29, ఆగస్టు 2026, శనివారం

చెన్నై బెంగళూరు బుల్లెట్‌ రైలు అలైన్‌మెంట్‌కు రైల్ కార్పొరేషన్ ఆమోదం

చెన్నై బెంగళూరు బుల్లెట్‌ రైలు అలైన్‌మెంట్‌కు రైల్ కార్పొరేషన్ ఆమోదం

చిత్తూరు మీదుగా 306 కిలోమీటర్ల మార్గం.. 

 పలమనేరు కౌండిన్య అభయారణ్యం కింద 11.80 కి.మీ. భూగర్భ సొరంగం.. 

చెన్నై బెంగళూరులలో రెండు సొరంగ  మార్గాలు .. భూగర్భ రైల్వే స్టేషన్లు 

గుడిపాల మండలం రామాపురం వద్ద చిత్తూరు రైల్వే స్టేషన్‌

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

 చెన్నై బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) రూపొందించిన అలైన్‌మెంట్‌కు ఆమోదం లభించింది. సుమారు 306 కిలోమీటర్ల పొడవైన ఈ బుల్లెట్‌ ట్రైన్‌ మార్గం చెన్నై నుంచి పూనమల్లీ, పరందూర్‌, చిత్తూరు, కోలార్‌, వైట్‌ఫీల్డ్‌ మీదుగా బెంగళూరుకు చేరేలా రూపొందించారు. ఈ మార్గంలో చిత్తూరు జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ముఖ్యంగా పలమనేరు కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో సుమారు 11.80 కిలోమీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని నిర్మించేలా అలైన్‌మెంట్‌ రూపొందించారు. బెంగళూరులో కూడా రెండు భూగర్భ సొరంగాలు నిర్మించనున్నారు. అలాగే రెండు భూగర్భ రైల్వే స్టేషన్లను కూడా నిర్మిస్తారు. చెన్నైలో కూడా సొరంగ మార్గం, భూగర్భ రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది.

చెన్నై బెంగళూరు బుల్లెట్‌ ట్రైన్‌ మార్గానికి సంబంధించి సర్వేలు, భూసాంకేతిక పరిశీలనలు, భూమి స్వరూపం అధ్యయనం, రహదారులు, రైల్వే మార్గాలు, నదులు, ఇతర మౌలిక వసతుల పరిశీలన తదితర ప్రక్రియలను నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో చేపట్టారు. 2023లో చెన్నై నుంచి కోలార్‌ వరకు భూసర్వే పూర్తయినట్లు సమాచారం వెలువడగా, అనంతరం వైమానిక సర్వేలు కూడా నిర్వహించారు. 2024 సెప్టెంబర్‌లో చెన్నై బెంగళూరు మైసూరు బుల్లెట్‌ ట్రైన్‌ మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. 2026 ఫిబ్రవరి నాటికి చెన్నై బెంగళూరు విభాగానికి తుది అలైన్‌మెంట్‌ సర్వే పూర్తయినట్లు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ రూపొందించిన మ్యాప్‌ ప్రకారం చెన్నై నుంచి బయలుదేరే బుల్లెట్‌ ట్రైన్‌ పూనమల్లీ, పరందూర్‌ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోకి చేరి చిత్తూరు బుల్లెట్‌ ట్రైన్‌ స్టేషన్‌కు చేరుతుంది. అనంతరం కర్ణాటకలోని కోలార్‌, కోడిహళ్లి, వైట్‌ఫీల్డ్‌ మీదుగా బెంగళూరులోని బయ్యప్పనహళ్లికి చేరేలా మార్గాన్ని రూపొందించారు. ఈ మార్గంలో చెన్నై, పూనమల్లీ, పరందూర్‌, చిత్తూరు, కోలార్‌, కోడిహళ్లి, వైట్‌ఫీల్డ్‌, బయ్యప్పనహళ్లి ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. పరందూర్‌ను భవిష్యత్‌ స్టేషన్‌గా మ్యాప్‌లో చూపించారు. చిత్తూరు జిల్లాలో బుల్లెట్‌ ట్రైన్‌ స్టేషన్‌ ఏర్పాటు కావడం జిల్లాకు ఎంతో ప్రాధాన్యం కలిగించే అంశంగా మారింది. చిత్తూరు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలకు చెన్నై, బెంగళూరు నగరాలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రోడ్డు, సాధారణ రైళ్లపై ఆధారపడుతున్న ప్రజలకు బుల్లెట్‌ ట్రైన్‌ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. చిత్తూరు స్టేషన్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉండటంతో భవిష్యత్‌లో ఇది కీలక రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ ప్రాజెక్టులో చిత్తూరు జిల్లాకు అత్యంత ప్రత్యేకమైన నిర్మాణం కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం కింద నిర్మించనున్న భూగర్భ సొరంగం. మ్యాప్‌లో దీనిని కౌండిన్య అభయారణ్యం–పర్వత సొరంగంగా పేర్కొన్నారు. దీని పొడవు సుమారు 11.80 కిలోమీటర్లు. అభయారణ్యంలోని అటవీ, కొండ ప్రాంతాల మీదుగా రైల్వే మార్గాన్ని నిర్మించడం వల్ల పర్యావరణానికి కలిగే ప్రభావాన్ని తగ్గించేందుకు సొరంగ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూమి తవ్వకాలు, చెట్ల తొలగింపు వంటి చర్యలను తగ్గించే అవకాశం ఉంటుంది.

