గంజాయి సాగుకు కేంద్రంగా కుప్పం
గంజాయి వ్యాపారం చేస్తున్న మాఫియా ముఠాలు
విద్యార్థులు, కళాశాలలు లక్ష్యంగా గంజాయి వ్యాపారం
పల్లెలకు వ్యాపిస్తున్న గంజాయి వ్యాపారం
పక్క రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి గంజాయి దిగుమతి
చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. నిత్యం వేలాది మంది వ్యాపార నిమిత్తం రాకపోకలు రాగిస్తుంటారు. గంజాయి రవాణాకు చిత్తూరు జిల్లా నిలయంగా మారుతుంది. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన పాలసముద్రం మండలం మొదలుకొని గుడిపాల, ఎస్.ఆర్.పురం మండలం, గంగాధర నెల్లూరు మండలం, పుంగనూరు మండలం, పలమనేరు, కుప్పం, పుత్తూరు, నగరి ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండడంతో కొందరు రహస్య మార్గాల ద్వారా గంజాయి ఫ్యాకెట్లను జిల్లాకు తరలిస్తూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
కొందరు అక్రమార్కులు డీలర్లను ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థులు గంజాయి మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎస్.ఆర్.పురం మండలం, పాలసముద్రం మండలం, గుడిపాల మండలంలో పోలీసుల కన్నుల కప్పి గంజాయి రవాణా సాగిస్తున్నారు. కొందరు స్మగ్లర్స్. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంమైన తొట్టికండ్రిక గ్రామానికి చెందిన కొందరు యువకులు యథేచ్చగా గంజాయి సేవిస్తున్నారు.
పదిరోజుల వ్యవదిలో పలమనేరు పోలీసులు 12 కేసులు నమోదు చేసి 35 నేరస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి సుమారు 50 కేజీల గంజాయి, 2 మోటారు సైకిల్స్ స్వాదీనం చేసుకుని, 50 Kg ల గంజాయి మొక్కలను ద్వంసం చేశారు. పలమనేరు పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వెనుక గంటవూరు సమీపంలో 2 కేసులు నమోదు చేసి 12 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, 11.200 KG ల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. కుప్పం మండలంలో 2 కేసులు నమోదు చేసి, ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి, 2 KG ల గంజాయిని స్వాదినం చేసుకొని, 50 Kg ల గంజాయి మొక్కలను ద్వంసం చేశారు. పుంగనూరు మండలంలో 2 కేసులు నమోదు చేసి, 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి సుమారు 10KG ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. గంగవరం మండలంలో ఒక కేసు నమోదు చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి, 3.2 KG ల గంజాయి స్వాదీనం చేసుకోవడమైనది.
పాలసముద్రం మండలం తొట్టకండ్రిక సమీపంలోని సాయినగర్ లో ఉండే ఓ యువకుడు నిత్యం గంజాయి సేవించి స్థానికంగా ఉన్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కొన్ని గంటల సమయంలో విడిచిపెట్టేశారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులు, ఉద్యోగులు గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారు.
మార్చి 3న చిత్తూరు జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. స్మగ్లర్ల నుంచి రూ.2 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండల కేంద్రంలో యువకులనే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో.. పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అరణియార్ డ్యామ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. నిందితుల నుంచి రూ.1,90,000 విలువైన గంజాయితో పాటు.. ఒక బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
జూన్ 22న ఓ మహిళ బురఖా ధరించి ట్రావెలింగ్ బ్యాగ్లో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా చిత్తూరు పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాలో మోస్టు వాంటెడ్ క్రిమినల్ మోహన్ బాబును అదుపులోకి తీసుకుని మూడు లక్షల రూపాయలు విలువ గల దాదాపు 14 కేజీల గంజాయిని చిత్తూరు పోలీసులు సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా ముఠాను చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి మీడియా ముందు హాజరు పరిచారు.
చిత్తూరులో గత రెండేళ్లుగా ఓ ముఠా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అక్రమ రవాణా సాగిస్తూ వస్తుందనీ, అనకాపల్లి నుంచి వచ్చే గంజాయి చిత్తూరులో చేతులు మారుతున్నాయనే సమాచారం పోలీసులు అందుకున్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా ఉంచారు. జూలై 18న గోపాలపురం బస్టాప్ వద్ద గంజాయితో వచ్చిన సేలంకు చెందిన ఇలవరసన్, కవిన్ కుమార్, వాటిని కొనుగోలు చేసి వ్యాపారం చేయడానికి వచ్చిన ఆరుగురిని అరెస్టు చేసారు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన భాస్కర్, తిరువణ్ణామలైకు చెందిన అజిత్, స్థానిక జోగుల కాలనీకి చెందిన రాజ్కుమార్, మురగానపల్లికి చెందిన లలిన్ కుమార్, మూడో గేటులోని లక్ష్మీనగర్కు చెందిన చంద్రు, మార్కెట్ వీధికి చెందిన పురుషోత్తం ఉన్నారు. వీరి నుంచి రూ.3 లక్షల విలువైన 20 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫిబ్రవరి 21న మహాసముద్రం టోల్ప్లాజా వద్ద సీఐ నరసింహారెడ్డి, ఎస్ఐ మల్లికార్జున్రెడ్డి, తహసీల్దార్ బెన్నురాజ్, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా చిత్తూరు వైపు నుంచి వస్తున్న కారులో 96 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన శంబు, విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఈ గంజాయిని కొని బెంగళూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కోయంబత్తూరుకు చెందిన శంబు కారు డ్రైవర్ రమేశ్ పరారయ్యారు. కారులో ఉన్న కోయంబత్తూరు జిల్లా వసంతరామ్ గార్డెన్కు చెందిన ఎం.ఎన్. అబ్దుల్ జలీల్, కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లా నెల్లికొట్టుపరంబిల్ హౌస్కు చెందిన ఎన్పీ మురళీధరన్, కేతిల్ హౌస్కు చెందిన కె.అభిలాష్ పట్టుబడ్డారు.
గంజాయి అక్రమ రవాణాపై క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాల్సిన పోలీసులు, అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గంజాయి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో గంజాయి నిషేధం కేవలం మాటలకే పరిమితం అవుతోంది. మొక్కుబడిగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు మూలలను ఛేదించాల్చిన ఉంది. ఇప్పటికే కళాశాల విద్యార్థులు పువురు గంజాయికి బానిసలు అయ్యారు. గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోకుంటే, మారుమూల గ్రామాలను, సామాన్య పౌరులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.