విలపిస్తూ గజరాజుల ... కడసారి కన్నీటి వీడ్కోలు
విలపిస్తూ గజరాజుల ... కడసారి కన్నీటి వీడ్కోలు
మనుషులు ప్రాణాలు కోల్పోతే వారి బంధువులు, సన్నిహితులు ఎంత విలపిస్తారో.. జంతువులు కూడా అంతకు మించి విలపిస్తాయి. పలమనేరులో సంచరిస్తున్న ఏనుగుల మందనే ఇందుకు నిదర్శనం. చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదంలో మూడు రోజుల కిందట ప్రమాదంలో 3 ఏనుగులు మృతి చెందాయి. వాటి మృతదేహాలను అటవీ అధికారులు, స్థానికులు ఖననం చేశారు. అయితే, తమ మందలోని కొన్ని ఏనుగులు ప్రాణాలు కోల్పోవడంతో.. మిగతా ఏనుగులు అక్కడికి చేరుకొని విలపించాయి. వాటిని ఖననం చేసిన ప్రాంతంలోనే ఏనుగుల మంద కడసారిగా, కన్నీటితో వీడ్కోలు పలికాయి. వాటితో గడిపిన తీపి గుర్తులు మననం చేసుకున్నాయి. అనుబంధాన్ని నెమరువేసుకున్నాయి. మిత్రులను ఖననం చేసిన చోట మూగగా రోదించాయి. సద్గతులు లభించాలని ప్రార్ధనలు చేశాయి. స్నేహితులను విడిచి వెళ్ళలేక అక్కడే కాలక్షేపం చేశాయి.
హైవే పక్కన వీటిని పూడ్చిపెట్టిన చోటకు సోమవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు వచ్చింది. కాసేపటి వరకు అక్కడే తిష్టవేశాయి. ఏనుగుల మందను గమనించిన స్థానికులు హడలిపోయారు. తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది.. స్థానికుల సాయంతో ఏనుగుల గుంపును జగమర్ల అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా డ్రైవ్ చేశారు. కాగా, రోడ్డు పక్కనే చనిపోయిన ఏనుగులను ఖననం చేయడం.. మిగతా ఏనుగులు అక్కడికి రావడంతో హైవేపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు హడలిపోతున్నారు.