మొత్తం చెన్నై బెంగళూరు బుల్లెట్‌ ట్రైన్‌ మార్గంలో సుమారు 28.32 కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగాలు ఉండేలా మ్యాప్‌లో చూపించారు. చెన్నై పట్టణ ప్రాంతంలో ఒక సొరంగం, చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యం పర్వత ప్రాంతంలో 11.80 కిలోమీటర్ల సొరంగం, బెంగళూరు పట్టణ ప్రాంతంలో రెండు సొరంగాలు ప్రతిపాదించారు. వీటిలో చిత్తూరు జిల్లాలోని సొరంగమే అత్యంత పొడవైనదిగా ఉండనుంది. బెంగళూరు నగర పరిధిలో వైట్‌ఫీల్డ్‌, బయ్యప్పనహళ్లి ప్రాంతాల్లో కూడా భూగర్భ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. నగరంలో ఇప్పటికే ఉన్న భారీ నిర్మాణాలు, రహదారులు, రైల్వే మార్గాలు, జనసాంద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని భూగర్భ మార్గాలు, స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ముందు మరిన్ని సాంకేతిక పరిశీలనలు, భూసర్వేలు, భూగర్భ పరిశోధనలు, జలవిజ్ఞాన అధ్యయనాలు, సొరంగాల నిర్మాణానికి సంబంధించిన పరిశీలనలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో 2026 జూలైలో ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ చెన్నై బెంగళూరు విభాగానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను నవీకరించడం, అవసరమైన చోట అలైన్‌మెంట్‌ను పరిశీలించడం, డ్రోన్‌ సర్వేలు, భూగర్భ సాంకేతిక పరిశోధనలు, సొరంగాలు, రహదారులు, రైల్వే మార్గాలు, నదులను దాటే ప్రాంతాల నిర్మాణ రూపకల్పన వంటి పనులకు టెండర్‌ ప్రక్రియ చేపట్టింది. చెన్నై బెంగళూరు మధ్య సుమారు 306 కిలోమీటర్ల దూరాన్ని బుల్లెట్‌ ట్రైన్‌ సుమారు ఒక గంట 13 నిమిషాల్లో చేరుకునేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే చెన్నై, చిత్తూరు, బెంగళూరు మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. పరిశ్రమలు, వ్యాపారం, విద్య, వైద్యం, పర్యాటకం, ఉపాధి రంగాలకు ఇది కొత్త అవకాశాలను తీసుకురానుంది. ముఖ్యంగా రెండు ప్రధాన మహానగరాల మధ్య చిత్తూరు కీలక అనుసంధాన కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. మొత్తంగా చెన్నై బెంగళూరు బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌కు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఆమోదం లభించడం చిత్తూరు జిల్లాకు కీలక పరిణామంగా భావిస్తున్నారు. చిత్తూరు మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెట్టడంతోపాటు కౌండిన్య అభయారణ్యం కింద 11.80 కిలోమీటర్ల భూగర్భ సొరంగం నిర్మాణం ఈ ప్రాజెక్టులో జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *