సెల్ ఫోన్ కు బానిస అవుతున్న బాల్యం
నేడు బాలల దినోత్సవం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
చందమామారావే.. జాబిల్లి రావే.. కొండెక్కిరావే.. గోగిపూలుతేవే.. అంటూ చందమామను చూపిస్తూ తల్లులు వారి చంటిబిడ్డలకు గోరుముద్దలు తినిపించే రోజులు పోయాయి. ప్రస్తుత ఆధునికయుగంలో యాపిల్ రావే.. ఐఫోనురావే.. మా పిల్లవాడితో ఆడుకోవే.. గేమ్లతో రావే.. మా చంటిబిడ్డను అలరించవే అంటూ ప్రసుత్త యుగం తల్లిదండ్రులు చేస్తున్న అలవాటు భవిష్యత్తులో తీవ్రరూపం దాల్చి బాల్యం మంతా సెల్కు బానిసలుగా చేస్తోంది. తిండిలేకపోయినా ఉంటున్నారు కానీ పది నిమిషాలు సెల్ ఆగిపోతే ప్రాణం పోయినట్టు నేటి సమాజం తయారైంది. నేటి తరంలో ఏడాది చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు సెల్ బారిన పడనివారులేరంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలపై పెనుప్రభావానే చూపిస్తుంది. ఒకప్పుడు అనురాగాలు, అప్యాయతలతో గడిచిన బాల్యం నేడు మారుతున్న సాంకేతికతతో అన్నిరకాల అప్యాయతలను కోల్పోతోంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, వీడియో గేమ్స్ ఇలా ఎన్నో ఆధునిక సాంకేతి కత పరికరాలు నేటి చిన్నారులకు కాలక్షేపంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వెళితే సాయంత్రానికి పిల్లల కోసం ఇంటికి వచ్చేవారు. నేడు ఎటు వెళ్లినా.. ఫోన్లలో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడి దూరంగా ఉంటున్నారు.
ఒకరకంగా మారుతున్న టెక్నాలజీ వల్ల కొంత ప్రయోజనాలు ఉన్నా దాని వల్ల అనర్థాలే ఎక్కువగా ఉంటున్నాయని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. పాప ఏడుస్తోంది అంటే సెల్ఫోన్ ఇవ్వు ఊరుకుంటుందే అనే రోజులు వచ్చేశాయి. పిల్లలు ఏడాది నుంచే సెల్ఫోన్కు ఎడిక్ట్ అయిపోతున్నారు.. అదే మంచిదనుకుని, చిన్నారులకు సెల్ఫోన్ ఇచ్చేసి తమ పని తాము చేసుకుంటు న్నారు. సెల్ ఎందుకిచ్చావే అంటే ఫోన్ ఇస్తేనే కానీ ఊరుకోవడంలేదనేది పెద్దల మాట. మారుతున్న సాంకేతికత, పరిజ్ఞానం రోజురోజుకూ చిన్నారులను వారి తల్లిదండ్రులకు దూరం చేస్తోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు ఇతర బాధ్యతలతో తల్లిదండ్రులు బిజీగా ఉంటూ చిన్నారి పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్న సంస్కృతి నేటి సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతుంది. బాల్యం ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందమైన జ్ఞాపకం. కానీ నేటి తరంచిన్నారులు మాత్రం ఆ ఆనంద క్షణాలకు దూరమవుతూ వారికే తెలియని ఒంటరి జీవితాలను గడుపుతున్నారు. పొద్దున బడికెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చితిని పడుకున్న తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం అనేక కుటుంబాలలో కనిపిస్తున్నాయి. ఒకవేళ తొందరగా వచ్చిన ఫోన్లలో తల్లిదండ్రులు బిజీగా ఉంటుంటే పిల్లలు టీవీలో, ట్యాబ్లైట్లలో బిజీగా ఉంటున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. ఇలాంటి పోకడలు నేటి సభ్యసమాజం ఆలోచిస్తే తల్లిదండ్రుల ప్రేమకు దూరమై మానసిక క్షౌభను అనుభవిస్తున్న ఎంతో మంది చిన్నారులకు సైతం మేలు జరుగుతుంది. సెల్ ఫోన్లో సోషల్ నెట్వర్కింగ్ అందుబాటులోకి వచ్చాక అరచేతిలో ప్రపంచం చూస్తున్నారు. నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారులు సోషల్ నెట్వర్క్లతో బిజీ అవుతున్నారు . ఫేస్బుక్, టెలిగ్రామ్, పింటర్, యూట్యూబ్, వాట్సాప్, వీడియో కాలింగ్, ఆ్లనన్ షేర్, గూగుల్ ప్లస్ వంటి సామాజిక మాధ్యమాలు మేలు కంటే దుష్పరిణామాలే అధికంగా చూపిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకు పాఠశాల స్థాయి విద్యార్థులు ఇంటికి రాగానే టీవీలో కార్టూన్ కార్యక్రమాలకు అతుక్కుపోయేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అరచేతిలో పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తున్నారు.గతంలో పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి వెళితే వారిని వెతికి తీసుకొచ్చే వాళ్లం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితులలో ఆడుకొమ్మని చెప్పినా వెళ్లని పరిస్థితి పిల్లలది. స్మార్ట్ఫోన్ ఉంటే చాలు పిల్లలు ఇంట్లోనే బంధీ అవుతున్నారు. గతంలో పట్టణాల్లోని పిల్లలు మాత్రమే స్మార్ట్ ఫోన్లతో ఆడుకొనే వారు ప్రస్తుతం మండలంలోని గ్రామాల్లోని పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకు ఆకర్షితులై ఫోన్ల కోసం తల్లిదండ్రలతో పోట్లాడుతున్నారు. పిల్లలు, యుక్తవయసుకు వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం మేరకే వారి మిత్రులతో మాట్లాడుతూ ఉండాలని, ప్రవరనలో మార్పులకు కారణాలు తెలుసుకొని పరిష్కరించాలని, అర్థరాత్రి వరకు చదువుతుంటే క్రమంగా ఈ అలవాటును మాన్పించాలని, చదువుకొనే సమయంలో తలుపులు మూయవద్దని చెప్పాలని, వారి మొబైల్, ల్యాఎ్టాప్ వంటివి వారిని నొప్పించకుండా చెక్ చేస్తూ ఉండాలి. చెడు వ్యసనాలకు బానిసలయితే వెంటనే కౌన్సెలింగ్ ఇప్పించాలని, ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఎన్నో దుష్పరిణామాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమితో మతిమరుపు, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి జరుగుతాయని తెలుపుతున్నారు. దీంతో ప్రతి విషయంలో చిరాకు, కోపం వస్తుందని వారు తెలిపారు. ఇవే కాకుండా అధికంగా మొబైల్ వాటకం మూలాన తలనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని వైద్యులు చెబుతున్నారు. సెల్ వాడే వారిని పెద్దలు గమనిస్తూ ఉండాలని మానసిక వైద్యుల సూచన.