8, నవంబర్ 2025, శనివారం

చిత్తూరు ఏనుగు బాధిత రైతులకు కొత్త ఆశాకిరణం

ముసలిమడుగులో కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రం
శిక్షణ పొందుతున్న కుంకి ఏనుగులు 
పర్యాటక కేంద్రంగా అవతరించనున్న ముసలిమడుగు
నేడే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

ఏనుగుల బీభత్సంతో ఇన్నేళ్లుగా అల్లాడుతున్న చిత్తూరు జిల్లా ఏనుగు భాదిత రైతులకు ఇప్పుడు ఆశాజనక పరిణామం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో కర్ణాటక నుండి తరలించిన కుంకి ఏనుగులు ప్రస్తుతం పలమనేరు మండలం ముసలిమడుగులో శిక్షణ పొందుతూ, జిల్లాలో అడవి ఏనుగుల సమస్యను నియంత్రించే దిశగా పెద్ద భరోసా కలిగిస్తున్నాయి. పంటలను నాశనం చేసే ఏనుగులను సులభంగా తరలించడం ద్వారా పంట రక్షణకు ఉపశమనం లభిస్తోంది. ఇక ఈ కేంద్రాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది.

చిత్తూరు జిల్లా పశ్చిమ అటవీ మండలాల్లో ఏనుగుల దాడులు ప్రజల జీవితాల్లో భయాన్ని నింపాయి. ముఖ్యంగా కౌండిన్య అటవీ సరిహద్దులో ఉన్న పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి, ఐరాల, సదం, సోమల, చౌడేపల్లె పరిసర గ్రామాలు ఏనుగుల తరచు దాడులతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటవీ శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం జిల్లాలో సుమారు 90 నుండి 110 వరకు వన్య ఏనుగులు ఉన్నాయి. ఇవి తమిళనాడులోని హోసూరు, ధర్మపురి అటవీ ప్రాంతాల నుండి కౌండిన్య వైల్డ్‌లైఫ్ సాంక్చ్యురీ దాటి చిత్తూరు జిల్లాలోకి తరచుగా వస్తున్నాయి. ఏనుగుల దాడుల వల్ల జిల్లాలోని రైతులు విపరీతమైన నష్టాలు చవిచూస్తున్నారు. మామిడి, అరటి, చెరుకు, మొక్కజొన్న, వరి పంటలను ఏనుగులు రాత్రికి రాత్రే ధ్వంసం చేస్తుండటంతో వేల ఎకరాల పంటలు నాశనం అయ్యాయి. ఒక్కో రైతుకు రెండు నుండి మూడు లక్షల వరకు నష్టం కలిగిన ఘటనలు పలు చోట్ల నమోదయ్యాయి. రైతులు భయంతో పంటపొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గత దశాబ్దంలో ఏనుగుల దాడుల్లో జిల్లాలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పంటలతో పాటు ఇళ్లు, గోడలు, బోర్లు, చెరువుల గట్టులు కూడా ఏనుగుల దాడికి గురయ్యాయి. ప్రతి ఏడాది పంట నష్టానికి, ప్రాణ నష్టానికి గాను ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. అటవీ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా నిర్వహించే పరిశీలనల ఆధారంగా పంట నష్టం పరిహారం రూ.10 వేల నుండి రూ.50 వేల వరకు, ప్రాణ నష్టం పరిహారం రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు అందజేస్తున్నారు. అయినప్పటికీ ఏనుగుల బీభత్సం తగ్గకపోవడంతో రైతులు నిత్యభయంతో  జీవిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో ఏనుగు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతో ముందుకొచ్చారు. ఆయన చొరవతో కర్ణాటక రాష్ట్రంలోని శిక్షణ పొందిన నాలుగు కుంకి ఏనుగులను ముసలిమడుగుకు తరలించారు. వీటిలో రెండు మగ, రెండు ఆడ ఏనుగులు ఉన్నాయి. మళ్ళి ఒక ఏనుగు వచ్చింది. వీటిని అనుభవజ్ఞులైన మావూట్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణకు సిద్ధం చేశారు. స్థానిక వాతావరణానికి అలవాటు కలిగించడంతో పాటు, వన్య ఏనుగులతో ఎదురుపడినప్పుడు ఎలా స్పందించాలో, ఎలా తరలించాలో వీటికి క్రమంగా శిక్షణ ఇస్తున్నారు. కుంకి ఏనుగుల సహాయంతో ఇప్పటివరకు రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. పంట పొలాల్లోకి చొచ్చుకుపోయిన ఏనుగుల గుంపులను ముసలిమడుగు వైపు తరలించి తిరిగి అడవుల్లోకి పంపించడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. ఈ విజయాలతో ముసలిమడుగు కేంద్రం రాష్ట్రంలోనే ఆదర్శ శిక్షణ కేంద్రంగా నిలుస్తోంది. ఇక ఈ కేంద్రాన్ని పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అటవీ శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్ట్ రూపొందించాయి. ఇందులో వీక్షణా టవర్లు, విశ్రాంతి గృహాలు, విద్యార్థుల కోసం అవగాహన కేంద్రం, పిల్లల కోసం నేచర్ ట్రయిల్‌లు, పర్యావరణ ప్రదర్శన హాల్లు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు ఏనుగుల శిక్షణా కార్యక్రమాలను దగ్గరగా వీక్షించే అవకాశం కలిగించనున్నారు.

స్థానిక ప్రజలు కూడా ఈ ప్రాజెక్టును హర్షిస్తున్నారు. ఏనుగుల దాడులతో పంటలు, ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఇప్పుడు ఈ కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రం భరోసాగా మారింది. ఏనుగులను సులభంగా నియంత్రించడం వల్ల పంట రక్షణతో పాటు గ్రామీణుల భద్రత కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో  ఆదివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముసలిమడుగులోని కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఆయన ఏనుగుల శిక్షణా ప్రక్రియను పరిశీలించి, పర్యాటక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష జరపనున్నారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ .. ముసలిమడుగు కుంకి కేంద్రం రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశస్థాయి మోడల్ క్యాంప్‌గా మారే అవకాశం ఉంది. ఇది ఏనుగుల సంరక్షణ, పర్యాటక అభివృద్ధి రెండింటికీ ఆదర్శమవుతుందని తెలిపారు..చిత్తూరు జిల్లాలో ఏనుగు దాడుల వలన ఎన్నో సంవత్సరాలుగా భయాందోళనలో ఉన్న ప్రజలకు ఇప్పుడు ముసలిమడుగు క్యాంప్ ఆశాకిరణంగా మారింది. పంటల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టుగా ఈ కేంద్రం జిల్లా అభివృద్ధిలో సరి కొత్త అధ్యయనానికి నాంది పలుకనుంది. 

గంగ 1 శిక్షణ పొందుతున్న కుంకి ఏనుగులు 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *