కిలో మామిడి రెండు రూపాయలా ?
రైతులను కూటమి ప్రభుత్వం దివాలా తీయిస్తోంది
పెట్టుబడి సహాయం, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదు
రైతుల తలలు పగులగొట్టి, రౌడీ షీట్లు తెరుస్తారా?
రైతులకు అండగా వైసిపి ఉద్యమిస్తుంది
బంగారుపాళ్యంలో మాజీ సిఎం జగన్
బంగారుపాళ్యం, జులై 9 (ఆంధ్రప్రభ): కిలో మామిడి రెండు రూపాయలా, ఇంత దారుణం ఎక్కడైనా ఉందా అంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మామిడి రైతుల తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని, వారికీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డ్ ను జగన్ సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతుల జీవితాలను నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రైతులను కలవకుండా అంక్షలు విధిస్తున్నారని, ప్రభుత్వమే రైతుల మీద tకుట్ర చేస్తుందని ఆరోపించారు. రైతులను రౌడీ షీటర్లతో పోలుస్తారా? వారి మీద రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులను పరామర్శిస్తే మీకెందుకు భయమని ఎద్దేవా వేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. మామిడి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని, వైసీపీ పాలనలో కిలో మామిడి 22 నుంచి 29 రూపాయలకు కొనుగోలు చేశామని తెలిపారు. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కిలో మామిడిని 16 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే, రాష్ట్రంలో చంద్రబాబు గాడిదలు కాస్తున్నారని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఫ్యాక్టరీలు కూడా రైతులను మోసం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను దివాలా తీయిస్తుందని ఆరోపించారు. లక్షల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తుందని ముందే తెలిసినా, చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఆర్ బి కే ల ద్వారా రైతులను చేయి పట్టుకుని నడిపించిందని, చంద్రబాబు వాటిని కూడా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సహాయం అందజేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. నియోజకవర్గస్థాయి అగ్రి టెస్ట్ ల్యాబులు నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు. రైతులు పండించిన మామిడిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల తరఫున వైసిపి ఉద్యమిస్తుందని, ప్రతి రైతుకు అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. జిల్లాలో ఎంతమంది రైతులకు కిలోకు 12 రూపాయలు చెల్లించారో చెప్పాలన్నారు. రైతులను పరామర్శించడానికి వస్తుంటే రెండు వేల మంది పోలీసులను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల తలలు పగలగొట్టారని, 1200 మందిని అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పోలీసులా ? రాక్షసులా ? అంటూ పోలీసుల ఉద్దేశించి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు, లంచాలకు లొంగవద్దని, రేపు చంద్రబాబు పోలీసులను కూడా మోసం చేస్తే తానే మీ తరఫున పోరాడాల్సి వస్తుందని తెలిపారు. తాను ఎల్లప్పుడూ ప్రజల సమస్యల మీద పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి తన బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, పూతలపట్టు నియోజక ఇంచార్జి సునీల్, చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విజయానంద రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి రాజేష్, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, వైసిపి నేత అనీషా రెడ్డి, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
*ఎస్పీతో వాగ్వివాదం*
జగన్ పర్యటనలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన యువజన నేత తలకు గాయమైందని రక్తం కారుతుండగా కాన్వాయ్ వద్దకు చేరుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ లో వాహనం నుంచి దిగి అతనిని పరామర్శించడానికి ప్రయత్నం చేశారు. అయితే పరిస్థితి అదుపు తప్పుతుందని జగన్ వాహనం నుంచి దిగకుండా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. దీంతో జగన్ వాహనం నుంచి దిగకుండానే వెళ్ళిపోయారు. చాలా చోట్ల పోలీసులకు వైసిపి నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. పోలీసులు చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జ్ విజయనంద రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి వాహనాలను లోనికి అనుమతించలేదని పోలీసులతో గొడవపడ్డారు. అలాగే ఒక కార్యకర్త పోలీసులతో గొడవపడుతూ రప్పా రప్పా నరికేస్తామని బెదిరించాడు. వైసిపి కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను లెక్కచేయలేదు. హెలిపాడ్ దగ్గరికి 30 మంది కార్యకర్తలు, మార్కెట్ యార్డులోకి 500 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అయితే పోలీసులను తోచుకుని వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు మార్కెట్ యార్డులోకి ప్రవేశించారు. అలాగే మార్కెట్ యార్డ్ వెనుకవైపునున్న గోడ ఎక్కి లోపలికి ప్రవేశించారు.
*రోడ్డుమీద మామిడి పోసి నిరసన*
జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా కొందరు వైసీపీ నాయకులు తోతాపురి మామిడిని రోడ్లమీద పోసి నిరసన వ్యక్తం చేశారు. పోసిన మామిడికాయలను ట్రాక్టర్లతో తొక్కించారు. రెండు, మూడు ట్రాక్టర్ల మామిడికాయలను రోడ్డు మీద పోసి, తొక్కించడం పట్ల రైతులలో నిరసన వ్యక్తం అవుతుంది. ఇది మంచి పరిణామం కాదని మామిడి రైతులు అంటున్నారు.

