఉన్న బండారు నేతలు, ప్రముఖ వ్యక్తులను బయటపెట్టాలని బాధితులు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

