భారీ ప్రదర్శనతో పిడిఎఫ్ అభ్యర్థుల నామినేషన్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjwyrPA9KiGYygqQGeDAkRIRNC-CaSQPRaDeveit3VapXCwU3mdan3Fyzmys98K5kky9uobLhy0boVwNVDHzSVYzYct3CBzF1rMvGgMxPrbXSqgWQ-X1ZJrX8iLsWTeWUNmmPwHDv4ccEIzgc_sUpXmVzpmtbqsKfRTWF7vUPPyuGSKrYVuTWZRCiOP/s320/2023-02-22%20at%204.33.11%20PM.jpeg)
పిడిఎఫ్ అభ్యర్థుల నామినేషన్ చిత్తూరులో వేలాది మందితో భారీ ప్రదర్శన...
ఉపాధ్యాయ, ప్రజాసంఘాల మద్దతు
మార్చి నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది బుధవారం నాడు చిత్తూరు నగరంలో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీగడ వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి. బాబు రెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలకు ముందు కట్టమంచి నుంచి వేలాదిమంది ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం నాగయ్య కళాక్షేత్రంలో సభ జరిగింది. ఈ సభను ఉద్దేశించి పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, లక్ష్మణరావులు ప్రసంగించారు. గత మూడు ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు అభినందనలు తెలియజేస్తూ, నాలుగో విడత సైతం పిడిఎఫ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అప్రజాస్వామికంగా సాగుతుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా తయారైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. మురళి, రైతు సంఘం రాష్ట్ర నేత ఏ. రామానాయుడు, ఎస్ టి యు, యుటిఎఫ్ సంఘాల నేతలు ప్రసంగించారు. పిడిఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సభానంతరం చిత్తూరు కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి హరి నారాయణ్ కు నామినేషన్ పత్రాలను సమర్పించారు. చిత్తూరు నగరంలో వేలాది మంది ఉద్యోగులతో భారీ ప్రదర్శన నిర్వహించటం చర్చనీయాంశమైంది.