మండుతున్న వంట నూనె ధరలు
మండుతున్న వంట నూనె ధరలు
పెరిగిన సామాన్యని వంటింటి బడ్జెట్
విదేశాల నుంచి దిగుమతి ఆగడమే కారణం
లీటర్ నూనె పైన రూ. 40 వరకు పెరుగుదల
అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియా యుద్ధం, దిగుమతులపై పెరిగిన ఒత్తిడి అన్నీ కలిసి దేశంలో వంట నూనె ధరలను అగ్నిలా రగిలిస్తున్నాయి. గత రెండు వారాలుగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ పెరుగుదల సాధారణ ధరల మార్పు కాదని, సరఫరా వ్యవస్థలో ఏర్పడిన గంభీరమైన అంతరాయానికి సంకేతమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిత్యావసరాలలో కీలకమైన వంటనూనె ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య కుటుంబాల ఖర్చులు అదుపుతప్పుతున్నాయి. మార్చి 2026 నాటికి సన్ఫ్లవర్, పామాయిల్, వేరుశనగ నూనెల ధరలు లీటరుకు రూ.10 నుంచి రూ.25 వరకు పెరిగాయి. ముఖ్యంగా వేరుశనగ నూనె ధరలు మరింతగా పెరిగి, కొన్ని ప్రాంతాల్లో లీటరుకు రూ.20 నుండి 25 వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల వరకూ రూ.110 నుండి 120 మధ్య ఉన్న వేరుశనగ నూనె ధరలు ఇప్పుడు రూ.140 దాటడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా సన్ఫ్లవర్ నూనె ధరలు రూ.152 నుంచి రూ.174 నుండి 190 వరకు పెరిగి గృహ వినియోగంపై గణనీయమైన భారం మోపుతున్నాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలే. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ రవాణా మార్గాలు ప్రభావితమయ్యాయి. నౌకాశ్రయాల మార్గదర్శకాలు మారడంతో పాటు, సరుకు రవాణాకు అవసరమైన బీమా ఖర్చులు పెరగడం వల్ల దిగుమతి వ్యయాలు భారీగా పెరిగాయి. భారత్ వంటనూనెల కోసం ఎక్కువగా విదేశీ మార్కెట్లపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ప్రభావం నేరుగా దేశీయ మార్కెట్పై పడింది. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా నుండి వచ్చే సన్ఫ్లవర్ నూనె సరఫరాలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ధరలు వెంటనే పెరుగుతున్నాయి.
మరోవైపు ఇండోనేషియా, మలేషియా నుంచి వచ్చే పామాయిల్ సరఫరాలో కూడా అనిశ్చితి నెలకొంది. దీంతో తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయంగా భావించిన పామాయిల్ కూడా వినియోగదారులకు భారమవుతోంది. హోల్సేల్ మార్కెట్లో రూ.110 ఉన్న పామాయిల్ ధర రూ.122 దాటగా, రిటైల్లో ఇంకా ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయి. రోజువారీగా ధరలు మారుతున్న పరిస్థితి ఏర్పడడంతో వ్యాపారులు కూడా స్పష్టమైన అంచనాలు చెప్పలేకపోతున్నారు. ధరల పెరుగుదలతో పాటు మరో సమస్య నిల్వల కొరత. వ్యాపారుల సమాచారం ప్రకారం ప్రస్తుత నిల్వలు గరిష్టంగా 10 రోజులు మాత్రమే సరిపడే అవకాశముందని అంచనా. తాజా సరఫరాలు ఎప్పుడు, ఎంత ధరకు వస్తాయన్నది అనిశ్చితంగా మారడంతో మార్కెట్లో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు ముందుగానే ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించడంతో ‘పానిక్ బాయింగ్’ కూడా ధరలను మరింతగా ఎగద్రొక్కడానికి కారణమవుతోంది. వంటనూనె ధరల పెరుగుదల ప్రభావం కేవలం గృహాలకే పరిమితం కాలేదు. హోటల్ మరియు టిఫిన్ సెంటర్ వ్యాపారాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. 15 లీటర్ల నూనె టిన్ ధర రూ.2,480 నుంచి రూ.2,740 వరకు పెరగడంతో చిన్న హోటళ్లు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వంటకాలకు ఉపయోగించే నూనె పరిమాణాన్ని తగ్గించడం, కొన్ని ఐటెమ్స్ తయారీని పరిమితం చేయడం, పని గంటలను తగ్గించడం వంటి చర్యలకు దిగుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఆహార పదార్థాల ధరలపై కూడా పడే అవకాశముందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
ఇక వంటనూనెలతో పాటు వంటగ్యాస్ ధరలు కూడా పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. గృహ వినియోగ సిలిండర్పై సుమారు రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 వరకు పెరుగుదల నమోదవడంతో రెస్టారెంట్ రంగం రెండు వైపుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ ద్వంద్వ భారం చివరకు వినియోగదారులపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ను ప్రభావితం చేస్తున్న అంశాలు అంతర్జాతీయంగానే ఉండటం వల్ల ధరలు త్వరగా తగ్గే సూచనలు కనిపించడం లేదు. సరఫరా మార్గాలు సవ్యంగా పునరుద్ధరించబడకపోతే, దిగుమతులు సాధారణ స్థాయికి చేరుకోకపోతే వంటనూనె ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, వంటనూనె ధరల ఈ అగ్ని మరికొంతకాలం మండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. సామాన్యుల గృహ బడ్జెట్ను కుదేలు చేస్తూ, వ్యాపార రంగాన్ని ఒత్తిడికి గురిచేస్తూ, నిత్యజీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ ధరల పెరుగుదలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాల నుంచీ డిమాండ్ పెరుగుతోంది.

