తెలంగాణ ప్రభుత్వ ప్రకటనపై CM స్పందించాలి: CPM
తెలంగాణ ప్రభుత్వ ప్రకటనపై ముఖ్యమంత్రి స్పందించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరోధిస్తామని, ఎదుర్కొంటామని గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రకటనలపై స్పందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఒకవేళ విశాఖ ఫ్యాక్టరీని కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామని బిడ్డింగుకు పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ వేసి కొంటుందని అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కూడా తాజాగా ప్రకటించారు. తెలంగాణా ప్రభుత్వాన్ని చూసైనా మన రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం శోచనీయం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు అన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా మౌనంగా ఉండటం రాష్ట్ర ప్రజలకు అవమానకరం. ప్రధానమంత్రిని కలిసినపుడు, కేంద్ర ప్రభుత్వానికి మెమొరాండాలు ఇస్తున్నప్పుడూ ఎక్కడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపమని కనీసం ప్రస్తావించలేదు. ఇది ప్రజల్లో, కార్మికుల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమాలను నీరుగార్చడానికి, పరోక్షంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి వైఖరి తోడ్పడుతుంది. స్టీల్ ప్లాంట్కు ముడి సరుకు, వర్కింగ్ క్యాపిటల్, రైల్వే ర్యాక్స్ ఇవ్వకుండా కావాలని ప్లాంట్ను దెబ్బతీయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే కేంద్రప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా స్పందించాలి.
రాష్ట్ర బిజెపి నేతలు ప్రైవేటీకరణను ఆపడానికి డిల్లీిలో తమ పలుకుబడిని ఉపయోగించడానికి బదులు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు. బిజెపి నాయకుల తప్పుడు ప్రకటనలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటికైనా ముందుకొచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అడ్డుకోవటానికి చర్యలు తీసుకోవాలని, అన్ని పార్టీలను కూడగట్టి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢల్లీికి తీసుకెళ్లాలని, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సూచనలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఎదుర్కోవాలని కోరుతున్నాము. అలా చేయకుండా మౌనంగా ఇలాగే ఉంటే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు అయిందని భావించాల్సి ఉంటుంది. అందువల్ల ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భవితవ్యంపై తక్షణం స్పందించి కార్యాచరణ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.