కుప్పం - హోసూరు - బెంగళూరుకు నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే పనులను టెండర్లు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం నుంచి తమిళనాడులోని హోసూరు మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు నిర్మించనున్న నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే పనులను ఖరారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి టెండర్లను పిలిచింది. అలాగే కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానిస్తోంది. మార్చి 28 నుంచి బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. జూన్ రెండో తేదీతో బిడ్లు దాఖలు గడువు ముగియనుంది. ఈ టెండర్లను జూన్ మూడో తేదీన ఉదయం 11 గంటలకు బిడ్లు తెరుస్తారు.
మూడు రాష్ట్రాల మీదుగా ఏపీలో కొత్తగా మరో గ్రీన్ఫీల్డ్ హైవే రూపుదిద్దుకోనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఏళ్ల తరబడి స్తబ్దుగా ఉన్న ప్రాజెక్టుల్లో కూడా కదలిక వస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో గ్రీన్ఫీల్ హైవే నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. మూడు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఈ మూడు ప్రాంతాల మధ్య అనుసంధానం పెంచేలా, ప్రయాణ సమయం తగ్గించేలా కుప్పం - హోసూరు- బెంగళూరు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ టాస్క్ఫోర్స్ ద్వారా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించి జాతీయ రహదారుల పనులు పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే వచ్చే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 3,300 కి.మీ మేరకు జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.76 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. మూడు నెలలకు ఓసారి రోడ్ల నిర్మాణంపై సమీక్ష జరపాలని గతంలో నిర్ణయించారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు సంపాదించడంతో పాటుగా నిర్మాణంలో ఉన్న పనులను గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ఈ కుప్పం హోసూరు బెంగళూరు ప్రాజెక్టులో కదలిక వచ్చింది. డీపీఆర్ తయారీలో కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

