25, డిసెంబర్ 2024, బుధవారం

బీసీ నాయకులలో చిగురిస్తున్న నామినేటెడ్ ఆశలు

నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు 

ఈ మేరకు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఆశగా ఎదురు చూస్తున్న కూటమి నేతలు

సంక్రాంతిలోపు భారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసే అవకాశం.


(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)


నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రెండు రోజుల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో జిల్లాలని బీసీ నాయకులలో ఆశలు చిగురిస్తున్నాయి. సంక్రాంతికి ముందుగానే రాష్ట్రస్థాయిలో భారీ ఎత్తున నామినేటెడ్ పోస్టులు భర్తీ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో నామినేటెడ్ పోస్టులపైన జిల్లాలోని బడుగు బలహీన వర్గాలు ప్రత్యేకమైన ఆశలను పెట్టుకుంటున్నారు. తమకు భారీగా అవకాశాలు ఉంటాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశంతో పాటు బిజెపి, జనసేన పార్టీలలోని వెనుకబడిన తరగతుల నాయకులకు కూడా ఆశాభవంతో ఎదురుచూస్తున్నారు.


రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్‌ పదవుల బహుమతి లభించనుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. సహకార సంస్థలు, మార్కెట్‌ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ వందలాది పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కనున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉండగా చిత్తూరు జిల్లాలో 76 సహకార సొసైటీలో ఉన్నాయి. వీటిలో ఒక్కోదానికి చైర్మన్‌తో పాటు, ఇద్దరు సభ్యులను నామినేట్‌ చేయడం ద్వారా జిల్లాలో 228 మందికి అవకాశం లభించనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సామాజిక న్యాయం పాటించాలని సర్కారు సూచించింది.  ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించారు. సంక్రాంతి నాటికి ఈ పదవులను కూడా భర్తీ చేయాలన్న యోచనలో ఉన్నారు. రెండోదశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్‌ సంస్థలకు కూడా ముగ్గురు సభ్యుల పాలక వర్గాలను నియమించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు చేసి నామినేట్‌ చేస్తారు. జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీచేసే యోచనలో ప్రభుత్వం ఉంది. వందల సంఖ్యలో మత్స్యకార సొసైటీలకు కూడా నామినేటెడ్‌ పాలక వర్గాలు నియమించే కసరత్తును సహకార శాఖ చేపట్టింది. గొర్రెల పెంపకందారుల సొసైటీల పాలక వర్గాల నియామకంపైనా ప్రతిపాదనలు స్వీకరిస్తున్నారు.  వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలక వర్గాల నియామక కసరత్తు ప్రభుత్వ స్థాయిలో జరుగుతోంది. వీటికి ఎన్నికలు ఉండవు.  రెండేళ్ల కాల పరిమితితో నామినేటెడ్‌ పాలక వర్గాలను నియమిస్తారు. రాష్ట్రంలో 222 మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 10 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ మార్కెట్ కమిటీలు చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, బంగారుపాలెం, నగిరి, సోమల, కుప్పం, పెనుమూరు రొంబిచర్ల, ఎస్ఆర్ పురం లలో ఉన్నాయి. ఒక్కో కమిటీలో చైైర్మన్‌తో కలిపి 15 మంది సభ్యులను నియమిస్తారు. ఈ కమిటీల చైర్మన్‌ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రొటేషన్‌లో భాగంగా రెండేళ్ల తర్వాత ఇప్పుడు రిజర్వేషన్‌లో ఉన్న చైర్మన్‌ పదవులు జనరల్‌ అవుతాయి. ఇప్పుడు జనరల్‌లో ఉన్నవి రిజర్వేషన్‌లోకి వస్తాయి. జిల్లాలో కాణిపాకం, బోయకొండ దేవస్థానంలో పాలక మండలితో పాటు చాలా ఆలయాలకు పాలకమండళ్లను నియమించాల్సిన అవసరం ఉంది. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం కూడా పలువురు ఆశగా ఎదురుచూస్తున్నారు. నియోజకవర్గస్థాయి అసైన్మెంట్ కమిటీలు, మండల, డివిజన్, జిల్లాస్థాయి ఆహార సలహా కమిటీలను నియమించాల్సి ఉంది. వీటితోపాటు ఇంకా పలు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం చేపట్టలేదు. ఇంకా కొన్ని కార్పొరేషన్ చైర్మన్ లను కూడా భర్తీ చేయాల్సి ఉంది. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ను నియమించినా, ఇంతవరకు పాలకమండలి సభ్యులను నియమించలేదు. గత ఎన్నికలలో చిత్తూరు జిల్లా నుంచి ఒక బీసీ నేతలకు కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. పలువురు నాయకులు టిక్కెలను ఆశించారు. కావున నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆ వర్గ నాయకులు అభిప్రాయపడుతున్నారు. నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు భారీ ఎత్తున నామినేటెడ్ పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *