26, ఆగస్టు 2026, బుధవారం

జగన్ ప్రకటనతో వేడెక్కిన స్థానిక రాజకీయం

జగన్ ప్రకటనతో వేడెక్కిన స్థానిక రాజకీయం

ప్రతి స్థానానికీ పోటీ తప్పదంటూ వైసీపీ అధినేత ఆదేశాలు

ఏకగ్రీవమైతే ఎమ్మెల్యేకు టికెట్‌ కట్‌.. నేతల్లో కలకలం

గత ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు.. ఈసారి పోటాపోటీకి రంగం సిద్ధం

చిత్తూరు జిల్లాలో పంచాయతీ నుంచి కార్పొరేషన్‌ వరకు రాజకీయ వేడి

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తాజా ప్రకటనతో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ప్రతి స్థానానికీ పార్టీ అభ్యర్థి పోటీ చేయాలని, ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏదైనా నియోజకవర్గంలో స్థానిక సంస్థల స్థానాలు ఏకగ్రీవంగా జరిగితే సంబంధిత ఎమ్మెల్యేకు భవిష్యత్తులో పార్టీ టికెట్‌ ఇవ్వడం కష్టమవుతుందని అధినేత హెచ్చరించిన నేపథ్యంలో స్థానిక వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. దీంతో రానున్న ఎన్నికలు గతంతో పోలిస్తే మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ కూడా ఎన్నికల కసరత్తును ముమ్మరం చేస్తోంది. తొలుత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పట్టణ ప్రాంతాల్లో రాజకీయ సందడి మొదలైంది. చిత్తూరు జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలు ఉన్నాయి. అనంతరం మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, గ్రామపంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అన్ని స్థాయిల్లోనూ అభ్యర్థుల ఎంపిక, బలాబలాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. 

*గత ఎన్నికల్లో వైసీపీ హవా*

గత స్థానిక సంస్థల ఎన్నికలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రభావాన్ని చాటుకుంది. మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగింది. గ్రామపంచాయతీల్లో కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నికయ్యారు. అయితే అప్పటి ఎన్నికల సమయంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు ఫలితాలను ప్రభావితం చేశాయి. టీడీపీ ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎన్నికలను బహిష్కరించింది. నామినేషన్ల సమయంలో తమ అభ్యర్థులను అడ్డుకున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. దీంతో అనేక స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు ప్రత్యర్థులు లేకపోవడంతో ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయి. వార్డు సభ్యుల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ స్థాయి వరకు అనేక స్థానాల్లో ఏకగ్రీవాలు జరిగాయి.

*ఈసారి పరిస్థితులు భిన్నం*

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్రామస్థాయిలోనూ రాజకీయ సమీకరణాలు మారాయి. పలువురు స్థానిక నాయకులు కూటమి పార్టీల వైపు వెళ్లగా, మరికొందరు తమ పాత రాజకీయ శిబిరాల్లోనే కొనసాగుతున్నారు. దీంతో ప్రతి గ్రామంలోనూ ఎవరి బలం ఎంత? ఎవరి వెంట ఎంతమంది ఉన్నారు? అనే లెక్కలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్‌ ఇచ్చిన ప్రతి స్థానానికీ పోటీ ఆదేశాలు వైసీపీ స్థానిక నాయకత్వంపై ఒత్తిడిని పెంచనున్నాయి. గతంలో అధికార పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవమైన స్థానాల్లో ఈసారి పోటీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే స్థానిక నేతల వ్యక్తిగత ప్రభావం, ఆర్థిక బలం, సామాజిక సమీకరణాలు, అనుచర బలం కీలకంగా మారనున్నాయి.

*ఏకగ్రీవాలకు బ్రేక్‌ పడేనా?*

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థుల వైపు గ్రామీణ ఓటర్లు మొగ్గు చూపడం సాధారణంగా కనిపిస్తుంది. అధికార పార్టీ మద్దతు ఉంటే గ్రామానికి అభివృద్ధి పనులు, నిధులు సులభంగా వస్తాయనే అభిప్రాయం కొంతమంది ఓటర్లలో ఉంటుంది. అందుకే కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ప్రతి స్థానానికీ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించడంతో ఏకగ్రీవాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఒకే గ్రామంలో వైసీపీ, కూటమి పార్టీల మధ్య బలమైన పోటీ ఉంటే సర్పంచ్‌ నుంచి వార్డు సభ్యుడి వరకు ఎన్నికల వాతావరణం తీవ్రంగా మారవచ్చు. గ్రామాల్లో వ్యక్తిగత సంబంధాలు, కుటుంబాల మధ్య ఉన్న పాత విభేదాలు కూడా ఎన్నికల సమయంలో రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.

*ఎమ్మెల్యేలకు పరీక్ష*

జగన్‌ ఆదేశాలు వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు కూడా పరీక్షగా మారనున్నాయి. తమ నియోజకవర్గంలో ప్రతి స్థానానికి పార్టీ అభ్యర్థిని నిలబెట్టడంతో పాటు గెలిపించాల్సిన బాధ్యత వారిపై పడనుంది. అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగినా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉండటంతో స్థానిక నేతలతో సమన్వయం కీలకం కానుంది. చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి ప్రాంతాల్లో స్థానిక రాజకీయాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. గత ఎన్నికల ఫలితాలు, 2024 అసెంబ్లీ ఎన్నికల తీర్పు, అనంతరం చోటుచేసుకున్న పార్టీ మార్పులు, స్థానిక నాయకుల ప్రభావం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పార్టీలు వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.

*శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి అవసరం*

స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామస్థాయిలో వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో రాజకీయ వేడి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సర్పంచ్‌, ఎంపీటీసీ, వార్డు సభ్యుడు వంటి పదవులు గ్రామాల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉండటంతో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా మారవచ్చు. ఇరు పక్షాలూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే నామినేషన్ల దశ నుంచే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మొత్తంగా జగన్‌ ఇచ్చిన ఏకగ్రీవం వద్దు.. ప్రతి స్థానానికీ పోటీ ఆదేశం వైసీపీకి క్షేత్రస్థాయిలో బలాన్ని పరీక్షించుకునే అగ్నిపరీక్షగా మారనుంది. అధికారంలో కూటమి, ప్రతిపక్షంలో వైసీపీ ఉండటంతో రెండు శిబిరాలు గ్రామస్థాయి నుంచి బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల వేట, వర్గాల సమీకరణ, పార్టీ మార్పులు, స్థానిక నేతల మధ్య చర్చలు ఇప్పటికే ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కనిపించిన ఏకగ్రీవాల పరంపరకు ఈసారి బ్రేక్‌ పడుతుందా? లేక స్థానిక సమీకరణాలు మళ్లీ ఏకగ్రీవాలకే దారితీస్తాయా? అన్నది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే తేలనుంది. అయితే ఈసారి చిత్తూరు జిల్లాలో గ్రామం నుంచి నగరం వరకు స్థానిక ఎన్నికల పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *