తోతాపూరి టన్నుకు రూ.14, 907 మద్దతు ధర ప్రకటించిన కేంద్ర
50:50 నిష్పత్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మద్ధతు ధర చెల్లింపు
-నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్న నగదు
ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు కృషి
మామిడి రైతులలో హర్షాతిరేకాలు
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాష్ట్రంలోని మామిడి రైతులకు ఊరట దక్కింది. తోతాపురి మామిడికి టన్నుకు మార్కెట్ మద్దతు ధరను రూ.14,907గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం నుంచి ప్రకటన విడుదల చేశారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో మార్కెట్ మద్దతు ధరను చెల్లిస్తాయి. ఈ డబ్బుల్ని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు. మద్దతు ధర విషయంపై స్పందించి, ఆ సమస్యను పరిష్కరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం 2025-26 సంవత్సరానికి మార్కెట్ జోక్య పథకం కింద 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని కొనుగోలు చేయడానికి అవకాశం కలుగుతుంది.
మామిడి రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారు. ఆయన చొరవతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని తోతాపురి మామిడి రైతులకు మద్దతుగా వ్యాపారులు ముందుకు వచ్చారు. అలాగే, చాలా ప్రాసెసింగ్ యూనిట్లు కూడా రైతులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అంతేకాదు ఏపీ ప్రభుత్వం గత వారం కూడా మామిడి రైతుల అకౌంట్లలో రూ.260 కోట్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. అలాగే తాజాగా మరో రూ.150 కోట్లు వారి ఖాతాలకు జమ చేయబోతోంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం తోతాపురి మామిడి రైతుల్ని ఆదుకునే పనిలో ఉంది.
2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం తోతాపురి మామిడికి ధర లోటు చెల్లింపు మార్కెట్ జోక్య పథకం అమలు కోసం 23.06.2025 నాటి లేఖ, 04.07.2025 నాటి ఇమెయిల్, 17.07.2025 నాటి లేఖల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్ళింది. ఇందుకు ధర లోటు చెల్లింపు పథకం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం తోతాపురి మామిడికి ధర లోటు చెల్లింపు పథకాన్ని మార్కెట్ జోక్య పథకం మార్గదర్శకాల ప్రకారం అమలు చేయడానికి, తోతాపురి మామిడికి ధర లోటు చెల్లింపు క్రింద గరిష్ట కవరేజీ 1,62,500 మెట్రిక్ టన్నులు అంటే 6,50,000 క్వింటాళ్లు వరకు వర్తిస్తుంది. తోతాపురి మామిడికి మార్కెట్ జోక్య ధర రూ.1,490.73 క్వింటాల్కు నిర్ణయించింది. రోజువారీ అమ్మకపు ధరను ప్రిన్సిపల్ సెక్రటరీ ఉద్యానవనం ఛైర్మన్ షిప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మార్కెట్ జోక్య పథకం కింద అమ్మకపు ధర మధ్య గరిష్ట డిఫరెన్షియల్ చెల్లింపు మార్కెట్ జోక్య పథకంలో 25 శాతం వరకు ఉంటుంది. అంటే రూ. 372.68 క్వింటాల్కు మార్కెట్ జోక్య పథకంలో 25 శాతం అంటే 1490.73. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం 50:50 నిష్పత్తిభరిస్తాయి. ధర లోటు చెల్లింపును పొందే రైతులు తమ ఉత్పత్తులను వ్యాపారుల ద్వారా, సరైన డాక్యుమెంట్ ద్వారా ధృవీకరించిన మామిడి మండి, మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్లు, రాంప్ల ద్వారా విక్రయించాలి. 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడికి మార్కెట్ జోక్య పథకం కింద ధర లోటు చెల్లింపు అమలు కాలం ఈ లేఖ జారీ చేసిన మొదటి లావాదేవీ తర్వాత 30 రోజులు ఉంటుంది. 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ధర లోటు చెల్లింపు కింద తోతాపురి మామిడి కవరేజీ కోసం వ్యాపారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయాలి. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు మూడు లక్షల టన్నుల తోతాపురి మామిడిని రైతులు ఫ్యాక్టరీలు, ర్యాంపులకు సరఫరా చేశారు. 60,781 రైతులు ఈ పధకం వాళ్ళ లబ్ది పొందనున్నారు.
తోతాపూరి మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి రావడంతో మామిడి ధర తగ్గుముఖం పట్టింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులతో, పల్ప్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. దిగుబడి ఎక్కువ ఉండటంతో మామిడి పంటను పల్ప్ ఫ్యాక్టరీలు తక్కువ ధరకు అడుగుతున్నారని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే ఈ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పల్ప్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని 8 రూ కొనాలని, 4 రూ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. కేజీ 12 రూ చొప్పున రైతులకు అందచేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఢీల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మం త్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కలసి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి సబ్సీడి నగదులో 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదును చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
*మామిడి రైతులకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు*
మంత్రి అచ్చెన్నాయుడు అభ్యర్ధనని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్రకటించింది. 50:50 నిష్పత్తిలో కేంద్రం, ఏపీ రాష్ట్రం మద్ధతు ధరను చెల్లించనున్నాయి. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ విషయం పట్ల తోతాపూరి మామిడి రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలబడిన కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడుకు, మంత్రి అచ్చెన్నాయుడుకు రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు..
*హర్షం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు*
తోతాపూరి మామిడి క్వింటాకు రూ.1,490 ను కేంద్రం ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మామిడి రైతుల నష్టం రాకూడదని ముందుగానే గ్రహించి కేజీ మామిడిని 12 రూపాయలకు కొనుగొలు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ మామిడికి 4 రూపాయల సబ్సిడీ ని అందచేశామని అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందచేసిందని తెలిపారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ మామిడి రైతులను కేంద్రం ఆదుకుంటోందని మంత్రి పెమ్మసాని తెలిపారు.
తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకరించిందన్నారు. పొగాకు, తోతాపురి రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

