1, ఫిబ్రవరి 2025, శనివారం

జిల్లాలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ల విలువలు



శనివారం నుండి అమల్లోకి వచ్చిన పెంపు 

అభివృద్ధి ప్రతిపాదికన 10 నుంచి 20 శాతం పెంపు 

భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.) 

జిల్లాలో  భూముల రిజిస్ట్రేషన్ల కొత్త మార్కెట్ విలువలు పెరిగాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10 శాతం  నుంచి 20 శాతం  ఇవి పెరిగాయి. పెరిగిన కొత్త మార్కెట్ విలువలు శనివారం నుండి అమలులోకి వచ్చాయి. భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు కూడా  అమల్లోకి వచ్చింది. ఈ ప్రకారం జిల్లాలోని 8 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ విలువ పెంపు  కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం.. కొత్త మార్కెట్ విలువల అమలు చేయడానికి  రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ శుక్రవారం రాత్రి కసరత్తు పూర్తి చేసింది. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6 శాతం వరకు పెంచారు. పెంకుటింటికి చదరపు అడుగుకు 740, రేకుల షెడ్లుకు 580,  ఇతరాలకు  420 వసూలు చేస్తున్నారు.  గ్రౌండ్ ఫ్లోర్ కు రూ.1,490,  మొదటి ఫ్లోర్ కు రూ. 1,270, రెండవ ఫ్లోర్ కు  రూ.900 వసూలు చేస్తున్నారు. ఇప్పటికే భూముల విలువలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం వరకు, విలువ తక్కువగా వున్న ప్రాంతాల్లో 20 శాతం వరకు పెరగాయి. పుంగనూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 80 రెవెన్యూ గ్రామాలుండగా, నాలుగేళ్లుగా భూముల విలువ పెరగని 65 గ్రామాల్లో 20 శాతం, మిగిలిన 15 గ్రామాల్లో 15 శాతం పెంచారు. పలమనేరు కార్యాలయ పరిధిలో 87, బంగారుపాళ్యం పరిధిలో 46, నగరి పరిధిలో 42 రెవెన్యూ గ్రామాలుండగా అన్ని చోట్లా 15నుంచి 20 శాతం విలువలు పెరిగాయి. చిత్తూరు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో 10- 20 శాతం మధ్యలో పెంచారు. వ్యవసాయ భూముల విలువ సగటున 15 శాతం, ఇంటి స్థలాల ధరలను  10 శాతం పెంచారు. చాలా కాలంగా పెంచని ప్రాంతాల విలువల్ని మాత్రమే 20 శాతం వరకు పెంచారు. జాతీయ రహదారుల పక్కనున్న భూములకు ఎకరా రూ.7.20 లక్షల నుంచి రూ.8.28 లక్షలకు అంటే 15 శాతం విలువ పెరిగింది. యాదమరి మండల కేంద్రంలో ఎకరా రూ.4.60 లక్షల నుంచి రూ.5.20 లక్షలకు, చిత్తూరు రూరల్‌ మండలం దిగువమాసాపల్లెలో ఎకరా రూ.3.33 లక్షల నుండి రూ.3.83 లక్షలకు పెంచారు.  ఇక్కడ కూడా 15 శాతం పెంచారు. చదరపు గజం, చదరపు అడుగుల్లో కొలిచే ఇంటి స్థలాలకు ఇప్పటికే ఎక్కువగా విలువ ఉన్నకారణంగా 10 శాతం పెంచారు. చిత్తూరు ప్రకాశం రోడ్డులో చదరపు గజం ధర రూ.46,950 ఉండగా, 10 శాతం అంటే రూ.51,645కు పెంచారు. నాయుడు బిల్డింగ్స్‌లో చదరపు ధర రూ.16260 ఉండగా10 శాతం పెంచి రూ.17900 చేశారు. కుప్పం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో అత్యధికంగా 221 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఈ కార్యాలయం పరిధిలో విలువ పెంపుదల విషయంలో కాస్త వెసులుబాటు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నియోజకవర్గం కావడం, ఇప్పటికే కొన్ని పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కావడం, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉండడం వంటి కారణాలతో ఇక్కడ పెద్దగా భూముల విలువలను పెంచలేదు. గత వైసీపీ ప్రభుత్వం నాలుగుసార్లు భూముల విలువను పెంచింది. 2020 ఆగస్టులో, 2022 ఫిబ్రవరిలో, ఏప్రిల్‌లో భూముల ధరలను పెంచగా, 2024 జూన్‌ 1 నుంచి కూడా పెంచుతున్నట్లు ఆదేశాలిచ్చింది. 2021లో కరోనా కారణంగా పెంపు జోలికి పోలేదు. మిగిలిన ప్రతిసారీ 10 నుంచి 40 శాతం వరకు పెంచింది. వైసీపీ ఇష్టానుసారంగా భూముల ధరల్ని పెంచేయడంతో క్రయవిక్రయదారులపై పెను భారం పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం 10 నుండి 20 శాతం మధ్యలో పెంపుదలను పరిమితం చేసింది. ఈ మేరకు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల వారీగా పెరిగిన వివరాలను జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయంలో శుక్రవారం  అన్‌లైన్‌ పూర్తిచేశారు. శనివారం నుండి చిత్తూరు, చిత్తూరు రూరల్,  పుంగనూరు, బంగారుపాళ్యం, పలమనేరు, కుప్పం, పుంగనూరు రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

పో రై గంగ 1 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *