మేయర్ దంపతుల హత్య కేసులో ఐదు మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం
నేరస్థులకు ఈనెల 27న శిక్ష ఖరారు
నేరస్తులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశం
మరో 18 మంది మీద కేసు కొట్టివేత
ముందు జాగ్రత్తగా చిత్తూరు పట్టణంలో ఆంక్షలు
ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసు భద్రత
చిత్తూరు, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ బ్యూరో) : పది సంవత్సరాల కిందట చిత్తూరు పట్టణంలో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో న్యాయస్థానం ముఖ్యమైన తీర్పును శుక్రవారం వెలువరించింది. 9వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు తీర్పును విలువరించారు. కేసులో ఏ1 నుండి ఏ5 వరకు ఉన్న ఐదు ముద్దాయిలపై హత్య నేరం రుజువైందని కోర్టు తీర్పులో పేర్కొన్నారు. వారికి అక్టోబర్ 27 వరకు న్యాయస్థాన జ్యూడిషియల్ కస్టడీ విధించారు. 27వ తారీఖున వారికి కోర్టు శిక్ష ఖరారు చేయనంది. అలాగే, ఏ6 నుండి ఏ23 వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలలపాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది. అత్యా నేరం విలువైన వారిలో చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ ఉన్నారు. ఐదు మంది మీద నేరము రుజువు కావడంతో 18 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నేరం రుజువైన ఐదు నందిని వెంటనే కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
2015 నవంబర్ 17వ తేదీన చిత్తూరు నగర మేయర్ కటారి అనూరాధ ఛాంబర్ లోని సీటులో కూర్చుని విధి నిర్వహణలో ఉండగా, ఆమె భర్త మోహన్ కూడా అక్కడే ఉన్నారు. వారితో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా ఉన్నారు. అదే సమయంలో ముసుగు ధరించిన కొందరు తొపాకులు, కత్తులతో మేయర్ చాంబర్ లోకి దూసుకుని వచ్చారు. మేయర్ అనూరాధను తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె భర్తను కత్తులతో వేటాడి చంపారు. దీంతో నగర పాలక సంస్థ కార్యాలయం రక్తంతో తడిసింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిగా మేయర్ కటారి అనూరాధ, మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ తోపాటు ఈ కుట్ర వెనుక 23 మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నారు. మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య నేపథ్యంలో చిత్తూరు-1 పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 2016 ఫిబ్రవరి 18వ తేదీ చార్జిషీట్ దాఖలు చేశారు. పోలీసుల కథనం మేరకు 2015 నవంబర్ 17వ తేదీ ఉదయం 11.45 గంటలకు నిందితులు S. చంద్రశేఖర్ అనే చంద్రశేఖర్, వెంకటచలపతి ఆనే ములబగల్ వెంకటేష్ తుపాకులు, ప్రాణాంతకమైన ఆయుధాలతో బుర్కాలు ధరించి, మరో జయప్రకాశ్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్ కలిసి వచ్చారు. మేయర్ కార్యాలయంలోనే అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ పై దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి ఆస్తి, ఆర్థిక వివాదాల కారణంగా జరిగింది. ఈ కేసులో మొత్తం ఏ1 నుంచి ఏ23 వరకు నిందితులు వివిధ పాత్రలతో నేరానికి కుట్ర పన్నడం, నేరంలో పాల్గొనడం, ప్రధాన నిందితుడికి ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు సరఫరా చేయడం వంటి కుట్రలో భాగస్వాములయ్యారని చార్జ్ షీట్లో ఆరోపించారు. పట్టపగలు చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మేయర్ కటారి అనూరాధ, మోహన్ దంపతుల హత్య ఘటన సంచలనం రేకెత్తింది. పోలీసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీర్ఘకాలం విచారణ సాగింది. ఈ కేసులో కొందరు జైలులో ఉన్నారు. ఇంకొందరు మరణించారు. ఈ కేసులో నిందితిడిగా ఉన్న ఏ22 కసారం రమేష్ కేసు నుంచి విడుదలయ్యాడు. ఏ21 ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి మరణించాడు. ఏ3, ఏ4గా ఉన్న నిందితులు చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారు. హత్య కేసులో ప్రధాన నిందితులు చంద్రశేఖర్, వెంకటచలపతి అనే మూలబగల్ వెంకటేష్ బెయిల్ పై బయట ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
చిత్తూరులో భారీ పోలీసు బందోబస్తు
ఈ కేసుపై శుక్రవారం తీర్పు వెలువడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. హత్య జరగడం వెనుక కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు ఉన్నా, రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన అంశం కావడం వల్ల పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చిత్తూరు పట్టణంలో విస్తృత భద్రతా పరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ధర్నాలు రాస్తారోకోళ్లపై ఆంక్షలు విధించారు. పట్టణంలో పోలీసు 30 ఆక్ట్ ను అమలు చేశారు. జిల్లా కోర్టు పరిసరాల్లో సిబ్బంది మినహా ఇంకోవరనీ అనుమతించలేదు. ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న, మరణించిన వారి ఇళ్లతో పాటు చూడా చైర్పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్యే సికె బాబు ఇళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో తీర్పు వెలువరించనున్న జడ్జీ నివాసంతో పాటు ప్రభుత్వ న్యాయవాది, ఫిర్యాదుదారిడి ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నేర చరిత్ర కలిగిన, జైలు నుంచి విడుదలైన లేదా సమస్యాత్మక ప్రవర్తన కలిగిన నిందితులపై నిఘా పెట్టారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.

