4, జూన్ 2024, మంగళవారం

21రోజుల ఉత్కంటకు తెర


నేడే ఓట్ల లెక్కింపు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు 

ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. 21రోజుల సస్పెన్సుకు తెర పడనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం  వెలవడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.  జూన్‌ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌, 8.30 నుంచి ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా పోలైన నేపథ్యంలో ఫలితాలకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు, ప్రజలకు మధ్యాహ్నానికి జిల్లాలో ఎవరు గెలుస్తారు అనే విషయం మీద  ఓక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేసి, తొందరగా ఫలితాలను వెల్లడించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎక్కడా, ఏ విధమైన పోరబాట్లకు ఆస్కారం లేకుండా జాగర్తలు తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారులు లెక్కింపు కేంద్రంలోనే ఉండనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించడానికి, ఇ వి ఎం లోని ఓట్లను లెక్కించడానికి వేరు వేరుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికార ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించింది. ఇందుకు తోడు ఎన్నికలలో పోటి చేసిన అభ్యర్థులు, వారి తరపున ఏజెంట్లు డేగ కన్నులతో లెక్కింపు ప్రకియను పరిశిలిమ్చానున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద కానీ, జిల్లాలో కానీ ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పోలీస్ 30 యాక్టు, 144  సెక్షన్ అమలులో ఉంది. ఎక్కడా జనం గుమికూడకుండా జాగర్తలు తీసుకుంటున్నారు. అల్లర్లు సృస్తిస్తారనే అనుమానం ఉన్న వారిని ముందుగానే బైండ్ ఓవర్ చేసుకున్నారు. ముఖ్య కూడళ్ళలో పోలీస్ పికెట్లు ఏర్పాట్లు చేశారు. మొబైల్ వాహనాల ద్వార పహారా కాస్తున్నారు. ముందు జాగర్త చర్యగా జిల్లాలో మద్యం దుకాణాలను మూసేశారు. జిల్లాలో పోటి ముఖ్యంగా తెలుగుదేశం, వైసిపి ల మధ్య ఉంది. జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటి చేసినా, వారి ప్రభావం నామమాత్రంగా తెలుస్తుంది. పుంగనూరు నుండి పోటి చేస్తున్న బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదన్ ప్రభావం కూడా పెద్దగా ఉండదని సమాచారం. పోటి టిడిపి, వైసిపి మధ్య ఉండటంతో పోటి అభ్యర్థులు విజయం కలుగాలని మొక్కని మొక్కులు లేవు. దర్శించని ఆలయం లేదు. అందరు అభ్యర్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమకు విజయం ప్రసాదించమని కోరుకున్నారు. అభ్యర్థుల తరపున స్థానిక నేతలు కూడా దేవుళ్ళకు మొక్కులు మొక్కుకున్నారు. సోమవారం చిత్తూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో చిత్తూరు మాజీ ఎం ఎల్ ఏ ఏ ఎస్ మనోహర్ ఆధ్యర్యంలో టిడిపి గెలువాలని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.  

 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా 82.65 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే 17,885 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. అధికారులు ముందుగా సైన్యానికి సంబంధించిన సర్వీసు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. సర్వీస్, పోస్టల్.. ఈ రెండు రకాల ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు చేరతాయి. ఉదయం 8 గంటలకు కౌటింగ్ వీటితోనే ప్రారంభం అవుతుంది. వీటి లెక్కింపు పూర్తవగానే తొలి రౌండ్‌ ఫలితం వెల్లడిస్తారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తవగానే.. నిఘా నీడలో ఉన్న స్ట్రాంగ్‌ రూముల తాళాల తీసి అక్కడి నుంచి ఈవీఎంలను కౌంటింగ్ జరిగే హాలులోకి తీసుకొస్తారు. అక్కడ నుంచి ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్‌ మొదలవుతుంది. ఉదయం 8.50 వరకు తొలి రౌండ్‌ ఫలితం వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉండటం వల్ల ఈ రౌండ్ ఫలితానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రతి 20 నిమిషాలకు ఒక్కో రౌండ్ చొప్పున క్రమంగా ఫలితాలను వెల్లడిస్తారు.
కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలను ఈ టేబుళ్లపై వరుసగా ఉంచుతారు. అన్ని టేబుళ్ల వద్ద ఫలితాలు వచ్చాక వాటి మొత్తాన్ని తీసుకుని ఆ రౌండ్‌ ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. వాటన్నింటినీ తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన తర్వాత రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.నియోజకవర్గాల వారీగా ఆయా ఓట్ల వివరాలను మైక్రో అబ్జర్వర్లు, పరిశీలన అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు ధ్రువీకరించుకొని ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారం అందిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్‌కు కౌంటింగ్ కేంద్రంలోకి అవకాశం ఇస్తారు. పోటీ చేసే అభ్యర్థి అభ్యర్థన మేరకు కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకానికి రిటర్నింగ్‌ అధికారి అనుమతిస్తారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది మినహా మిగతా వారెవరూ కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. టేబుళ్ల వెనకవైపు ఇనుప ఫెన్సింగ్ బిగిస్తారు. టేబుల్ ఎదురుగా ఫెన్సింగ్ అవతల వేర్వేరు పార్టీల కౌంటింగ్‌ ఏజెంట్లు కూర్చొని బయట నుంచి ఫలితాలను గమనిస్తుంటారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటనలు జరిగినా.. అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకుంటారు. మొత్తం ఎన్ని ఓట్లకుగాను, ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలను కౌంటింగ్ సిబ్బంది నమోదు చేస్తారు. చివర్లో అభ్యర్థుల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో వెల్లడిస్తారు. మైక్రో అబ్జర్వర్‌, ఆర్వో, పరిశీలకుడు నిర్ధరించుకున్నాక ఆ రౌండ్‌ ఫలితాన్ని ప్రకటిస్తారు. నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే ముందు సంబంధిత నియోజకవర్గంలోని ఏదైనా ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్‌ను ఎంచుకొని అందులోని స్లిప్‌లను లెక్కిస్తారు. వీవీప్యాట్‌ ద్వారా వచ్చిన స్లిప్‌లు, ఈవీఎంలో పడిన ఓట్లు సరిపోలాయా లేదా నిర్ధారించుకుంటారు. వీవీప్యాట్‌ బాక్సులోని స్లిప్‌లను గుర్తుల ఆధారంగా వేరు చేస్తారు. చివర్లో ఒక్కో గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కిస్తారు. ఈ లెక్కలు ఈవీఎం ఫలితాలతో సరిపోలిన తర్వాతే చివరి రౌండ్‌ ఫలితాన్ని ఆర్వో ప్రకటిస్తారు. తుది ఫలితాల ప్రకటనకు పట్టే సమయం సంబంధిత నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *