నేటి నుండి జిల్లాలో వైన్ షాపులు బంద్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు శనివారం నుండి మూతపడనున్నాయి. ఏరే మేరకు వైన్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వైన్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ప్రభుత్వం వీరి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కావున తమ డిమాండ్ల సాధనకు సమ్మెలో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వైన్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేశారని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే.. 15 వేల మంది కాంట్రాక్ట్, ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడతారని వాపోతున్నారు. తమ విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే శనివారం నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయానికొచ్చారు. అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని ప్రకటించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతికి పాల్పడిందని.. ఈసారి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా.. కొత్త మద్యం పాలసీలో మార్పులు, చేర్పులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.
మద్యం రేట్లు తగ్గే ఛాన్స్..
మద్యం రేట్లను కూడా భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం నిషేధం పేరుతో.. ధరలను విపరీతంగా పేంచేసి, నకిలీ బ్రాండ్లను దించేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మద్యం ప్రియుల జేబులు గుల్ల కావడమే కాకుండా.. ఆరోగ్యమూ చెడిపోయింది. దీంతో కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను 80 నుంచి 90 రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.