చిత్తూరులో రూ. 27.21 లక్షల సైబర్ మోసం
ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు
ముద్దాయి అకౌంట్ ను ఫ్రీజ్ చేసిన పోలీసులు
చిత్తూరు, అక్టోబర్ 13, (ఆంధ్రప్రభ బ్యూరో): చిత్తూరు పట్టణము నందు ట్రేడింగ్ పేరుతో 27.21 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై చిత్తూరు టు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు అందిన వెంటనే ముద్దాయి అకౌంట్ ను పోలీసులు ఫ్రీజ్ చేశారు.
ఈ కేసు కు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. జూన్13న చిత్తూరు పట్టణము గిరింపేటలో నివసించే షేక్ అలీకి ఒక అపరిచిత వ్యక్తి తాను పిన్ ట్రేక్స్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నానని పరిచయం చేసుకున్నాడు. ఫిర్యాదుదారునికి ఫోన్ ద్వారా సంప్రదించి, కొంత పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మబలికారు. ఇది నమ్మి మొదటగా రూ.21,499 మొత్తాన్ని ఫిర్యాదుదారుడు తన స్నేహితుడు ఫోన్పే ద్వారా బదిలీ చేశాడు. షేక్ అలీ పేరుతో ఒక యూసర్ ఐ.డి. తో ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసి, ఆ తరువాత కూడా సైబర్ మోసగాడు నిరంతరం ఫోన్ ద్వారా సంప్రదిస్తూ, పెద్ద మొత్తాల లావాదేవీలు చేయమని ప్రలోభపెట్టాడు. దీనికి అనుగుణంగా ఫిర్యాదుదారుడు కింది విధంగా వివిధ తేదీల్లో మొత్తాలు బదిలీ చేశారు. జూన్ 18న రూ.3,50,000, 19న రూ.5,00,000 , 23న రూ.8,50,000, 30న రూ.5,00,000 లను బదిలీ చేశారు., 30న స్నేహ ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి మరికొంత మొత్తం బదిలీ చేయమని కోరడంతో జూలై 11వ తేదీన రూ.2,50,000 మొత్తాన్ని బదిలీ చేశారు. అలాగే ఆయన భార్య అకౌంట్ నుండి రూ.2,50,000 మొత్తాన్ని బదిలీ చేశారు. మొత్తం రూ.27,21,499 మొత్తాన్ని ఈ నకిలీ ట్రేడింగ్ పేరుతో బదిలీ చేశాడు.
ఈ మొత్తం అతను మోసపోయానని గ్రహించిన షేక్ అలీ ఆదివారం రాత్రి చిత్తూరు టు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టౌన్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్లల కింద కేసు నమోదు చేశారు. వెంటనే టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య మోసగాడి అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య ఆంధ్రప్రభతో మాట్లాడుతూ
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని అంటే నమ్మకండి, సైబర్ మోసగాళ్ల బారిన పడకండి అన్నారు.
అజ్ఞాత లాభాల మాటలకు లోనై నష్టపోవద్దనీ, అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా మెలగాలన్నారు. తెలియని వ్యక్తులు లేదా సంస్థల పేరుతో ఫోన్ కాల్స్, సోషల్ మీడియా, లేదా ట్రేడింగ్ యాప్ల ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు మోసం చేసే ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని వివరించారు. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం అంటూ ఆకర్షించే మాటలు చెప్పేవారిని నమ్మి మోసపోవద్దని సూచించారు. బ్యాంక్ వివరాలు, ఓటిపి, యుపిఐ పిన్, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థ ప్రభుత్వ అనుమతితో ఉన్నదా లేదో తప్పక ధృవీకరించుకోవాలని కోరారు. ఆన్లైన్లో సులభంగా డబ్బులు వస్తాయనే మాటలను ఎప్పటికీ నమ్మొద్దనీ, అటువంటి కాల్స్ వస్తే వెంటనే మీ దగ్గరలోని పోలీసులకు తెలపి తక్షణ సహాయం పొందవచ్చు అన్నారు. ఎవరైనా మోసపూరితంగా డబ్బులు బదిలీ చేయించినట్లయితే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కి ఫోన్ చేయాలనీ, వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య తెలిపారు.

