మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హై కోర్టు నోటిసులు
తమ్ముడు స్వరకనాధ రెడ్డికి కూడా
మరో 10 మంది అనుచలకు నోటిసులు
మాజీ జడ్జి రామకృష్ణ హై కోర్టులో రిట్ పిటిషన్
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
ప్రభుత్వం మారగానే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి కష్టాలు ప్రారంభం అయ్యాయి. రెండు రోజుల కిందట సొంత నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పర్యటించడానికి ప్రయత్నం చేశారు. పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పెద్దిరెడ్డి తిరుపతి నుండి బయలుదేరి వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ విషయం మరువక ముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 12మందకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి ఎస్.రామకృష్ణ హైకోర్టులో పెద్దిరెడ్డి మీద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టిన తనకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. ఈ రిట్ పిటిషన్ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా.. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డితో సహా 12 మందికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. వైసిపి పాలనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన సోదరులు తమ అనుచరుల ద్వారా తన వేధించారని రామకృష్ణ పేర్కొన్నారు. బి కొత్తకోటలోని తన ఇంటిపై దాడి చేశారని గత నెల 27న పోర్జరీ సంతకాలతో తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసినా, విచారణ కూడా చేయకుండా పోలీసులు తన మీద కేసును నమోదు చేశారన్నారు. రాజకీయంగా వత్తిళ్ళు తెచ్చి తనపైన కేసు పెట్టారని ఆరోపించారు. తనమీద తప్పుడు కేసు పెట్టారని స్థానిక సీఐతో పాటు అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోలేదన్నారు, గతంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించిన రామకృష్ణ.. తన ప్రాణాలకు ముప్పు ఉందని, అత్యవసర పిటిషన్ కింద స్వీకరించాలని హైకోర్టును కోరారు. హైకోర్టు తన రిట్ పిటిషన్ను పరిశీలించి పెద్దిరెడ్డి సోదరులకు నోటీసలు జారీ చేసింది. ఈ రిట్ పిటిషన్పై విచారణ చేసి నివేదికను అందజేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు నోటీసుల అంశంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంత వరకు స్పందించలేదు.