ఇక పంచాయతీలకు మహర్దశ
సర్పంచ్ లే రారాజులు
సర్పంచుల ఆధ్యర్యంలో గ్రామ సచివాలయాలు
పూర్తి స్థాయిలో అందనున్న నిధులు
పంచాయితీల్లో అభివృద్ధి పనులకు పచ్చ జండా
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
గ్రామపంచాయతీలకు తిరిగి సర్వాధికారాలు రానున్నాయి. గ్రామ సర్పంచ్ నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగనున్నాయి. గ్రామ సచివాలయాల సిబ్బందిని గ్రామ సర్పంచ్ నియంత్రణకు తేనున్నారు. ఇప్పటివరకు నిధుల కోసం ఎదురుచూసిన సర్పంచ్ లకు ఇక నిధుల ప్రవాహం జరగనుంది. కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకు, సర్పంచ్ లకు మంచి రోజులు రానున్నాయి. ఇందుకు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పయ్యావుల కేశవులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం పద్దు కింద 720 కోట్ల నిధులను విడుదల చేశారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు ఇది శుభవార్త. రానున్న కాలంలో పంచాయతీలను ఆర్థిక పరిపుష్టి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విప్లవాత్మకమైన మార్పులను చేపట్టనున్నారు. రాష్ట్ర అభివృద్ధి పంచాయతిల నుండి ప్రారంభించనున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో పంచాయతీలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. పంచాయతీలకు మంజూరైన 14, 15 ఆర్థిక సంఘం నిధులను వైసీపీ సర్కారు ఇతర అవసరాలకు దారిమళ్లించేది. దీంతో పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల్లా మారాయి. అయితే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పంచాయతీ వ్యవస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తోంది. సచివాలయాలను గ్రామ పంచాయతీలతో అనుసంధానం చేసేలా అడుగులు వేస్తోంది. సర్పంచ్లకే పూర్తి అధికారాలు అప్పగించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. సచివాలయాల నిర్వహణ బాధ్యత పంచాయతీలకు ఉన్నా, అందులో పనిచేసే ఉద్యోగులు వారి పరిధిలో లేకుండా పోయారు. పర్యవేక్షణను రెవెన్యూ శాఖకు అప్పగించింది. గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ మీద సర్పంచుకు పూర్తి అధికారాలు సర్పంచులకు ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. పంచాయతీ సాధారణ నిధులను ఖర్చు చేయడానికి కూడా గత ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది. తమకు హక్కులను పరిరక్షించాలని సర్పంచ్లు పలుమార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, పాలకులు పట్టించుకోలేదు. దీంతో అటు సర్పంచులు కాని ఇటు పంచాయతీ కార్యదర్శులుగాని ఏమీ చేయలేని పరిస్థితి. జగన్ సర్కారు నిధులను ఇవ్వకపోవడంతో పంచాయతీల్లో కనీస వసతులు సమకూర్చడానికి ఇబ్బందులు పడ్డారు. పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనాలను చెల్లించదంలేదు. చిన్నచిన్న మరమ్మతు పనులకు బిల్లులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదాయం ఉన్న పంచాయతీలదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీ వ్యవస్థకు గత వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు చేపడుతున్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ పంచాయతీ రాజ్శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను పంచాయతీలకు అనుసంధానం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సర్పంచ్లకు అధికారం అప్పగించడం ద్వారా గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి తెచ్చేలా అడుగులు వేస్తోంది.