వైద్య ఆరోగ్య శాఖలో అడ్డగోలుగా ఉద్యోగాల నియామకాలు
మెరిట్ ను పక్కన పెట్టి సిఫార్సులకు ప్రాధాన్యత
ప్రొవిజనల్ జాబితా ప్రకటించకుండా నేరుగా ఉద్యోగాలు
రోస్టర్లు, రిజర్వేషన్ లకు పాతర
జూనియర్ డాక్టర్ కు జిల్లా అధికారిగా అందలం
ఉద్యోగాల నియామకాల ఫైళ్ల గల్లంతు
ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో వైసీపీ పాలనలో భారీ ఎత్తున అవినీతి, అవకతవకలు చోటు చేసుకున్నట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగాల నియామకంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, లక్షలాది రూపాయలు చేతులు మారాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అర్హులను పక్కనపెట్టి, అనర్హులను అందలం ఎక్కించారని, ఇందుకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి తెరవెనక చక్రం తిప్పారని ఫిర్యాదులు అందాయి. తమ మనుషులకు ఉద్యోగాలు రావడం కోసం తొలిత జారీ చేసిన నోటిఫికేషన్లను సైతం రద్దుచేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇప్పించారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు సహకరించడానికి అర్హత లేకున్నా జూనియర్ వైద్యుడిని వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమించి, తమకు అనుకూలంగా ఉద్యోగాలను ఇప్పించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల భర్తీలో జరిగిన అవినీతి అవకతవకులపై విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.
వైసిపి పాలనలో చిత్తూరు జిల్లాలో సుమారుగా 300 ఉద్యోగాలను వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. అందులో 200 స్టాఫ్ నర్స్ పోస్టులుగా కాగా, మిగతావి ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్లు కూడా వివాదంగా మారాయి. ఒకటికి రెండుసార్లు నోటిఫికేషన్ రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్లను ఇచ్చి తాము కోరుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం. దరఖాస్తు చేసిన వారిలో సీనియార్టీని పక్కనపెట్టి, సిఫార్సులకు పెద్దపీట వేసినట్లు విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో అప్పటి అధికారులు నిబంధనలను పక్కన పెట్టి, జిల్లాకు చెందిన మాజీ మంత్రికి అనుకూలంగా పనిచేశారని విమర్శలు ఉన్నాయి. జిల్లాకు చెందిన మంత్రి, ఆయన కుమారుడు చెప్పినవారికి ఉద్యోగాలను కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం సుమారుగా 2500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కాంట్రాక్టు పద్ధతులు ఈ ఉద్యోగాలను ఇచ్చారు. వారికి అనుకూలంగా ఉద్యోగాలు ఇవ్వడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్న వ్యక్తిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా, జిల్లా ఆరోగ్య సమన్వయకర్తగా నియమించి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో భర్తీ చేసిన పోస్టులలో ఎక్కువ పుంగనూరు ప్రాంతానికి ఉన్నాయని సమాచారం. కొంతమంది అధికారులు మాజీ మంత్రి సిఫారసుతోపాటు తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చి, ఒక్కొక్కరి నుండి మూడు లక్షల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇదే విధంగా నిబంధనలను, మెరిట్ ను, పక్కనపెట్టి తమకు అనుకూలమైన వ్యక్తులకు ఉద్యోగాలను ఇచ్చారని ఫిర్యాదులు ఉన్నాయి. మాజీ మంత్రి చెప్పినట్లు ఒక వైద్య ఆరోగ్యశాఖ అధికారి చేయడానికి నిరాకరించడంతో, ఆయనను సెలవుల్లో వెళ్ళమని తమకు అనుకూలంగా ఉన్న ఒక వ్యక్తిని ఇన్చార్జిగా నియమించి, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో భారీ ఎత్తున పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదుల అందినా, స్పందించలేదు. అలాగే లోకాయుక్త కూడా ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల మీద దృష్టిని సాధించారు. ఈ విషయాల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉద్యోగ నియమకాల ఫైళ్ళను తమకుఅందజేయాల్సిందిగా కోరారు. అయితే ఇందుకు ప్రస్తుత జిల్లా వైద్య శాఖ అధికారులు సమాధానం ఇస్తూ, ఆ ఫైళ్లు ఏవి తమ వద్ద లేవని, ఉద్యోగాలు ఇచ్చిన అధికారులు ఆ ఫైళ్లను తీసుకెళ్లారని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగాల నియామకంలో ముందుగా ప్రొవిజనల్ జాబితా విడుదల చేయలేదని సమాచారం. అడ్డగోలుగా తమకు నచ్చిన వ్యక్తులకు నచ్చిన విధంగా పోస్టింగులు ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిగితే ఈ వ్యవహారం పలువురి వైద్యాధికారుల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. పలువురు ఈ విషయంలో ఉద్యోగాలను పోగొట్టుకొనే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగిన ఉద్యోగాల భర్తీని రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.