జగనన్న ఇళ్ల పట్టాలపై కూటమి ప్రభుత్వం దృష్టి
అనర్హుల గుర్తింపునకు చర్యలు ప్రారంభం
ఇంటి స్థలం అమ్మినా, కొన్నా రద్దు
ఫిర్యాదులపై కూటమి ప్రభుత్వం నిర్ణయం
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
గత ప్రభుత్వం అనర్హులకు భారీగా ఇళ్ల పట్టాలను మంజూరు చేసిందన్న ఫిర్యాదుల మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కోన్నా ఆ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకావాలని సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించిన ఇళ్ల స్థలాల వ్యవహారంపై సర్కారు ఫోకస్ పెట్టింది. అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అనర్హులు అని తేలితే వారి ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. 15 రోజుల్లోనే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించింది.
అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు గత ప్రభుత్వాల నిర్ణయాల్ని తిరిగి తోడటం సహజం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అంటే పీకల దాకా కోపంగా ఉండే టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు గతాన్ని తవ్వే పనిలో పడ్డాయి. వైసీపీ పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారి పేర్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ పరిశీలిస్తోంది. ఎందుకు అంటే.. అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారు అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్న మాట. అనర్హులను గుర్తించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలుఇచ్చారు. ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ టైమ్ ఇవ్వలేదు. 15 రోజుల్లో ఈ పని పూర్తవ్వాలని ఆదేశించింది. అంటే బాధితులు కొంత టైమ్ ఇవ్వాలి అని అడిగే అవకాశం కూడా లేదు. ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి చూపాల్సిన అర్హత పత్రాలు, ఐడీలు, ధృవీకరణ పత్రాలను కలెక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. లేదంటే ఇళ్ల పట్టాలు రద్దవుతాయి. లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకుముందే ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఇన్కం టాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్టా రద్దు చేస్తారు. కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఇళ్ల స్థలం రద్దు చేస్తారు. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పట్టాలు ఉంటే, ఒకరికి మాత్రమే ఉంచి, మిగతా వారికి రద్దు చేస్తారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మితే, వారికీ రద్దు చేస్తారు. అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. ఈ మేరకు ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ప్రభుత్వం రెడీ చేసింది. దీని ఆధారంగా అధికారులు లబ్ధిదారులను పరిశీలించనున్నారు. లబ్దిదారులు ఇచ్చే వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేసి, ఆ తర్వాత పట్టాలు రద్దు చేసి నోటీసులు అందజేయనున్నారు. వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ల పట్టాలు పొందారని, కొన్ని ఇళ్లల్లో ఇద్దరు లేదా ముగ్గురికి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నాయని పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దీంతో అనర్హులను గుర్తించి, వారికీ ఇళ్ళ పట్టాలను రద్దు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ తరుణంలోనే ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాలి. అందుకు సంబంధించి అర్హత పత్రాలు, ఐడీలు, ధృవీకరణ పత్రాలను విచారణ అధికారులకు చూపించాలని అధికారులు చెబుతున్నారు. లేకుంటే ఇళ్ల పట్టాలు రద్దవుతాయని హెచ్చరిస్తున్నారు.