35 శాతం సబ్సిడితో రూ. 25 లక్షల వరకు రుణం 

వ్యక్తులు, స్వయం సహాయక బృందాలకు అవకాశం 

నిరుద్యోగ యువత, చేతివృత్తుల వారికి స్వయం ఉపాదే లక్ష్యం  


 ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


ప్రధానమంత్రి ఉపాధి కల్పన పధకం నిరుద్యోగ యువతకు వరంగా చెప్పవచ్చు. చేతి వృత్తి వారు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పధకంను అమలు చేస్తుంది. ఈ పధకం సద్వినియోగం చేసుకోవడానికి జిల్లా స్థాయిలో శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు 15-35 శాతం సబ్సిడీపై రుణాలు అందిస్తున్నారు. తయారీ, సేవలు లేదా వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధికి ఈ రుణాలు ఇస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకుల నుంచి సబ్సిడీకి రుణాలు అందిస్తారు. ప్రధానమంత్రి రోజ్‌గర్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం  ఈ రెండు పథకాలను కలిపి ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. వ్యవసాయేతర రంగంలోని సూక్ష్మ వ్యాపార సంస్థల ద్వారా నిరుద్యోగ యువత, చేతివృత్తుల వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఈ పథకంలో 15 శాతం నుంచి 35 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లోన్లు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేవీఐసీ డైరెక్టరేట్లు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు, రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డులు, బ్యాంకుల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద కెవిఐసి ప్రభుత్వ రాయితీతోని బ్యాంకుల లబ్దిదారులకు రుణాలు అందిస్తారు.


18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. స్వయం ఉపాధి ప్రాజెక్టులను బట్టి కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రాజెక్టు విలువ తయారీ రంగంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ, బిజినెస్ లేదా సేవా రంగంలో రూ. 5 లక్షలు కంటే ఎక్కువ ఉండాలి. ఈ పథకాన్ని కొత్త ప్రాజెక్టుల మంజూరు కోసం పరిగణిస్తారు. స్వయం సహాయక బృందాలు, సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం-1860 కింద నమోదైన సంస్థలు, ఉత్పత్తి ఆధారిత సహకార సంఘాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌లు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏదైనా ఇతర పథకాల కింద ఇప్పటికే ప్రభుత్వ సబ్సిడీని పొందిన యూనిట్లు అనర్హులు. ఉత్పత్తి రంగంలో ప్రాజెక్ట్ లేదా యూనిట్ గరిష్ట వ్యయం రూ.25 లక్షలు, బిజినెస్ లేదా సేవా రంగంలో గరిష్టంగా రూ.10 లక్షలు వరకు రుణాలు పొందవచ్చు. జనరల్ కేటగిరీ లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల్లో 15 శాతం,  గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం సబ్సిడీ రుణాలు ఇస్తారు. ఇతర కేటగిరీ లబ్ధిదారులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు పట్టణ ప్రాంతాల్లో 25 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 35శాతం సబ్సిడీకి రుణాలు అందిస్తారు. ఈ రుణంకు దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, దరఖాస్తు ఫారం, నివాస ధృవీకరణ పత్రం, 8వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్, ప్రాజెక్ట్ రిపోర్ట్, బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు అవసరమైన అదనపు పత్రాలు, ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ID, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలి.  అర్హత- దరఖాస్తు చేయడానికి ముందు, ప్రభుత్వ పథకాల పోర్టల్ జన్ సమర్థ్ పోర్టల్‌ని ఉపయోగించి మీ అర్హతను ధృవీకరించుకోవాలి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం  లోన్ కోసం మీ అర్హతను అంచనా వేయడానికి వ్యాపారం, విద్యా అర్హతలు వంటి ప్రాథమిక వివరాలను ఇందులో నమోదు చేయాలి.  ప్రాజెక్ట్ ఖర్చు, లోన్ అంచనా వేయండి - మీ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు, దానికి మీరు ఎంత సహాకారం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకొని, ఆ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.25 లక్షలు అయితే, మీరు రూ.10 లక్షలు ఏర్పాటు చేసుకోగలగితే ఆ వివరాలు ముందుగా నమోదు చేయాలి.  ఆన్‌లైన్ దరఖాస్తు చేయడానికి  ప్రభుత్వ పోర్టల్‌ https://www.kviconline.gov.in/pmegpeportal పై క్లిక్ చేయాలి. ఇందులో ఆధార్ వివరాలు,  వ్యక్తిగత, వ్యాపార సమాచారం, స్పాన్సరింగ్ ఏజెన్సీ,  అడ్రస్,  ప్రాథమిక వివరాలు,    వ్యాపారం స్వరూపం,  ఏ రకమైన ఉత్పత్తులను తయారు చేస్తారో లేదా విక్రయిస్తారో వివరాలు,  శిక్షణ,  వ్యాపార ఖర్చులు, బ్యాంక్ వివరాలు నమోదు చేయాల్చిఉంటుంది.  అప్లికేషన్ ఆమోదం, తదుపరి దశలు - మీ దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు సమీపంలోని కెవిఐసి  లేదా మరొక ఏజెన్సీకి ఫార్వార్డ్ చేస్తారు. మీ ఖాతాకు నిధులు పంపిణీ చేయడానికి ముందు మీరు ఈడీపీ శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది.