చిత్తూరులోవిజయం సాధించేది ఎవరు?
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఎవరు విజయం సాధిస్తారన్న విషయం మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు ఇరువురూ విజయం కోసం సర్వశక్తులు వడ్డి ప్రచారం చేశారు. అన్నింటిలోనూ ఒకరికి ఒకరు తీసిపోకుండా తమ సత్తా చాటారు. జిల్లా కేంద్రంలో విజయం సాధించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఇద్దరు నాయకులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎక్కని గడపలేదు. కలవని ఓటరు లేదు. సహాయాన్ని అర్ధించని నేత లేదు. ఇరువురు నాయకులు చావో, రేవో తేల్చుకోవాలి అన్నంతగా ఎన్నికల బరిలో తమ బలగాలను మోహరించారు. విజయమే పరమావధిగా అహర్నిశలు కృషి చేశారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. పోలింగ్ రోజు కూడా ఆవిశ్రాంతంగా శ్రమించారు. ఎదుటివారు ఎక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్లారు. ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు. పోలింగ్ నాడు ఎక్కడా అక్రమాలు జరగకుండా కాపుకాచారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులతో, నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎక్కడా బూతుల ఆక్రమణ, రిగ్గింగ్ జరక్కుండా అడ్డుపడ్డారు. ప్రత్యర్థులను నీడలా వెంటాడారు. ఎలాగైనా విజయం సాధించాలన్న తపనతో ఇరు పార్టీలనేతలు తమ శక్తి యుక్తులను ప్రదర్శించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది పర్యాయాలు చిత్తూరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు పర్యాయాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. నాలుగు పర్యాయాలు కాంగ్రెస్, పార్టీ ఒక పర్యాయం ఇండిపెండెంట్, మరొక పర్యాయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి నుండి చిత్తూరు నియోజకవర్గ ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ పి ఝాన్సీ లక్ష్మి విజయం సాధించారు. తర్వాత 1985లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్ గోపీనాథన్ గెలుపొందారు. 1989, 1994, 1999 ఎన్నికలలో వరుసగా సీకే బాబు సాధించి, హ్యాట్రిక్ కొట్టారు. ఇందులో 1989లో ఆయన ఇండిపెండెంట్ గా విజయం సాధించినా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగాని కొనసాగారు. 2004 ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఏఎస్ మనోహర్ విజయం సాధించగా, 2009 ఎన్నికలలో తిరిగి సీకే బాబు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా డీకే సత్య ప్రభ విజయం సాధించగా, 2019 ఎన్నికలలో జంగాలపల్లి శ్రీనివాసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికలకు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టిడిపిలో చేరారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీకే బాబు ప్రస్తుతం టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ విజయానికి చేశారు. అలాగే ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, మరోసారి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఎస్ మనోహర్ కూడా వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలో చేరి, టిడిపి విజయానికి ప్రచారం చేశారు. వైసిపి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు ఆ పార్టీ వీడి జనసేనలో చేరారు. తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికలలో మూడుసార్లు మాత్రమే గెలుపొందిన టిడిపి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావించింది. గుడిపాల మండలానికి చెందిన బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ నాయుడును తెరమీదకి తీసుకుని వచ్చి, తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన పాత, కొత్త నాయకులను కలుపుకొని చిత్తూరుపై పట్టు సాధించాలని గట్టి పట్టుదలతో జగన్మోహన్ నాయుడు కృషి చేశారు. జగన్మోహన్ నాయుడుకు అండగా మాజీ ఎమ్మెల్యేలు సికె బాబు, ఏ ఎస్ మనోహర్, మాజీ ఎం ఎల్ సి దొరబాబు, తొలుత టిడిపి టిక్కెట్టు ఆశించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూరు బాలాజీ, మాజీ మేయర్ కటారి హేమలత, ప్రస్తుత టిడిపి జిల్లా అధ్యక్షుడు సి ఆర్ రాజన్ తదితరులు నిలచారు. తామే అభ్యర్థి అన్నట్లు అందరూ కృషి చేశారు. చివరిలో పార్టీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన జంగాలపల్లి శ్రీనివాసులకు చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ వైసిపి అధిష్టానం నిరాకరించింది. ఆయనను రాజ్యసభకు పంపుతామని చెప్పిన మాట నిలుపుకోలేదు. చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఆర్టీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న విజయానంద రెడ్డిని ప్రకటించింది. దీంతో అలక చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరి, తిరుపతి అభ్యర్థిగా పోటీ చేశారు. చిత్తూరు నియోజకవర్గంలో మొదటినుంచి విజయానంద రెడ్డి రాజకీయంగా పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు నుంచే వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులకు పన్ను చెల్లించకుండా మొత్తం తానే చెల్లించారు. అలాగే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ఫీజులు కూడా ఆయన చెల్లిస్తున్నారు. చిత్తూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి మరమతులకు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 53,000 కుటుంబాలకు మహిళలకు చీర, జాకెట్లు, పురుషులకు ప్యాంట్, షర్టులను అందజేశారు. అలాగే ఇతర ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే చిత్తూరులో వైసీపీకి చెందిన కొందరు నేతలు అంటి ముట్టనట్లు ఉండడం వైసీపీకి కొంత నష్టం కలగజేయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులు దానధర్మాలలో ముందున్నారు. రంజన్ తోఫా, సంక్రాంతికి నిత్యవసర వస్తువులు, తోపుడు బండ్లను ఉచితంగా అందజేయడం, దీపావళికి టపాకాయలు పంచడం, రంజాన్, బక్రీద్ వంటి కార్యక్రమాలకు ముస్లింలు ఆర్థిక సహాయం చేయడం, క్రిస్మస్ రోజున క్రైస్తవులకు ఆదుకోవడం వంటి కార్యక్రమాలలో కూడా పోటీ పడుతున్నారు. ఇరువురు నేతలు డబ్బును మంచినీళ్లు లాగా ఖర్చు చేస్తూ ఎన్నికలలో విజయం సాధించడానికి గట్టిగా కృషి చేశారు. హోరాహోరీగా జరిగిన ఎన్నికల ప్రచారంలో మొదటిసారిగా ఎవరు విజయం సాధించి, అసెంబ్లీలో అడుగు పెడుతారో తేలాలి అంటే వారం రోజులు ఆగాల్చిందే.