కార్పొరేట్ మాఫియా చేతుల్లో ప్రైవేట్ విద్య
- చితికిపోతున్న మధ్యతరగతి కుటుంబాలు
- ఫీజుల పేరిట దోచుకుంటున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు
- 20నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచేసిన ప్రైవేట్ స్కూళ్లు
- డొనేషన్లు, యూనిఫాం, బుక్స్ పేరిట దండుకుంటున్న యాజమాన్యం
- ఫీజుల నియంత్రణపై సర్కారు సైలెంట్..
- ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపధ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ విద్యా వ్యాపారానికి తెర తెరలేపాయి. విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం మోపుతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు పెంచి దోపిడీకి పాల్పడుతున్నాయి. డబ్బే ధ్యేయంగా విద్యా విలువలను తుంగలోకి తొక్కుతూ తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఏటా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు పెంచుతూ పోవడంతో తల్లిదండ్రుల జేబులు ఖాళీ అవుతున్నాయి. చిత్తూరు జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య, నారాయణ, కేశవ రెడ్డి కార్పోరేట్ పాటశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా వంద వరకు ప్రైవేట్ పాటశాలలు నడుస్తున్నాయి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఫీజులు ఇష్టానుసారంగా పెంచేశాయి. కొన్ని స్కూళ్లు ఏకంగా 20 నుంచి 50 శాతం వరకు పెంచి వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లు ఫస్ట్ టర్మ్ ఫీజులు వసూలు చేయగా, మరికొన్ని స్కూళ్లు ఇంటర్నేషనల్, టెక్నో, ఐఐటీ, నేషనల్ అంటూ చివర్లో తోకపేర్లు తగిలించుకుని ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నాయి. ఏటేటా విద్యా ఖర్చు మోతెక్కిపోతుంది. ఫీజులతోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బుక్స్బ్యాగ్, క్యారేజీ బ్యాగ్, బూట్లు, యూనిఫామ్, బస్సు రవాణాకు చెల్లించాల్సిన సొమ్ము అదనం. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల క్రమబద్ధీకరణకు గతంలో ఓ కమిటీని నియమిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణలోకి తీసుకురాలేదు. సర్కారు బడులు పిల్లల తల్లిదండ్రులను ఆకర్షించకపోవడతో సామాన్యులు సైతం ప్రైవేట్ స్కూళ్లవైపే మొగ్గుచూపుతున్నారు. మారిన సామాజిక పరిస్థితుల్లో అప్పు చేసైనా తమ పిల్లలకు మంచి విద్య అందించాలని తల్లిదండ్రులు తపన పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు భారీగా ఫీజులు పెంచేశాయి. ఒకప్పుడు ఎల్కేజీ, యూకేజీలకు ఏడాదికి రూ. 3 వేలు ఫీజు ఉంటే ప్రస్తుతం 35 వేలకుపైగా గుంజుతున్నారు. టెక్నో, ఇ-టెక్నో, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు కూడా కలిపి ఫీజులు చెబితే కళ్లు తిరగాల్సిందే. ప్రాథమిక విద్యకే సాధారణంగా ఒక్కో విద్యార్థికి ఏటా సుమారు రూ.50 వేలు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఎల్కేజీ ఫీజులే సుమారు రూ. 75 వేల నుంచి రూ. లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఫీజుల నియంత్రణపై స్పష్టత లేకుండా పోయింది. ఎంత వసూలు చేయాలో? లేదో అనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్స్ అసోసియేషన్స్, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
యూనిఫామ్స్, బుక్స్, నోట్ పుస్తకాలకు ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వేస్తున్నారు. ఇవన్నీ తమ వద్దనే కొనాలని హుకూం జారీ చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చాలావరకు కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తున్నారు. వాటిని తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. మరికొన్నిచోట్ల నోటుపుస్తకాలు, యూనిఫాం తమ వద్దనే కొనాలని ఆదేశిస్తూ చివరకు ఫీజుకట్టడం తప్పనిసరి చేస్తున్నాయి.
డీజిల్ ధరలు పెరిగాయంటూ రవాణా ఫీజులను పాఠశాలలు పెంచేశాయి. గతంలో 5 కిలో మీటర్ల పరిధిలో రూ.15 వేలు వసూలు చేయగా ఇప్పుడు ఏకంగా రూ. 20-25 వేలకు పెంచాయి. పాఠశాలలు సొంతంగా నిర్వహించే రవాణాతోపాటు ప్రైవేట్ వాహనదారులు ఫీజులు అధికంగా తీసుకుంటున్నారు. పిల్లల ఫీజులకు తోడు రవాణా ఫీజుల భారంతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ప్రతీఏడాది ఫీజులు పెంచుతున్నాయి. దీంతో తమ పిల్లలను బాగా చదివించాలన్న తల్లిదండ్రులకు ఫీజుల చెల్లింపుల్లో తిప్పలు తప్పడం లేదు. ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జీవో నెంబర్-1, సెక్షన్ 11 ప్రకారం ప్రభుత్వం గవర్నింగ్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నిర్ణయించిన ఫీజులు వసూలు చేయాలి. కానీ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు మళ్లీ 20-40 శాతం ఫీజులు పెంచడంతో మోయలేని భారం పడింది. ఇద్దరు పిల్లలను చదివించేందుకు రూ.లక్ష పైన ఖర్చు అవుతుంది. ఏడు, ఎనిమిదో తరగతికి ఇంత ఫీజు ఉంటే.. పదో తరగతి వరకు చదివిస్తామో లేదో అన్న అనుమానం తల్లితండ్రులలో కలుగుతోంది. ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించక పోవడంతో ఇస్టా రాజ్యంగా మారింది. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతీ యేడాది ఫీజులు పెంచుతున్నాయి. అయితే ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉంటుందని, ఇంగ్లీష్ బాగా రావాలని, మా పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు. ఈ క్రమంలో ప్రతీ యేటా ఫీజులు పెంచుతున్నారు. ఫీజుల మోతను తల్లితండ్రులు భరించలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయమై స్పందించాల్చిన అవసరం ఉంది.